Telugu Global
NEWS

భారతహాకీ జాకీలు మన్ ప్రీత్, రాణీ రాంపాల్

ఒలింపిక్స్ లో భారత్ కు ఎనిమిది బంగారు పతకాలు తెచ్చిపెట్టిన ఏకైక క్రీడ హాకీకి మంచిరోజులొచ్చాయి. 1980 మాస్కో ఒలింపిక్స్ తర్వాత మరోసారి పతకం ఆశలు చిగురించాయి. మిడ్ ఫీల్డర్లు మన్ ప్రీత్ సింగ్, రాణీ రాంపాల్ ల నాయకత్వంలో భారత పురుషుల, మహిళల జట్లు త్వరలో జరిగే టోక్యో ఒలింపిక్స్ కు అర్హత సాధించమే కాదు..కుదురైన ఆటతీరుతో ఏదో ఒక పతకం సాధించగలమన్న ధీమాను కలిగిస్తున్నాయి. 1980 మాస్కో ఒలింపిక్స్ తర్వాత దారితప్పి, పాతాళానికి పడిపోయిన […]

భారతహాకీ జాకీలు మన్ ప్రీత్, రాణీ రాంపాల్
X

ఒలింపిక్స్ లో భారత్ కు ఎనిమిది బంగారు పతకాలు తెచ్చిపెట్టిన ఏకైక క్రీడ హాకీకి మంచిరోజులొచ్చాయి. 1980 మాస్కో ఒలింపిక్స్ తర్వాత మరోసారి పతకం ఆశలు చిగురించాయి.

మిడ్ ఫీల్డర్లు మన్ ప్రీత్ సింగ్, రాణీ రాంపాల్ ల నాయకత్వంలో భారత పురుషుల, మహిళల జట్లు త్వరలో జరిగే టోక్యో ఒలింపిక్స్ కు అర్హత సాధించమే కాదు..కుదురైన ఆటతీరుతో ఏదో ఒక పతకం సాధించగలమన్న ధీమాను కలిగిస్తున్నాయి.

1980 మాస్కో ఒలింపిక్స్ తర్వాత దారితప్పి, పాతాళానికి పడిపోయిన భారత హాకీ తిరిగి గాడిలో పడింది. పురుషుల, మహిళల విభాగాలలో భారతజట్లు నిలకడగా రాణించడమే కాదు..వరుసగా రెండోసారి ఒలింపిక్స్ కు అర్హత సాధించడం ద్వారా ఏదో ఒక పతకం సాధించగలమన్న ధీమాతో ఉన్నాయి.

మిడ్ ఫీల్డర్ మన్ ప్రీత్ సింగ్ నాయకత్వంలోని భారత పురుషులజట్టు అత్యుత్తమంగా 4వ ర్యాంక్ లో నిలిస్తే, రాణి రాంపాల్ కెప్టెన్సీలోని మహిళల జట్టు 9వ ర్యాంకర్ గా ఉంది. ప్రపంచంలోనే ఇద్దరు అత్యుత్తమ ప్లేయర్లుగా గుర్తింపు పొందిన మన్ ప్రీత్ సింగ్, రాణి రాంపాల్…భారతజట్లకు స్ఫూర్తిదాయకమైన నాయకత్వం అందిస్తూ విజయపథంలో నడిపిస్తున్నారు.

మిడ్ ఫీల్డ్ మాంత్రికుడు మన్ ప్రీత్ సింగ్…

మిడ్ ఫీల్డర్ గా ఆటను నియంత్రిస్తూ భారత్ ను అత్యంత విజయవంతమైనజట్లలో ఒకటిగా నిలిపిన కెప్టెన్ మన్ ప్రీత్ సింగ్ ఈ మధ్యనే ఓ అరుదైన ఘనతను సొంతం చేసుకొన్నాడు.

2019 సంవత్సరానికి అంతర్జాతీయ హాకీ సమాఖ్య అత్యుత్తమ ప్లేయర్ అవార్డు గెలుచుకొన్నాడు. ఈ గౌరవం సంపాదించిన భారత హాకీ తొలిప్లేయర్ గా నిలిచాడు.

లాసానేలో అంతర్జాతీయ హాకీ సమాఖ్య అధికారికంగా ఈ అవార్డులను ప్రకటించింది. ప్రపంచ వ్యాప్తంగా హాకీ అభిమానులు, మీడియా ప్రతినిధులు, ప్రముఖులతో నిర్వహించిన ఆన్ లైన్ పోలింగ్ లో మన్ ప్రీత్ సింగ్ కు 32.5 శాతం ఓట్లు పోలయ్యాయి.

బెల్జియం ఆటగాడు ఆర్థర్ వాన్ డ్యూరెన్, అర్జెంటీనా స్టార్ ప్లేయర్ లూకాస్ విల్లాల నుంచి మన్ ప్రీత్ కు ప్రధానంగా పోటీ ఎదురయ్యింది. 27 సంవత్సరాల మన్ ప్రీత్ సింగ్ ప్రపంచ హాకీ అత్యుత్తమ మిడ్ ఫీల్డర్ గా కూడా గుర్తింపు తెచ్చుకొన్నాడు.

భారత హాకీ అత్యంత విజయవంతమైన కెప్టెన్ గా నిలిచిన మన్ ప్రీత్ సారథ్యంలోనే భారత్ తన ర్యాంక్ ను అత్యుత్తమంగా 4కు మెరుగుపరచుకోడం తో పాటు.. 2020 టోక్యో ఒలింపిక్స్ కు సైతం అర్హత సంపాదించగలిగింది.

అంతేకాదు..ప్రపంచ నంబర్ వన్ బెల్జియం, మూడో ర్యాంకర్ నెదర్లాండ్స్, ప్రపంచ చాంపియన్ ఆస్ట్ర్రేలియా లాంటి జట్లపైన సైతం భారతజట్టు సంచలన విజయాలు సాధించింది.

2011లో తన హాకీ కెరియర్ ప్రారంభించిన మన్ ప్రీత్ సింగ్ కు 2012 లండన్ ఒలింపిక్స్, 2016 రియో ఒలింపిక్స్ లో పాల్గొనడంతో పాటు..260కి పైగా అంతర్జాతీయ మ్యాచ్ ల్లోభారత్ కు ప్రాతినిథ్యం వహించిన అరుదైన రికార్డు ఉంది.

భారత హాకీ రాణీ..రాంపాల్ భారత మహిళా హాకీ జట్టు కెప్టెన్ రాణి రాంపాల్ సైతం ఏమాత్రం తక్కువ కాదు. హర్యానాలోని కురుక్షేత్ర జిల్లాకు చెందిన ఓ జట్కావాలా కుమార్తెగా ఉన్న రాణి భారత మహిళా హాకీకే గర్వకారణంగా నిలిచింది. భారత మహిళా హాకీజట్టుకు కెప్టెన్ గా వ్యవహరిస్తున్న రాణి రాంపాల్..మరో 24 మంది విఖ్యాత క్రీడాకారులతో పోటీ పడి వరల్డ్ గేమ్స్ అథ్లెట్ ఆఫ్ ద ఇయర్ అవార్డు గెలుచుకొంది.

ఓ నిరుపేద కుటుంబం నుంచి ఎన్నో కష్టనష్టాలు ఎదుర్కొని 13 సంవత్సరాల చిరుప్రాయంలోనే భారతహాకీలో దూసుకొచ్చిన రాణి 15 సంవత్సరాల వయసులోనే.. భారతజట్టులో సభ్యురాలిగా ప్రపంచకప్ బరిలో నిలిచింది.

తన సత్తా చాటుకోడం ద్వారా…ప్రపంచ మహిళాహాకీ అత్యుత్తమ ప్లేయర్లలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకొంది. 2016 రియో ఒలింపిక్స్, 2020 టోక్యో ఒలింపిక్స్ కు భారతజట్టు అర్హత సాధించడంలో ప్రధానపాత్ర వహించిన రాణికి 2020 సంవత్సరానికి ప్రపంచ స్థాయిలో నిర్వహించిన.. వరల్డ్ గేమ్స్ అథ్లెట్ ఆఫ్ ది ఇయర్ పోలింగ్ లో లక్షా 99వేల 477 ఓట్లు పోలయ్యాయి. మరో 24 మంది క్రీడాకారులతో ఈ అవార్డు కోసం రాణి రాంపాల్ పోటీపడింది.

ప్రపంచ వ్యాప్తంగా క్రీడాభిమానులుఈ ఆన్ లైన్ పోలింగ్ లో పాల్గొన్నారు. చివరకు 25 సంవత్సరాల రాణి రాంపాల్ నే అరుదైన ఈ పురస్కారం వరించింది.

భారత క్రీడాప్రాధికార సంస్థలో సహాయ శిక్షకురాలిగా పనిచేస్తున్న రాణి రాంపాల్.ఇటీవలే అవుట్ ఆఫ్ టర్న్ ప్రమోషన్ ద్వారా లెవెల్-10 కోచ్ గా ఎదిగింది.

2016 లో అర్జున పురస్కారం అందుకొన్న రాణి నాయకత్వంలోనే భారతజట్టు 2018 ఆసియాక్రీడల హాకీలో రజత పతకం అందుకొంది. భారతజట్టు తరపున 240 అంతర్జాతీయ మ్యాచ్ లు ఆడిన రాణి రాంపాల్ కు 130కి పైగా గోల్స్ సాధించిన రికార్డు సైతం ఉంది. భారతజట్టును అత్యుత్తమంగా 9వ ర్యాంక్ కు చేర్చిన ఘనత సైతం రాణీ రాంపాల్ కే దక్కుతుంది.

త్వరలో జరిగే టోక్యో ఒలింపిక్స్ లో భారత్ కు ఏదో ఒక పతకం సంపాదించిపెట్టాలన్న లక్ష్యంతో మన్ ప్రీత్ సింగ్, రాణీ రాంపాల్ తమ తమ జట్లతో కలసి కఠోరసాధన చేస్తున్నారు.

First Published:  9 March 2020 8:15 PM GMT
Next Story