Telugu Global
International

కరోనాతో అమెరికా విలవిల " న్యూయార్క్‌లోనే ఎక్కువ కేసులు

కరోనా వైరస్‌తో అమెరికా విలవిల్లాడుతోంది. ఇటలీ తర్వాత ఆ స్థాయిలో అమెరికాలో కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటివరకు అమెరికాలో 43 వేల 847 కరోనా కేసులు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. ఇందులో 557 మంది చనిపోయారు. సోమవారం ఒక్కరోజే 140 మంది ప్రాణాలు కోల్పోయారు. రోజుల వ్యవధిలో వేలాదిగా కరోనా కేసులు నమోదవుతుండడం కలకలం రేపుతోంది. న్యూయార్క్‌లో మాత్రం పరిస్థితి రోజురోజుకు దిగజారుతోంది. అమెరికాలో 50 రాష్ట్రాలు ఉంటే..అందులో న్యూయార్క్‌లోనే ఎక్కువ కేసులు నమోదువుతున్నాయి. 16 రాష్ట్రాల్లో ఇప్పటికే […]

కరోనాతో అమెరికా విలవిల  న్యూయార్క్‌లోనే ఎక్కువ కేసులు
X

కరోనా వైరస్‌తో అమెరికా విలవిల్లాడుతోంది. ఇటలీ తర్వాత ఆ స్థాయిలో అమెరికాలో కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటివరకు అమెరికాలో 43 వేల 847 కరోనా కేసులు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. ఇందులో 557 మంది చనిపోయారు. సోమవారం ఒక్కరోజే 140 మంది ప్రాణాలు కోల్పోయారు. రోజుల వ్యవధిలో వేలాదిగా కరోనా కేసులు నమోదవుతుండడం కలకలం రేపుతోంది.

న్యూయార్క్‌లో మాత్రం పరిస్థితి రోజురోజుకు దిగజారుతోంది. అమెరికాలో 50 రాష్ట్రాలు ఉంటే..అందులో న్యూయార్క్‌లోనే ఎక్కువ కేసులు నమోదువుతున్నాయి. 16 రాష్ట్రాల్లో ఇప్పటికే లాక్‌డౌన్ ప్రకటించారు. ఇంటికే పరిమితం కావాలని ఆదేశాలు జారీ చేశారు. న్యూయార్క్‌లో ప్రతి రోజు 5 వేల కొత్త కేసులు బయటపడుతున్నాయి. సోమవారం రాత్రి నాటికి ఇక్కడ 21వేల 689 కేసులు దాటాయి. ఇప్పటివరకూ 157 మంది మరణించారు.

సోమవారం రాత్రి నుంచి అమెరికాలోని 16 రాష్ట్రాల్లో లాక్‌డౌన్ ప్రకటించారు. ఏప్రిల్‌ మొదటి వారం లేదా రెండో వారం వరకు కొనసాగించే అవకాశం ఉంది. అత్యవసరమైతే తప్ప ఇంటి నుంచి ఎవరూ బయటకు రావద్దని నిబంధనలు విధించారు. రెండు రోజుల కిందట అమెరికా ఉపాధ్యక్షుడు మైకీ పెన్సీ బృందంలో పనిచేస్తున్న ఓ అధికారికి కరోనా వైరస్ సోకినట్టు నిర్ధారణ అయింది. దీంతో అతడ్ని హుటాహుటిన ఆసుపత్రిలోని ఐసోలేషన్ వార్డుకు తరలించారు. మొట్టమొదటిసారి అమెరికా అధ్యక్షుడి అధికార నివాసమైన వైట్‌హౌస్ అధికారికే కరోనా వైరస్ సోకడంతో కలకలం రేగింది. కాగా, ప్రెసిడెంట్ ట్రంప్‌తో కానీ, పెన్సీతో కానీ వైరస్ బారిన పడిన వ్యక్తి నేరుగా సంప్రదించిన సందర్భాలు లేవని పెన్సీ కార్యాలయ అధికార ప్రతినిధి కేటీ మిల్లర్ వెల్లడించారు.

అమెరికాలో వైద్యం భారీ ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. కరోనా పరీక్షలు చేయించుకోవాలంటే ఇన్సూరెన్స్‌ ఉండాల్సిందే. లేకపోతే కరోనా టెస్ట్ లకు అయ్యే ఖర్చులను భరించలేమని కొందరు అమెరికన్ లు అంటున్నారు. చిన్న యాక్సిడెంట్‌ జరిగి ఆసుపత్రికి వెళితే జేబులు ఖాళీ అవుతాయి. ఇక కరోనా పరీక్షలకు వెళ్లాలంటేనే బీమా ఉండాల్సిదేనని అంటున్నారు. అయితే అమెరికాలో దాదాపు 15 శాతం మందికి ఇన్సూరెన్స్‌ లేదు. దీంతో వీరంతా ఇప్పుడు ఆసుపత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకోవాలంటే భయపడుతున్నారు.

మొదట కరోనా వైరస్‌ను అమెరికా లైట్‌గా తీసుకుందన్న విమర్శలు వ్యక్తమయ్యాయి. చైనాను ముప్పుతిప్పలు పెట్టిన కరోనా అమెరికాలోకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ ప్రెసిడెంట్‌ ట్రంప్‌ పట్టనట్టు వ్యవహరించారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. WHO సైతం అమెరికా తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసింది. మొదట్లో చూపిన నిర్లక్ష్యానికి ప్రస్తుతం మూల్యం చెల్లించుకుంటోంది అమెరికా.

కరోనా వైరస్‌ కేసుల నమోదులో ప్రపంచంలోనే మూడో స్థానంలో నిలిచింది అగ్రరాజ్యం. కరోనా నివారణ, ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు ప్రత్యేక నిధి ఏర్పాటు చేస్తున్నామని ప్రకటిస్తున్నా ఇప్పటికీ అతీగతీ లేదు.

మొత్తంగా వైరస్‌ భయంతో అమెరికా అల్లాడిపోతోంది. అగ్రరాజ్యమే దిక్కుతోచని పరిస్థితి ఎదుర్కొంటుండడంతో అనేక దేశాలు భీతిల్లిపోతున్నాయి.

First Published:  24 March 2020 11:03 PM GMT
Next Story