Telugu Global
National

కరోనా పై పోరుకు కదలిన భారత క్రీడాకారులు

సచిన్ 50 లక్షల విరాళం, సింధు 10 లక్షలు ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ ను భారత్ దీటుగా ఎదుర్కొనడానికి 21 రోజుల లాక్ డౌన్ అస్త్రాన్ని ప్రయోగించింది. జనాభాపరంగా ప్రపంచంలోనే రెండో అతిపెద్ద దేశం భారత్ లోని 130 కోట్ల జనాభాను వైరస్ బారిన పడకుండా కాపాడుకోడమే సమష్టి లక్ష్యంగా మారింది. కేంద్ర, రాష్ట్ర్ర ప్రభుత్వాలు, స్వచ్చంధ సేవాసంస్థలు ఓవైపు లాక్ డౌన్ సమయంలో ఉపాధికోల్పోయిన సామాన్యజనాన్ని ఆదుకోవడానికి భారీగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం […]

కరోనా పై పోరుకు కదలిన భారత క్రీడాకారులు
X
  • సచిన్ 50 లక్షల విరాళం, సింధు 10 లక్షలు

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ ను భారత్ దీటుగా ఎదుర్కొనడానికి 21 రోజుల లాక్ డౌన్ అస్త్రాన్ని ప్రయోగించింది. జనాభాపరంగా ప్రపంచంలోనే రెండో అతిపెద్ద దేశం భారత్ లోని 130 కోట్ల జనాభాను వైరస్ బారిన పడకుండా కాపాడుకోడమే సమష్టి లక్ష్యంగా మారింది.

కేంద్ర, రాష్ట్ర్ర ప్రభుత్వాలు, స్వచ్చంధ సేవాసంస్థలు ఓవైపు లాక్ డౌన్ సమయంలో ఉపాధికోల్పోయిన సామాన్యజనాన్ని ఆదుకోవడానికి భారీగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే 1.70 లక్షల కోట్ల రూపాయల ప్యాకేజీతో ఆపన్నులను ఆదుకోవాలని నిర్ణయించింది.

మూడుమాసాలపాటు 80 కోట్ల మంది ప్రజలకు ఆహారభద్రత కల్పించనున్నట్లు ప్రకటించింది. మరోవైపు సినీ, క్రీడారంగ ప్రముఖులు సైతం తమవంతుగా భారీగా విరాళాలు అందచేయటం మొదలు పెట్టారు.

సచిన్ 50 లక్షల రూపాయల విరాళం…

భారత క్రీడారంగంలో సేవాకార్యక్రమాలు నిర్వహించడంలో క్రికెటర్ మాస్టర్ సచిన్ టెండుల్కర్ తర్వాతే ఎవరైనా. అప్నాలయ్ ట్రస్టు ద్వారా ముంబై మహానగరంలో లక్షలాదిమంది బాలలకు, అట్టడుగువర్గాల పిల్లలకు పలు రకాలుగా సేవలు అందిస్తున్న సచిన్…కరోనా వైరస్ తో పోరుకు తనవంతుగా 50 లక్షల రూపాయల విరాళాన్ని ప్రకటించాడు.

ఇందులో 25 లక్షల రూపాయలను ప్రధానమంత్రి సహాయనిధికి, మరో 25 లక్షల రూపాయలను మహారాష్ట్ర్ర ముఖ్యమంత్రి సహాయనిధికి అందచేయాలని నిర్ణయించాడు.

పీవీ సింధు 10 లక్షలు…

భారత బ్యాడ్మింటన్ క్వీన్ పీవీ సింధు తనవంతుగా 10 లక్షల రూపాయలు ప్రకటించింది. తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర్రాల ముఖ్యమంత్రుల సహాయ నిధికి చెరో 5 లక్షల రూపాయలు అందచేయాలని నిర్ణయించింది.

పఠాన బ్రదర్స్ 4 వేల మాస్క్ లు…

బరోడా క్రికెట్ జోడీ ఇర్ఫాన్ పఠాన్, యూసుఫ్ పఠాన్ కలసి తమవంతుగా బరోడా పోలీసులకు 4వేల కరోనా వైరస్ నిరోధక మాస్క్ లను అందచేశారు. భారత మాజీ ఓపెనర్, బీజేపీ ఎంపీ గౌతం గంభీర్…పార్లమెంట్ సభ్యుడిగా తన నిధుల నుంచి 50 లక్షల రూపాయలను ఢిల్లీలో కరోనా వైరస్ నివారణకు అందచేశాడు.

బజరంగ్ పూనియా 6 నెలల జీతం…

భారత వస్తాదు, ఇండియన్ రైల్వేస్ ఉద్యోగి బజరంగ్ పూనియా తన ఆరుమాసాల జీతాన్ని కరోనా వైరస్ నివారణకు విరాళంగా ప్రకటించాడు. భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఇప్పటికే ఓ ట్రస్ట్ ద్వారా లక్ష రూపాయల విలువైన వైద్యసామాగ్రిని అందించాడు.

బెంగాల్ క్రికెట్ సంఘం తన వాటాగా 25 లక్షల రూపాయలను ప్రకటించింది. ఐపీఎల్ ద్వారా కోట్లకు పడగలెత్తిన భారత కెప్టెన్ విరాట్ కొహ్లీ, రోహిత్ శర్మ, చీఫ్ కోచ్ రవి శాస్త్రి లాంటి ప్రముఖులు ఇంకా తమవంతును ప్రకటించకుండా మీనమేషాలు లెక్కపెడుతున్నారు.

టోలీవుడ్ హీరో, జనసేన అధినేత పవన్ కల్యాణ్ 2 కోట్ల రూపాయలు, స్టార్ హీరోలు మహేశ్ బాబు, ప్రభాస్ చెరో కోటి రూపాయలు, రామ్ చరణ్ తేజ్ 70 లక్షల రూపాయలు…ఇప్పటికే కరోనా వైరస్ పోరాట నిధికి తమవంతుగా అందచేశారు.

అయితే… వేలకోట్ల రూపాయలు వ్యాపారం చేసే ముంబై హీరోలు మాత్రం.. ఇంత వరకూ ఎలాంటి సాయాన్ని ప్రకటించకపోడం విశేషం.

First Published:  27 March 2020 8:20 AM GMT
Next Story