Telugu Global
National

తెలుగు రాష్ట్రాలను భయపెడుతున్న నిజాముద్దీన్ ప్రార్థనలు... పరిష్కారమేంటి..?

తెలంగాణలో కరోనా తీవ్రత ఏప్రిల్ 7 నాటికి తగ్గుముఖం పడుతుందని… అప్పటికి కరోనా పాజిటీవ్ కేసులు నమోదు కాకుంటే ‘కరోనా ఫ్రీ తెలంగాణ’గా ప్రకటిస్తామని సీఎం కేసీఆర్ చెప్పారు. రాష్ట్ర సరిహద్దులన్నీ మూసేసి… లాక్‌డౌన్ విధించడంతో ఇక ఎవరికీ కరోనా సోకదని… కరోనా తీవ్రతను తగ్గించేయగలుగుతున్నామని ప్రభుత్వం భావించింది. కానీ ఖైరతాబాద్‌లో ఒక వృద్ధుని మృతి ప్రభుత్వ అంచనాలను తలకిందులు చేసింది. అతని ట్రావెల్ హిస్టరీ ఆధారంగా చాపకింద నీరులా కరోనా ప్రవేశించిన తీరును కనుగొన్నారు. ఇప్పుడు […]

తెలుగు రాష్ట్రాలను భయపెడుతున్న నిజాముద్దీన్ ప్రార్థనలు... పరిష్కారమేంటి..?
X

తెలంగాణలో కరోనా తీవ్రత ఏప్రిల్ 7 నాటికి తగ్గుముఖం పడుతుందని… అప్పటికి కరోనా పాజిటీవ్ కేసులు నమోదు కాకుంటే ‘కరోనా ఫ్రీ తెలంగాణ’గా ప్రకటిస్తామని సీఎం కేసీఆర్ చెప్పారు. రాష్ట్ర సరిహద్దులన్నీ మూసేసి… లాక్‌డౌన్ విధించడంతో ఇక ఎవరికీ కరోనా సోకదని… కరోనా తీవ్రతను తగ్గించేయగలుగుతున్నామని ప్రభుత్వం భావించింది.

కానీ ఖైరతాబాద్‌లో ఒక వృద్ధుని మృతి ప్రభుత్వ అంచనాలను తలకిందులు చేసింది. అతని ట్రావెల్ హిస్టరీ ఆధారంగా చాపకింద నీరులా కరోనా ప్రవేశించిన తీరును కనుగొన్నారు. ఇప్పుడు ఆ ఘటన రెండు తెలుగు రాష్ట్రాలను భయపెడుతోంది.

ఖైరతాబాద్‌లో నివసించే 73 ఏండ్ల వృద్దుడు గ్లోబల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. వైద్యులకు అనుమానం వచ్చి అతని రక్తాన్ని పరీక్షించగా కరోనా పాజిటీవ్ అని తేలింది. అయితే అతనికి ఫారెన్ ట్రావెల్ రికార్డు కూడా లేదు. దీంతో మరింత లోతుగా విచారించగా ఈ నెల 13 నుంచి 15 వరకు ఢిల్లీ నిజాముద్దీన్‌లో జరిగిన మర్కజ్ ప్రార్థనలకు హాజరైనట్లు తెలిసింది.

అప్పుడే ప్రభుత్వం అప్రమత్తమై ఢిల్లీ సర్కానును సంప్రదించగా… నిజాముద్దీన్ పోలీస్ స్టేషన్ సమీపంలోనే ఈ మర్కజ్ ప్రార్థనలు నిర్వహించినట్లు… దీనికి 75 దేశాల నుంచి 2వేల మందికి పైగా పాల్గొన్నట్లు తెలిసింది. చాలా మంది ఆ ప్రార్థనల వేదిక వద్దనే నిద్రించారని… మరొ కొంత మంది విదేశీయులు అక్కడే ఉన్న ఆరంతస్తుల డార్మిటరీలో విశ్రాంతి తీసుకున్నట్లు సమాచారం ఇచ్చారు.

ప్రార్థనల అనంతరం రైళ్లు, బస్సుల్లో చాలా మంది వారి స్వస్థలాలకు వెళ్లిపోయారు. అలా ఆ ప్రార్థనల్లో పాల్గొన్న వారికే కరోనా సోకినట్లు అధికారులు గుర్తించారు. తెలుగు రాష్ట్రాల నుంచి 500 మందికి పైగా ఈ ప్రార్థనల్లో పాల్గొన్నట్లు గుర్తించారు. ఇక ప్రార్థనల్లో పాల్గొన్నవారిలో 300 మందికి కరోనా లక్షణాలు ఉన్నాయని తేలింది. వీరిని పూర్తిస్థాయిలో పరీక్షించగా పలువురికి కరోనా ఉన్నట్లు తేలింది.

మరోవైపు తెలంగాణలో ప్రార్థనల్లో పాల్గొన్న వారిలో ఆరుగురు కరోనాతో మృతి చెందడం ప్రభుత్వాన్ని కలవరపెడుతోంది. అక్కడి ప్రార్థనల్లో పాల్గొన్న వారి వివరాలు లేకపోవడంతో… వాళ్లందరూ స్వచ్చందంగా వచ్చి రిపోర్టు చేయాలని ప్రభుత్వం కోరుతోంది.

తెలంగాణలో హైదరాబాద్ , ఉమ్మడి మహబూబ్‌నగర్, నల్గొండ, ఖమ్మం జిల్లాల నుంచే ఎక్కువ మంది ఆ ప్రార్థనలకు హాజరయ్యారు. ప్రస్తుతం అందిన లెక్కల ప్రకారం హైదరాబాద్ 186, నిజామాబాద్ 18, మెదక్ 26, నల్గొండ 21, ఖమ్మం 15, అదిలాబాద్ 10, రంగారెడ్డి 15, వరంగల్ 25, కరీంనగర్ 17, మహబూబ్ నగర్ 25, బైంసా 11, నిర్మల్ 11 మంది హాజరయినట్లు గుర్తించారు.

కాగా, ఈ ప్రార్థనలు జరిగిన సమయంలో లాక్‌డౌన్ నిబంధనలు ఏమీ లేవు. కానీ ఇలా ప్రార్థనలు జరిగినట్లు ప్రభుత్వానికి తెలియజేయలేదు. దీంతో దీని నిర్వాహకుడైన మౌలానాపై కేసు నమోదు చేయాలని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఆదేశించారు. మరోవైపు నిజాముద్దీన పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రతీ ఇంటికి వెళ్లి తనిఖీలు నిర్వహించడమే కాకుండా కరోనా నిర్థారణ పరీక్షలు కూడా చేస్తున్నారు.

కాగా తెలుగు రాష్ట్రాలకు చెందిన ఈ 500 మంది… ఇంకా ఎవరెవరిని కలిశారు..? వాళ్ల నుంచి ఎంత మందికి సోకిందనే దానిపై ప్రభుత్వం ఆందోళన చెందుతుంది. వీళ్లందరూ స్వచ్ఛందంగా రిపోర్టు చేస్తే కానీ ఈ భయాందోళనలకు తెర పడేలా లేదు.

First Published:  31 March 2020 2:16 AM GMT
Next Story