Telugu Global
National

అంతా రాజ్యాంగబద్దమే.... కోర్టుకు వెళ్లినా కష్టమే!

ఏపీ రాజకీయాల్లో గత కొన్ని నెలలుగా వినిపిస్తున్న పదం ‘విచక్షణాధికారం’. ఏపీ ప్రభుత్వాన్ని ఎలా ఇరుకున పెట్టాలో అన్ని రకాల అస్త్రాలను బయటకు తీస్తూ ప్రతిపక్ష టీడీపీ గందరగోళం సృష్టించింది. సీఆర్డీయే రద్దు బిల్లు, పరిపాలన వికేంద్రీకరణ బిల్లులు మండలిలో పాస్ కాకుండా ప్రతిపక్ష నేత చంద్రబాబు ఆడిన డ్రామాలు యావత్ తెలుగు ప్రజానీకం చూసింది. తనకు అధికారం లేకపోయినా.. ‘విచక్షణాధికారం’ అంటూ మండలి చైర్మన్ షరీఫ్ బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపిన విషయం తెలిసిందే. దీంతో […]

అంతా రాజ్యాంగబద్దమే.... కోర్టుకు వెళ్లినా కష్టమే!
X

ఏపీ రాజకీయాల్లో గత కొన్ని నెలలుగా వినిపిస్తున్న పదం ‘విచక్షణాధికారం’. ఏపీ ప్రభుత్వాన్ని ఎలా ఇరుకున పెట్టాలో అన్ని రకాల అస్త్రాలను బయటకు తీస్తూ ప్రతిపక్ష టీడీపీ గందరగోళం సృష్టించింది.

సీఆర్డీయే రద్దు బిల్లు, పరిపాలన వికేంద్రీకరణ బిల్లులు మండలిలో పాస్ కాకుండా ప్రతిపక్ష నేత చంద్రబాబు ఆడిన డ్రామాలు యావత్ తెలుగు ప్రజానీకం చూసింది. తనకు అధికారం లేకపోయినా.. ‘విచక్షణాధికారం’ అంటూ మండలి చైర్మన్ షరీఫ్ బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపిన విషయం తెలిసిందే. దీంతో మండలి రద్దుకు ఏపీ అసెంబ్లీ తీర్మానం చేసింది.

ఆ తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలను సాధ్యమైనంతగా అడ్డుకోవడానికి చంద్రబాబు, ఆయన పార్టీ నేతలు అడ్డదార్లు తొక్కారు. బీసీ రిజర్వేషన్లు 50 శాతం మించిపోయిందని వాళ్లే కోర్టులో పిల్ వేశారు. ఆ తీర్పుపై స్టే రాగానే.. బీసీలకు సీట్లు తగ్గిస్తారా? అని బయట ప్రెస్ మీట్లు పెట్టి నిలదీసింది కూడా టీడీపీ నేతలే.

చివరకు ఆర్డినెన్స్ ద్వారా ఏపీ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలకు మార్గం సుగమమం చేసింది. టీడీపీ ఎలాగైనా డబ్బు, ఇతర మార్గాల ద్వారా గెలవాలని ప్రయత్నిస్తుందనే… ఈ సారి స్థానిక సంస్థల ఎన్నికలకు కఠినమైన నిబంధనలను తీసుకొచ్చింది జగన్ ప్రభుత్వం.

స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన నాటి నుంచి అప్పటి ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ టీడీపీ తొత్తుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపించాయి. చంద్రబాబు చెప్పినట్లుగా అధికారుల బదిలీలు చేయడం.. అసలు ప్రభుత్వానికి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఎన్నికలు వాయిదా వేయడం తీవ్ర సంచలనం సృష్టించింది.

కరోనా మహమ్మారి దేశంలో ప్రవేశించిన మాట వాస్తవమే అయినా… కనీసం ఏపీ ప్రధాన కార్యదర్శిని, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శిని సంప్రదించకుండా ఏక పక్షంగా ఎన్నికలు వాయిదా వేస్తున్నట్లు నిమ్మగడ్డ రమేష్ ప్రకటించారు.

మరోవైపు కరోనా కారణంగా కూలీలు, పేదలు ఆదాయం లేక నిత్యావసరాలు కొనుక్కోలేక పోతుండటంతో సీఎం జగన్ 1000 రూపాయలు ఆర్థిక సహాయం అందించాలని నిర్ణయించారు. ఈ డబ్బు పంపిణీ విషయంలో కూడా అసలు ఏ సంబంధం లేని ఎస్ఈ‌సీ జోక్యం చేసుకోవడం… టీడీపీ ఆరోపణలనే ఆయన ప్రెస్ మీట్లలో వినిపించడం ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారింది.

కాగా, ఒక రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ తొలగింపు అంత ఈజీగా జరిగే వ్యవహారం కాదు. దీనికి పార్లమెంటు ఆమోదం కావాలి. ఇప్పట్లో పార్లమెంటు సమావేశాలు జరిగే అవకాశం లేకపోవడంతో రాజ్యాంగం ప్రకారం వెళ్లాలని ప్రభుత్వం భావించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 243(కే) ప్రకారం ఒక రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ పదవీ కాలం, నియామక అర్హతలు, వేతనాలు వంటివి రాష్ట్ర ప్రభుత్వం ఒక చట్టం ద్వారా ఖరారు చేయవచ్చు. ప్రస్తుతం అసెంబ్లీ జరగడం కష్టం కాబట్టి ఏపీ ప్రభుత్వం నిబంధనలను మారుస్తూ ఆర్డినెన్స్ జారీ చేసింది. ఇదంతా రాజ్యాంగబద్దమే. కొత్త నిబంధనలు అమలులోనికి రావడంతో నిమ్మగడ్డ రమేష్ తన పదవిని కోల్పోవల్సి వచ్చింది.

రాజ్యంగబద్దంగా చూస్తే ఇక్కడ ఏపీ ప్రభుత్వం నిమ్మగడ్డ రమేష్‌పై వేటు వేయడం గానీ, తొలగించడం గానీ జరగలేదు. ఆయన పదవీకాలం ముగియడంతో తప్పుకోవాల్సి వచ్చింది. దీంతో ఆయన స్థానంలో కొత్త కమిషనర్‌ను సీఎం సిఫార్సుతో గవర్నర్ నియమించారు. అప్పట్లో పీవీ నర్సింహారావు కూడా టీఎన్ శేషన్‌తో విభేదాల కారణంగా మరో ఇద్దరు ఎన్నికల కమిషనర్లను నియమించారు. దానికి రాజ్యాంగం కల్పించిన వెలుసుబాటును ఉపయోగించుకున్నారు.

అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వానికి రాజ్యాంగబద్దంగా సంక్రమించిన హక్కును వైఎస్ జగన్ ప్రభుత్వం ఉపయోగించుకొని.. కమిషనర్ నియామకంలో అర్హత నిబంధనలను మార్పు చేసింది.

ఇక ఇప్పుడు మాజీ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కోర్టుకు వెళ్లినా అక్కడ చుక్కెదురు కావచ్చు. గవర్నర్ ఆమోద ముద్రవేసి, ఆర్డినెన్స్ చట్టబద్దం అయ్యింది కనుక… ఏ కోర్టులోనూ కేసు నిలబడకపోవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.

First Published:  11 April 2020 5:10 AM GMT
Next Story