ఇది ఆరంభమే... కరోనాపై అమెరికా సీడీసీ సంస్థ సంచలన రిపోర్ట్!
కరోనా ఇప్పట్లో వదలదు చలికాలంలో మరింత విజృంభణ ఆంక్షలు సడిలిస్తే కష్టమే అంచనా వేసిన అమెరికా సీడీసీ ఇన్ని రోజులు ఇండ్లకే పరిమితమై కరోనాను కట్టడి చేశాం… మే 7 వరకు ఇలాగే గడిపేస్తే ఆ తర్వాత హాయిగా మన పనులు మనం చేసుకోవచ్చని అనుకుంటున్నారా..? ఈ లాక్డౌన్లో కరోనాను కట్టడి చేశాం. ఇక మన ఆరోగ్యాలకు వచ్చిన ముప్పేమీ లేదని భావిస్తున్నారా..? మే నెల వేసవి వేడికి కరోనా మాడి మసై పోతుందని అంచనా వేస్తున్నారా..? […]
- కరోనా ఇప్పట్లో వదలదు
- చలికాలంలో మరింత విజృంభణ
- ఆంక్షలు సడిలిస్తే కష్టమే
- అంచనా వేసిన అమెరికా సీడీసీ
ఇన్ని రోజులు ఇండ్లకే పరిమితమై కరోనాను కట్టడి చేశాం… మే 7 వరకు ఇలాగే గడిపేస్తే ఆ తర్వాత హాయిగా మన పనులు మనం చేసుకోవచ్చని అనుకుంటున్నారా..? ఈ లాక్డౌన్లో కరోనాను కట్టడి చేశాం. ఇక మన ఆరోగ్యాలకు వచ్చిన ముప్పేమీ లేదని భావిస్తున్నారా..? మే నెల వేసవి వేడికి కరోనా మాడి మసై పోతుందని అంచనా వేస్తున్నారా..? అయితే మీరు తప్పులో కాలేసినట్లే.
ఇప్పుడు మనం చూస్తోంది ఆరంభం మాత్రమేనని.. ముందు ముందు మరింత ఉత్పాతం జరగనుందని అమెరికాలోని ”సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్’ సంస్థ డైరెక్టర్ రాబర్ట్ రెడ్ఫీల్డ్ అంచనా వేశారు.
చైనాలో పుట్టిన కోవిడ్-19 అమెరికాలో ఘోర ప్రళయాన్ని సృష్టిస్తోంది. లక్షలాది మంది కరోనా బారిన పడగా.. వేలాది మంది మృత్యుఒడికి చేరారు. కాగా, గత నెల రోజులకు పైగా అమెరికా షట్డౌన్ అయ్యింది. ఆర్థిక వ్యవస్థ పతనం కావడమే కాకుండా లక్షలాది మంది అమెరికన్లు ఉద్యోగాలు కోల్పోయారు.
దీంతో లాక్డౌన్ సడలించి దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టాలని ట్రంప్ భావిస్తున్నారు. ఒక్క అమెరికానే కాకుండా వైరస్ తగ్గు ముఖం పడితే ఇండియాతో సహా ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు లాక్డౌన్ ఆంక్షలను సడలించాలని చూస్తున్నాయి. అదే జరిగితే జనసంచారం పెరిగే అవకాశాలు ఉన్నాయి.
కాగా, లాక్డౌన్ సడలింపు వైరస్ వ్యాప్తికి ఊతం ఇచ్చినట్లు అవుతుందని సీడీసీ చెబుతోంది. రాబోయే చలికాలంలో కరోనాకు తోడు ఫ్లూ కూడా తోడై మహోత్పాతాన్ని సృష్టస్తుందని.. దీంతో ఇప్పటికన్నా ఊహించని నష్టం జరగడం ఖాయమని రెడ్ ఫీల్డ్ అంచనావేశారు.
చలికాలంలో వైరస్ల జీవితకాలం ఎక్కువగా ఉంటుంది. ఆ సమయంలో రోగికి చికిత్స చేసినా కోలుకోవడానికి చాలా సమయం పడుతుంది. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా భారీ ప్రాణనష్టం తప్పదని ఆయన అంటున్నారు. సాధ్యమైనంత కాలం లాక్డౌన్ పొడిగించి కరోనాను మరింత తక్కువ చేయకపోతే శీతాకాలం దాన్ని కట్టడి చేయడం చాలా కష్టమని ఆయన స్పష్టం చేశారు.
దేశ ఆర్థిక వ్యవస్థ గాడిన పెట్టాలని ఆంక్షలు సడలిస్తే ఆరోగ్య భద్రతకు ముప్పు వాటిల్లడం ఖాయమని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే అమెరికాలో 8.2 లక్షల మంది కోవిడ్ 19 బారిన పడ్డారు. శీతాకాలం వస్తే ఈ సంఖ్య రెట్టింపు అవ్వొచ్చని భావిస్తున్నారు.
ఈ వార్తలు బయటకు రాగానే అమెరికా ప్రజలు మరింత ఆందోళన చెందుతున్నారు. ఆంక్షలతో ఇంట్లో ఉండలేక.. కరోనా భయంతో బయటకు వెళ్లలేక సతమతమవుతున్నారు.
మరోవైపు ఇండియా, పాకిస్తాన్, బ్రెజిల్, ఇటలీ వంటి దేశాలు ఆంక్షలు సడలించే ఆలోచన చేస్తున్నాయి. ఫ్రాన్స్ కూడా మే 15 తర్వాత ఆంక్షలు సడలిస్తామని చెబుతోంది. కరోనా మహమ్మారిని తరమాలంటే వ్యాక్సిన్ ఒక్కటే మార్గమని వైద్య నిపుణులు చెబుతున్నారు.