Telugu Global
NEWS

పోతిరెడ్డిపాడుపై బాబు వెయిట్‌ అండ్ సీ పాలిటిక్స్

రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు సాగు, తాగు నీరు అందించే ఉద్దేశంతో పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటరీ సామర్థ్యాన్ని 44వేల క్యూసెక్కుల నుంచి 80వేల క్కూసెక్కులకు పెంచేందుకు ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని టీడీపీ తప్ప మిగిలిన ప్రతిపక్షాలన్నీ స్వాగతిస్తున్నాయి. ఏపీ బీజేపీ ప్రభుత్వానికి పూర్తి మద్దతు తెలిపింది. తెలంగాణ బీజేపీ మాత్రం ఏపీ ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తోంది. న్యాయపోరాటం చేస్తారా? తెలంగాణతో మాట్లాడుకుంటారా? ఏమైనా చేయండి… పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంచి రాయలసీమకు నీళ్లు ఇవ్వండి అని ఏపీ […]

పోతిరెడ్డిపాడుపై బాబు వెయిట్‌ అండ్ సీ పాలిటిక్స్
X

రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు సాగు, తాగు నీరు అందించే ఉద్దేశంతో పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటరీ సామర్థ్యాన్ని 44వేల క్యూసెక్కుల నుంచి 80వేల క్కూసెక్కులకు పెంచేందుకు ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని టీడీపీ తప్ప మిగిలిన ప్రతిపక్షాలన్నీ స్వాగతిస్తున్నాయి.

ఏపీ బీజేపీ ప్రభుత్వానికి పూర్తి మద్దతు తెలిపింది. తెలంగాణ బీజేపీ మాత్రం ఏపీ ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తోంది. న్యాయపోరాటం చేస్తారా? తెలంగాణతో మాట్లాడుకుంటారా? ఏమైనా చేయండి… పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంచి రాయలసీమకు నీళ్లు ఇవ్వండి అని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ప్రభుత్వానికి సూచించారు.

ఈ విషయంలో వెనక్కు తగ్గవద్దు… అవసరమైతే తాము కూడా కేంద్ర ప్రభుత్వం వద్ద ఏపీ వాదనను వినిపిస్తామని బీజేపీ నేతలు టీజీ వెంకటేష్, విష్ణువర్థన్ రెడ్డి ప్రకటించారు. కరువుతో అల్లాడుతున్న రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు నీరు అందించే విషయంలో ముందుకే వెళ్లాలని సీపీఎం, సీపీఐ కార్యదర్శులు మధు, రామకృష్ణ మద్దతు తెలిపారు.

జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వ నిర్ణయాన్ని తాను కూడా అభినందిస్తున్నానని మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి చెప్పారు. ఇలా అన్ని పార్టీలు రాజకీయాలు పక్కన పెట్టి స్పష్టంగా రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు నీరు అందించే విషయంలో ప్రభుత్వానికి బాసటగా నిలిచాయి.

టీడీపీ నేతలతో కాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబునాయుడు మాత్రం… పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంపు కేసీఆర్, జగన్‌ ఆడుతున్న నాటకంగా అభివర్ణించారు. అంటే చంద్రబాబు ఈ అంశాన్ని కూడా రాజకీయ కోణంలోనే చూడడానికి సిద్ధమయ్యారు.

కరువు ప్రాంతానికి నీరు ఇవ్వడం మంచిదే అన్న మాట రాకపోగా… నాలుగైదు రోజులు ఎదురుచూసి ఎలా ముందుకెళ్లాలి అన్న దానిపై నిర్ణయం తీసుకుంటామని చంద్రబాబు చెప్పారు.

కరువు ప్రాంతానికి నీరు ఇచ్చే అంశంపై అన్ని పార్టీలు సూటిగా సమర్థిస్తుంటే ఒక్క చంద్రబాబు మాత్రం ఇలా నాలుగైదు రోజులు ఎదురుచూస్తామని అనడం బట్టి ఈ విషయంలో ఆయన రాజకీయ కోణంలో ముందుకెళ్లే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

First Published:  13 May 2020 9:11 PM GMT
Next Story