Telugu Global
National

తెరుచుకోనున్న తిరుమల ద్వారాలు

11 నుంచి దర్శనాలకు ఏర్పాట్లు రోజుకు 7వేల మందికే అనుమతి తిరుమల తిరుపతి దేవస్థాన ద్వారాలు వచ్చే వారం తెరుచుకోనున్నాయి. కరోనా లాక్‌డౌన్ నిబంధనల మేరకు మూసుకొని పోయిన స్వామివారి ఆలయాన్ని 75 రోజుల తర్వాత జూన్ 11న తెరవనున్నారు. మరో వారం రోజులే సమయం ఉండటంతో టీటీడీ ఉన్నతాధికారులు యుద్ద ప్రాతిపథికన ఏర్పాట్లు చేస్తున్నారు. సామాజిక దూరం పాటిస్తూ గంటకు ఎంత మందితో దర్శనం చేయించవచ్చో అని ఈరోజు ఉద్యోగులతో పరీక్షించి చూశారు. 100 మంది […]

తెరుచుకోనున్న తిరుమల ద్వారాలు
X
  • 11 నుంచి దర్శనాలకు ఏర్పాట్లు
  • రోజుకు 7వేల మందికే అనుమతి

తిరుమల తిరుపతి దేవస్థాన ద్వారాలు వచ్చే వారం తెరుచుకోనున్నాయి. కరోనా లాక్‌డౌన్ నిబంధనల మేరకు మూసుకొని పోయిన స్వామివారి ఆలయాన్ని 75 రోజుల తర్వాత జూన్ 11న తెరవనున్నారు. మరో వారం రోజులే సమయం ఉండటంతో టీటీడీ ఉన్నతాధికారులు యుద్ద ప్రాతిపథికన ఏర్పాట్లు చేస్తున్నారు.

సామాజిక దూరం పాటిస్తూ గంటకు ఎంత మందితో దర్శనం చేయించవచ్చో అని ఈరోజు ఉద్యోగులతో పరీక్షించి చూశారు. 100 మంది ఉద్యోగులతో చేసిన ఈ పరిశీలనలో గంటకు 500 మందిని దర్శనానికి అనునమతించ వచ్చని నిర్థారించారు.

ప్రయోగాత్మక పరీక్షల అనంతరం రోజుకు 7 వేల మందికి దర్శన భాగ్యం కలిగించవచ్చని అధికారులు నిర్థారించారు. దీంతో ఆన్‌లైన్ బుకింగ్స్ ద్వారా 3 వేల మందిని, నేరుగా దర్శనానికి వచ్చే మరో 3 వేల మందిని అనుమతించాలని.. వారాంతాల్లో అదనంగా మరో వెయ్యి మందిని అనుమతించాలని నిర్ణయించారు. ఈరోజు వంద మందితో ట్రయల్స్ నిర్వహించిన సమయంలో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కూడా అక్కడే ఉండి పరిశీలించారు. అనంతరం ఆయన ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు.

తిరుమలకు వచ్చే ఎవరికైనా వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాతే దర్శనానికి అనుమతిస్తామని అధికారులు చెబుతున్నారు. ఆధార్ కార్డు తప్పని సరిగా వెంట తీసుకొని రావాలని.. దాని ఆధారంగా వాళ్లు కంటైన్మెంట్ జోన్‌కు సంబంధించిన వారైతే తిరిగి వెనక్కు పంపిస్తామని చెబుతున్నారు.

దర్శనానికి పిల్లలను, 65 ఏండ్లు పైబడిన వారిని అనుమతించమని.. భక్తులు తప్పని సరిగా మాస్కులు ధరించాలని.. భౌతిక దూరం పాటించాలని అధికారులు చెబుతున్నారు. ఈ నెల 11 నుంచి వీఐపీ బ్రేక్ దర్శనం ఉదయం 6.30 నుంచి 7.30 గంటల వరకు కేవలం ఒక గంట మాత్రమే అని టీటీడీ చెప్పింది. ఆపై ఉదయం 7.30 గంటల నుంచి రాత్రి 7.30 గంటలవరకు సాధారణ భక్తులను దర్శనానికి అనుమతిస్తామని వివరించారు.

శ్రీవారి మెట్ల మార్గం ద్వారా అనుమతి లేదని.. అలాగే పుష్కరిణిలోకి కూడా భక్తులకు అనుమతి ఉండదని చెబుతున్నారు. వసతి గదుల్లో కేవలం ఇద్దరికి మాత్రమే అనుమతి ఇస్తామన్నారు. ఎవరైనా సరే వసతి గదుల్లో కేవలం ఒక్క రోజు మాత్రమే ఉండాలని.. రెండో రోజు కొనసాగడానికి అనుమతించమని అధికారులు స్పష్టం చేశారు. ఆలయంలోని క్యూలైన్లను ప్రతీ రెండు గంటలకు ఒకసారి శానిటైజ్ చేసే అవకాశం ఉంది. అలాగే.. హుండీలో విరాళం వేసే సమయంలో శానిటైజ్ చేస్తారు.

First Published:  5 Jun 2020 5:39 AM GMT
Next Story