Telugu Global
NEWS

విశాఖలో చిత్ర పరిశ్రమను అభివృద్ధి చేస్తాం...

తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు తాడేపల్లిలో ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డిని కలిశారు. చిత్ర పరిశ్రమకు సంబంధించిన సమస్యలపై చర్చించారు. ఈ భేటీలో చిరంజీవి, నాగార్జున, సురేష్ బాబు, దిల్ రాజు, పీవీపీ, రాజమౌళి, సి కల్యాణ్ తదితరులు పాల్గొన్నారు. భేటీకి సంబంధించిన వివరాలను చిరంజీవి బృందం మీడియాకు వివరించింది. కరోనా వల్ల ఆగిపోయిన షూటింగ్‌ ల అంశాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లామని… తిరిగి ఏపీలో కూడా షూటింగ్‌లు చేసుకునేందుకు ముఖ్యమంత్రి అంగీకరించారని చిరంజీవి వివరించారు. కరోనా […]

విశాఖలో చిత్ర పరిశ్రమను అభివృద్ధి చేస్తాం...
X

తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు తాడేపల్లిలో ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డిని కలిశారు. చిత్ర పరిశ్రమకు సంబంధించిన సమస్యలపై చర్చించారు. ఈ భేటీలో చిరంజీవి, నాగార్జున, సురేష్ బాబు, దిల్ రాజు, పీవీపీ, రాజమౌళి, సి కల్యాణ్ తదితరులు పాల్గొన్నారు. భేటీకి సంబంధించిన వివరాలను చిరంజీవి బృందం మీడియాకు వివరించింది.

కరోనా వల్ల ఆగిపోయిన షూటింగ్‌ ల అంశాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లామని… తిరిగి ఏపీలో కూడా షూటింగ్‌లు చేసుకునేందుకు ముఖ్యమంత్రి అంగీకరించారని చిరంజీవి వివరించారు. కరోనా వల్ల థియేటర్లు మూతపడిన నేపథ్యంలో ఈ కాలానికి కనీస విద్యుత్ రుసుము వసూలును రద్దు చేయాల్సిందిగా సీఎంను కోరామన్నారు. అందుకు సీఎం సానుకూలంగా స్పందించారన్నారు.

నంది అవార్డుల పెండింగ్‌ అంశాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లామన్నారు. 2019-20 నంది అవార్డుల ప్రదానానికి ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారని… ఆకార్యక్రమం త్వరలోనే ఉంటుందని ఆశిస్తున్నామన్నారు. విశాఖ వేదికగా చిత్ర పరిశ్రమ అభివృద్దికి ముఖ్యమంత్రి హామీ ఇచ్చారన్నారు.

వైఎస్‌ హయాంలో విశాఖలో చిత్ర పరిశ్రమ కోసం 300 ఎకరాలు కేటాయించారని… ఆ భూముల్లో చిత్ర పరిశ్రమను అభివృద్ధి చేస్తామన్నారు. సినిమా టికెట్ల ధరలపైనా దృష్టి పెట్టాల్సిందిగా కోరామన్నారు. టికెట్లు మొత్తం ఆన్ లైన్ చేయాల్సిందిగా కోరినట్టు వివరించారు.

ప్రభుత్వం నుంచి చిత్ర పరిశ్రమకు ప్రోత్సాహకాలు కోరామని వాటికి ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారని చిరంజీవి వివరించారు. సినీ పరిశ్రమకు సంబంధించిన ఇతర అంశాలపైనా చర్చించామన్నారు. తెలుగు చిత్ర పరిశ్రమ అభివృద్ధికి వెన్నంటే ఉంటామని సీఎం చెప్పారని… అందుకు తాము కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. మరోసారి వచ్చి ముఖ్యమంత్రిని తాము కలుస్తామని చిరంజీవి చెప్పారు.

First Published:  9 Jun 2020 6:32 AM GMT
Next Story