Telugu Global
NEWS

దీపక్ రెడ్డి నెగిటివ్‌పై వైద్య అధికారుల కౌంటర్‌

టీడీపీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి కరోనా పరీక్షలపై ఆరోపణలకు ఏపీ వైద్య శాఖ అధికారులు కూడా గట్టిగానే సమాధానం ఇచ్చారు. ఇటీవల జరిగిన శాసనమండలి సమావేశం సందర్భంగా ప్రతి ప్రజాప్రతినిధికి అక్కడ కరోనా పరీక్షలు నిర్వహించారు. ఎమ్మెల్సీ దీపక్‌ రెడ్డికి కూడా 17వ తేదీన కరోనా పరీక్షలు నిర్వహించారు. ఆ మరుసటి రోజు ఆయనకు పరీక్షల్లో కరోనా పాజిటివ్ వచ్చినట్టు గుర్తించారు. అయితే తాను హైదరాబాద్ వెళ్లిన తర్వాత 19వ తేదీ కరోనా పరీక్షలు చేయించుకుంటే రెండుసార్లు […]

దీపక్ రెడ్డి నెగిటివ్‌పై వైద్య అధికారుల కౌంటర్‌
X

టీడీపీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి కరోనా పరీక్షలపై ఆరోపణలకు ఏపీ వైద్య శాఖ అధికారులు కూడా గట్టిగానే సమాధానం ఇచ్చారు. ఇటీవల జరిగిన శాసనమండలి సమావేశం సందర్భంగా ప్రతి ప్రజాప్రతినిధికి అక్కడ కరోనా పరీక్షలు నిర్వహించారు. ఎమ్మెల్సీ దీపక్‌ రెడ్డికి కూడా 17వ తేదీన కరోనా పరీక్షలు నిర్వహించారు. ఆ మరుసటి రోజు ఆయనకు పరీక్షల్లో కరోనా పాజిటివ్ వచ్చినట్టు గుర్తించారు.

అయితే తాను హైదరాబాద్ వెళ్లిన తర్వాత 19వ తేదీ కరోనా పరీక్షలు చేయించుకుంటే రెండుసార్లు నెగిటివ్ వచ్చిందని దీపక్ రెడ్డి చెబుతున్నారు. ఏపీ ప్రభుత్వంపై ఇటీవల హైకోర్టులో కేసులు వేస్తున్నందున తనను టార్గెట్‌ చేసి కుట్రపూరితంగా క్వారంటైన్‌కు తరలించే ప్రయత్నం చేశారని ఆరోపించారు. క్వారంటైన్‌ కు తరలించి కరోనాను సోకేలా చేయడమో లేదంటే మరోలా ఇబ్బంది పెట్టడమో చేసి ఉండేవారని అనుమానం వ్యక్తం చేశారు.

కరోనా సోకిందంటూ ఫోన్‌ చేసిన కృష్ణా జిల్లా కలెక్టర్ చాలా మర్యాదగా మాట్లాడారని… సాధారణంగా అయితే కలెక్టర్లు అంత మర్యాదగా మాట్లాడరు అని కూడా దీపక్ రెడ్డి చెప్పారు. కలెక్టర్‌ ఇచ్చిన రెస్పెక్ట్ చూసినప్పుడే తనకు అనుమానం వచ్చిందని చెబుతున్నారు.

దీపక్‌ రెడ్డి చేసిన ఆరోపణలకు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ సమాధానం ఇచ్చింది. ప్రస్తుతం పరీక్షలు చేస్తున్న ఆర్టీపీసీఆర్‌ సామర్థ్యాన్ని జాతీయ వైద్య పరిశోధన మండలే నిర్ణయించిందని అధికారులు వివరించారు. ఈ పద్దతిలో కరోనా వైరస్ తీవ్రత 33 శాతం కంటే తక్కువగా ఉన్నప్పుడు నెగిటివ్ అని కూడా చూపే అవకాశం ఉందని వివరించారు.

యంత్రం ఏది అన్న దానిపై పరీక్షల ఖచ్చితత్వం ఆధారపడి ఉంటుందని వెల్లడించారు. తొలిసారి చేసిన పరీక్షల్లో దీపక్ రెడ్డికి పాజిటివ్ అని వచ్చిదంటే … వందశాతం ఆయన కరోనా బారినపడినట్టేనని ఏపీ వైద్య శాఖ స్పష్టం చేసింది.

ఆ తర్వాత హైదరాబాద్‌లో పరీక్షలు చేయించుకున్నప్పుడు నెగిటివ్ వచ్చిందంటే … అప్పటికి దీపక్‌ రెడ్డి కోలుకునే దశలో అయినా ఉండి ఉండాలని.. లేదంటే వైరల్ ఇన్ఫెక్షన్ తీవ్రత 33 శాతం కంటే తక్కువగా పడిపోయి ఉంటుందని వివరణ ఇచ్చింది. ఒక్కసారి ఆర్టీపీసీఆర్‌ విధానంలో పాజిటివ్ వచ్చిందంటే సదరు వ్యక్తి తప్పనిసరిగా వైరస్‌ బారినపడినట్టేనని స్పష్టం చేసింది. ఇలాంటి సాంకేతిక వివరాలు తెలుసుకోకుండా పదవుల్లో ఉన్న వారు… ఇలా మాట్లాడడం సరికాదని అభిప్రాయపడింది.

First Published:  25 Jun 2020 10:57 PM GMT
Next Story