Telugu Global
National

అజయ్‌ కల్లం చెప్పిన నిజాలు...

కేంద్ర ప్రభుత్వం విద్యుత్‌ను యూనిట్‌కు 2.70 రూపాయలకే అందిస్తుంటే ఏపీ ప్రభుత్వం మాత్రం దాన్ని పరిశ్రమలకు యూనిట్‌ 9 రూపాయలకు అమ్ముతోందని కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ చేసిన ఆరోపణలకు ఏపీ ప్రభుత్వం తరపున ప్రభుత్వ సలహాదారు అజయ్ కల్లం మీడియా సమావేశం ఏర్పాటు చేసి స్పందించారు. ఈ అంశంపై వివరణ ఇచ్చారు. నిర్మల సీతారామన్‌ గౌరవనీయ స్థానంలో ఉన్నారని… ఆమె చెప్పే మాటలు ఎక్కువ ప్రభావం చూపుతాయని అందుకే తాను వివరణ ఇస్తున్నట్టు చెప్పారు. నిర్మల […]

అజయ్‌ కల్లం చెప్పిన నిజాలు...
X

కేంద్ర ప్రభుత్వం విద్యుత్‌ను యూనిట్‌కు 2.70 రూపాయలకే అందిస్తుంటే ఏపీ ప్రభుత్వం మాత్రం దాన్ని పరిశ్రమలకు యూనిట్‌ 9 రూపాయలకు అమ్ముతోందని కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ చేసిన ఆరోపణలకు ఏపీ ప్రభుత్వం తరపున ప్రభుత్వ సలహాదారు అజయ్ కల్లం మీడియా సమావేశం ఏర్పాటు చేసి స్పందించారు. ఈ అంశంపై వివరణ ఇచ్చారు.

నిర్మల సీతారామన్‌ గౌరవనీయ స్థానంలో ఉన్నారని… ఆమె చెప్పే మాటలు ఎక్కువ ప్రభావం చూపుతాయని అందుకే తాను వివరణ ఇస్తున్నట్టు చెప్పారు. నిర్మల సీతారామన్‌కు ఎవరో రాంగ్ ఫీడ్ బ్యాక్ ఇచ్చారన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి నిర్మల సీతారామన్ చెప్పినట్టు యూనిట్‌ విద్యుత్‌ 2.70లకే ఎక్కడ సరఫరా అవుతోందో తమకు అర్థం కావడం లేదన్నారు. మంత్రి వ్యాఖ్యలు విని తాము ఆశ్చర్యపోయామన్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో పరిశ్రమల నుంచి యూనిట్ విద్యుత్‌కు 9 రూపాయలు వసూలు చేస్తున్నారన్నది పూర్తిగా అవాస్తవమని వివరించారు. ఏపీలో పరిశ్రమలకు యూనిట్ విద్యుత్‌ను రూ. 7.65 పైసలకు అందిస్తున్నట్టు చెప్పారు. ఈ ధర కూడా తాము నిర్ణయించినది కాదని… గత ప్రభుత్వం 2017లో నిర్ణయించిందన్నారు. దాన్ని తాము మార్చడం కానీ, పెంచడం గానీ చేయలేదన్నారు. పైగా తాము పరిశ్రమలను ప్రోత్సాహించాలన్న ఉద్దేశంతో పలు పరిశ్రమలకు యూనిట్‌ విద్యుత్‌పై రూపాయి సబ్సిడీ ఇస్తున్నట్టు చెప్పారు. దీని వల్ల యూనిట్ విద్యుత్‌ 6.65కు అందుతోందని అజయ్ కల్లం వివరించారు.

తెలంగాణలో పరిశ్రమలకు 7.60 రూపాయలు, రాజస్థాన్‌లో 7.30 , మహారాష్ట్రలో రూ. 7.25, తమిళనాడులో రూ. 6.35, కర్నాటకలో రూ. 7.20 పైసలకు విద్యుత్ అమ్ముతున్నారని వివరించారు. ఒక్క గుజరాత్‌లో మాత్రం వ్యవసాయ విద్యుత్ భారం లేకపోవడం, కావాల్సినన్ని విద్యుత్ ప్లాంట్‌లు ఉండడంతో యూనిట్‌ విద్యుత్‌ను పరిశ్రమలకు 5రూపాయలకు ఇస్తోందన్నారు. ప్రతి రాష్ట్రంలోనూ 7రూపాయలకు పైగానే వసూలు చేస్తున్నారని… కానీ ఒక్క ఆంధ్రప్రదేశ్‌పై మాత్రమే ఎందుకు నిందలు వేస్తున్నారని ప్రశ్నించారు.

కేంద్ర మంత్రి చెబుతున్నట్టు కేంద్రం నుంచి తక్కువ ధరకు విద్యుత్ రావడం లేదన్నారు. అధిక ధరకు విద్యుత్ కొంటున్నది కేంద్ర విద్యుత్ సంస్థల నుంచేనని వివరించారు. ఎన్‌టీపీసీ కుడిగి యూనిట్ నుంచి వచ్చే విద్యుత్‌కు ఏపీ ప్రభుత్వం యూనిట్‌కు 9.44 రూపాయలు చెల్లిస్తోందని వివరించారు. బండిల్డ్ సోలార్ పవర్‌ కు యూనిట్‌ 10.67 పైసలు చెల్లించాల్సి వస్తోందన్నారు. వద్దన్న యూనిట్ల నుంచే అధిక ధరకు విద్యుత్‌ను కేంద్రం అంటగడుతోందని అజయ్ కల్లం వ్యాఖ్యానించారు.

విద్యుత్ ట్రాన్సిమిషన్ చార్జీల కింద ఏపీ నుంచి వసూలు చేస్తున్న విధానాన్ని కూడా కల్లం వివరించారు. సెంట్రల్ పవర్ లైన్‌లను వాడుకుంటే విద్యుత్ ట్రాన్సిమిషన్ చార్జీల కింద ఒక మెగావాట్‌కు 5 లక్షలు వసూలు చేస్తున్నారని…. ఇతర రాష్ట్రాల నుంచి మాత్రం రెండు లక్షలే వసూలు చేస్తున్నారని చెప్పారు. ఇది అన్యాయం అని చెబితే… తప్పేనని అంగీకరించి కూడా సవరణ చేయడం లేదన్నారు. ఇలా విద్యుత్ ట్రాన్సిమిషన్‌ చార్జీల కిందే ఏటా కేంద్ర ప్రభుత్వానికి ఏపీ ప్రభుత్వం 17వందల కోట్లు అదనంగా చెల్లించాల్సి వస్తోందన్నారు.

రాష్ట్ర విభజన తర్వాత ఏపీకి బొగ్గు గనులు లేకుండాపోయాయని… కోల్ మైన్ కేటాయించాలని అడుగుతున్నా పట్టించుకోవడం లేదని… దీంతో బయటి నుంచి బొగ్గు కొనుగోలు చేయాల్సి రావడంతో ఏటా బొగ్గు మీదే 2,500 కోట్ల భారం పడుతోందన్నారు. అధిక ధరలకు పీపీఏలు చేసుకోవడంతో తక్కువ ధరకు విద్యుత్‌ను కొనలేని పరిస్థితిని గత ప్రభుత్వం సృష్టించిందన్నారు. ఒక పద్దతిగా ఏపీని ట్రాప్‌లోకి నెట్టారని అజయ్ కల్లాం వ్యాఖ్యానించారు.

చంద్రబాబు పోతుపోతూ ఒక్క విద్యుత్ రంగంలోనే తక్షణం చెల్లించాల్సిన 13వేల కోట్ల బిల్లులను పెండింగ్‌లో ఉంచి వెళ్లారు. ఏడాదిలోనే తాము 8వేల 655 కోట్లు చెల్లించామన్నారు. ఒక ఏడాదిలోనే విద్యుత్ రంగంలో పొదుపు పాటించి 5వేల కోట్లు ఆదా చేశామని వివరించారు. 2014లో రాష్ట్ర విభజన జరిగినప్పుడు విద్యుత్ సంస్థల అప్పు 24వేల కోట్లుగా ఉంటే చంద్రబాబు పాలన వల్ల అది ఇప్పుడు 70వేల కోట్లకు చేరిందని అజయ్ కల్లం వెల్లడించారు.

First Published:  27 Jun 2020 10:02 PM GMT
Next Story