Telugu Global
NEWS

లక్ష కోట్ల రుణం కోసం జగన్ సర్కార్ అడుగులు

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఒక భారీ లోన్‌ కోసం ప్రయత్నిస్తున్న అంశం ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. అందులోనూ విదేశాలకు చెందిన ఒక ప్రైవేట్ ట్రస్ట్ ఏపీకి ఏకంగా 9 బిలియన్ డాలర్ల రుణం ఇచ్చేందుకు ముందుకు వస్తుండడం ఆసక్తిగా ఉంది. ఇటీవల ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి ఢిల్లీ వెళ్లి కేంద్ర ఆర్థిక మంత్రితో పాటు నీతిఆయోగ్ సీఈవోను కలవడం వెనుక ప్రధాన కారణం ఈ లోనేనని చెబుతున్నారు. పయనీర్‌ పత్రిక బుగ్గన ఢిల్లీ పర్యటనపై కీలకమైన […]

లక్ష కోట్ల రుణం కోసం జగన్ సర్కార్ అడుగులు
X

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఒక భారీ లోన్‌ కోసం ప్రయత్నిస్తున్న అంశం ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. అందులోనూ విదేశాలకు చెందిన ఒక ప్రైవేట్ ట్రస్ట్ ఏపీకి ఏకంగా 9 బిలియన్ డాలర్ల రుణం ఇచ్చేందుకు ముందుకు వస్తుండడం ఆసక్తిగా ఉంది.

ఇటీవల ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి ఢిల్లీ వెళ్లి కేంద్ర ఆర్థిక మంత్రితో పాటు నీతిఆయోగ్ సీఈవోను కలవడం వెనుక ప్రధాన కారణం ఈ లోనేనని చెబుతున్నారు.

పయనీర్‌ పత్రిక బుగ్గన ఢిల్లీ పర్యటనపై కీలకమైన కథనాన్ని ప్రచురించింది. అమెరికాకు చెందిన ఒక ప్రైవేట్ ట్రస్ట్‌ ఏపీకి 9 బిలియన్ డాలర్ల రుణం ఇచ్చేందుకు సిద్ధమైందని… ఇందుకు కేంద్ర గ్యారెంటీ ఇస్తే రుణం తీసుకుంటామని కేంద్రాన్ని కోరేందుకు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఢిల్లీ వెళ్లినట్టు చెబుతున్నారు. అంటే 67వేల కోట్ల రూపాయల లోన్‌కు సంబంధించిన వ్యవహారం ఇది.

లోన్‌ ఇచ్చేందుకు సుముఖంగా ఉన్న అమెరికా ప్రైవేట్ ట్రస్ట్ ఒకటి… అదే సమయంలో లోన్‌కు భారత ప్రభుత్వం గ్యారెంటీ ఇవ్వాలని షరతు పెట్టింది. ఒక ప్రైవేట్ ట్రస్ట్ నుంచి ఈ స్థాయిలో లోన్‌ తీసుకునే విషయంలో కేంద్రం గ్యారంటీ ఇచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయని అధికారులు వ్యాఖ్యానిస్తున్నట్టు పత్రిక వెల్లడించింది. ఆర్‌బీఐ, ఫెమా నిబంధనలు ఇందుకు ప్రతికూలంగా ఉంటాయని చెబుతున్నారు.

ఏపీ ప్రభుత్వ వర్గాలు మాత్రం ఈ అంశంపై మరో వాదన వినిపిస్తున్నాయి. ఈ 67వేల కోట్ల లోన్‌ తీసుకొచ్చి మూడునాలుగేళ్లలో సాగునీటి ప్రాజెక్టులన్నీ పూర్తి చేయాలన్న ఆలోచనతో ఏపీ ప్రభుత్వం ఉన్నట్టు చెబుతున్నారు. ఈ లోన్‌పై వడ్డీ కూడా నాలుగు శాతానికి మించి ఉండదంటున్నారు. ఈ రుణమే కాకుండా వైద్య రంగంపై మరో 14వేల కోట్లు, పట్టణాల్లో మౌలిక సదుపాయాలపై మరో 14వేల కోట్ల లోన్‌ కూడా ఇచ్చేందుకు ట్రస్ట్ సిద్ధంగా ఉందని చెబుతున్నారు. అంటే మొత్తం దాదాపు లక్ష కోట్లు లోన్ అన్న మాట.

ఒకవేళ ఇది వాస్తవరూపం దాల్చి 67వేల కోట్ల రూపాయల లోన్ తీసుకొచ్చి సాగునీటి ప్రాజెక్టులపై ఖర్చు చేస్తే మంచిదే. కాకపోతే ఒక రాష్ట్ర ప్రభుత్వానికి ఇలా ఏకంగా దాదాపు లక్ష కోట్ల వరకు లోన్ ఇచ్చేందుకు సిద్ధమైన ఆ అమెరికా ట్రస్ట్ ఏది అన్నది ఇప్పుడు చర్చనీయాంశమైంది.

First Published:  13 July 2020 6:21 AM GMT
Next Story