Telugu Global
National

నాకు 30 మంది ఎమ్మెల్యేల మద్దతుంది...

వృద్ధుల నాయకత్వం కాంగ్రెస్‌ పార్టీని రానురాను మరింత దెబ్బతీస్తోంది. వృద్ద నేతలకు పదవులు ఇచ్చి వారి కింద పనిచేయాల్సిందేనన్న కాంగ్రెస్ హైకమాండ్ ధోరణి యువనాయకత్వాన్ని దూరం చేస్తోంది. ఇప్పటికే మధ్యప్రదేశ్‌లో దెబ్బతిన్న కాంగ్రెస్… రాజస్థాన్‌లోనూ అదే పరిస్థితి ఎదుర్కొంటోంది. రాజస్థాన్ డిప్యూటీ సీఎం, పీసీసీ అధ్యక్షుడు సచిన్ పైలట్‌ తిరుగుబాటు చేశారు. ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర జరుగుతోందంటూ స్పెషల్‌ ఆపరేషన్స్‌ గ్రూప్‌(ఎస్‌ఓజీ) తనకు నోటీసులు జారీ చేయడంతో సచిన్ పైలట్ ఆగ్రహించారు. స్టేట్‌మెంట్‌ తీసుకునేందుకు తమకు సమయం […]

నాకు 30 మంది ఎమ్మెల్యేల మద్దతుంది...
X

వృద్ధుల నాయకత్వం కాంగ్రెస్‌ పార్టీని రానురాను మరింత దెబ్బతీస్తోంది. వృద్ద నేతలకు పదవులు ఇచ్చి వారి కింద పనిచేయాల్సిందేనన్న కాంగ్రెస్ హైకమాండ్ ధోరణి యువనాయకత్వాన్ని దూరం చేస్తోంది.

ఇప్పటికే మధ్యప్రదేశ్‌లో దెబ్బతిన్న కాంగ్రెస్… రాజస్థాన్‌లోనూ అదే పరిస్థితి ఎదుర్కొంటోంది. రాజస్థాన్ డిప్యూటీ సీఎం, పీసీసీ అధ్యక్షుడు సచిన్ పైలట్‌ తిరుగుబాటు చేశారు.

ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర జరుగుతోందంటూ స్పెషల్‌ ఆపరేషన్స్‌ గ్రూప్‌(ఎస్‌ఓజీ) తనకు నోటీసులు జారీ చేయడంతో సచిన్ పైలట్ ఆగ్రహించారు. స్టేట్‌మెంట్‌ తీసుకునేందుకు తమకు సమయం ఇవ్వాలని ఎస్‌ఓజీ నోటీసులు ఇవ్వడంతో పైలట్‌ వర్గం మండిపడుతోంది. విచారణకు వచ్చి సమాధానాలివ్వాలని సచిన్‌ పైలట్‌కు నోటీసులు ఇప్పించడం ద్వారా ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌ అన్ని హద్దులు దాటారని పైలట్‌ మద్దతుదారులు ఆరోపించారు. ఈ పరిస్థితుల్లో గెహ్లాట్‌ నాయకత్వంలో పనిచేయలేమని తేల్చిచెప్పారు.

నోటీసులపై తొలుత మౌనంగా ఉన్న సచిన్ పైలట్‌ ఆదివారం రాత్రి స్పందించారు. ప్రస్తుతం అశోక్ గెహ్లాట్ ప్రభుత్వం మైనార్టీలో పడిందని ట్వీట్ చేశారు. తనతో 30 మంది ఎమ్మెల్యేలున్నారని సచిన్ ప్రకటించుకున్నారు. దీంతో పార్టీలో చీలిక ఖాయమైంది.

200 మంది ఎమ్మెల్యేలున్న రాజస్తాన్‌ అసెంబ్లీలో కాంగ్రెస్‌కు ప్రస్తుతం 107 మంది, బీజేపీకి 72 మంది సభ్యులున్నారు. రాష్ట్రీయ లోక్‌తాంత్రిక్‌ పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు బీజేపీకి మద్దతిస్తున్నారు. 13 మంది స్వతంత్ర ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్‌కు మద్దతిస్తున్నారు. వారిలో ఇప్పుడు ఎంతమంది గెహ్లాట్ కు మద్దతిస్తారన్నది ఆసక్తిగా ఉంది.

కాంగ్రెస్‌లో పరిణామాల పట్ల సీనియర్ నేత కపిల్ సిబాల్ కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. అంతా అయిపోయాకే మేం మేల్కొంటాం… ఇది బాధాకరం అంటూ పార్టీ నాయకత్వ తీరుపై కపిల్ సిబాల్ పరోక్షంగా అసంతృప్తి వ్యక్తం చేశారు.

వరుసగా యువనాయకులు, అందులోనూ తండ్రుల కాలం నుంచి పార్టీతో ఉన్న వారు బయటకు వెళ్లిపోతుండడంతో కాంగ్రెస్‌ నాయకత్వ ఆలోచన ధోరణిపై చర్చ జరుగుతోంది. యువనాయకత్వాన్ని నిర్లక్ష్యం చేసి వృద్థులతో పార్టీ నడపడం సాధ్యమా అన్న చర్చ కాంగ్రెస్‌లో నడుస్తోంది.

First Published:  12 July 2020 9:34 PM GMT
Next Story