Telugu Global
National

తెలుగు రాష్ట్రాలపై ఆధిపత్యం కోసం బీజేపీ 'జల'రాజకీయం

తెలుగు రాష్ట్రాల మధ్య తలెత్తిన నీటి తగాదాలను కేంద్రంలో ఉండే బిజెపి తనకు అనుకూలంగా మలుచుకునేందుకు పావులు కదిలిస్తోంది. కోవిడ్ సమయంలో హడావుడిగా రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కేంద్ర మంత్రి అపెక్స్ కౌన్సిల్ సమావేశం నిర్వహించేందుకు ఆసక్తి చూపడం వెనుక కారణాలేమిటి? ఇంత హడావుడిగా సమావేశం నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం, బిజెపి పట్టుబట్టడం వెనుక ఆంతర్యం ఏమిటి? తెలంగాణలో బిజెపి పార్టీ కోరిన విధంగానే కేంద్ర ప్రభుత్వం ప్రతీ అంశంలో పావులు కదుపుతుండడం వెనుక రాజకీయ కారణాలు […]

తెలుగు రాష్ట్రాలపై ఆధిపత్యం కోసం బీజేపీ జలరాజకీయం
X

తెలుగు రాష్ట్రాల మధ్య తలెత్తిన నీటి తగాదాలను కేంద్రంలో ఉండే బిజెపి తనకు అనుకూలంగా మలుచుకునేందుకు పావులు కదిలిస్తోంది.

కోవిడ్ సమయంలో హడావుడిగా రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కేంద్ర మంత్రి అపెక్స్ కౌన్సిల్ సమావేశం నిర్వహించేందుకు ఆసక్తి చూపడం వెనుక కారణాలేమిటి?

ఇంత హడావుడిగా సమావేశం నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం, బిజెపి పట్టుబట్టడం వెనుక ఆంతర్యం ఏమిటి? తెలంగాణలో బిజెపి పార్టీ కోరిన విధంగానే కేంద్ర ప్రభుత్వం ప్రతీ అంశంలో పావులు కదుపుతుండడం వెనుక రాజకీయ కారణాలు ఉన్నట్లు పరిశీలకులు అంచనా వేస్తున్నారు.

రాయలసీమ ప్రాంతంలో కృష్ణా వరద నీటిని వినియోగించుకునే విధంగా చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అపెక్స్ కౌన్సిల్ సమావేశాన్ని ఈ నెల 25న నిర్వహిస్తోంది. తొలుత 5 వ తేదీ నిర్వహించాలని ప్రతిపాదించగా తెలంగాణ ముఖ్యమంత్రి కోరిక మేరకు వాయిదా వేశారు. రెండు రాష్ట్రాల అభిప్రాయాలను తెలుసుకోకుండానే సమావేశ తేదీని (25) ఖరారు చేసి ఇద్దరికీ కేంద్ర ప్రభుత్వం లేఖలు పంపింది.

వాస్తవానికి అంతరాష్ట్ర వివాదాలు ముఖ్యంగా నీటి పంపకాలకు సంబంధించినవి ఇప్పటివి కాదు. కొన్ని దశాబ్దాలుగా కొనసాగుతూనే ఉన్నాయి. కృష్ణా జలాలకు సంబంధించి లభ్యత తక్కువగా ఉండి వినియోగం పెరుగుతుండడంతో గత నాలుగు దశాబ్దాలుగా అంతరాష్ట్ర వివాదాలు తీవ్రమయ్యాయి.

నీటి పంపకానికి సంబంధించి బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కేటాయింపు అమలులోకి రావాల్సి ఉంది. ఈ సమయంలోనే తెలుగు రాష్ట్రాలు ఆంధ్ర – తెలంగాణగా విడిపోయాయి. రెండు రాష్ట్రాల్లోనూ ప్రాంతీయ పార్టీలే అధికారంలో ఉన్నాయి. జాతీయ పార్టీలైన బిజెపి, కాంగ్రెస్ కనుచూపుమేరలో కూడా ఈ రాష్ట్రాలలో ఉనికిని చాటుకోలేకపోతున్నాయి.

ఇపుడు తాజాగా బిజెపి, కేంద్ర ప్రభుత్వం రాయలసీమ ఎత్తిపోతల పథకం ఆపాలని పట్టుదలతో ఉంది. కేంద్ర మంత్రి ఏపి ప్రతినిధులతో మాట్లాడినట్లు తెలిసింది. అదే విధంగా కొత్తపథకం కాదంటూ ఎన్జీటి కమిటి ఇచ్చిన ఆదేశాలను స్క్రూటినీ చేయిస్తూ ఆ ఆదేశాలు రివర్స్ చేయించేందుకు ప్రయత్నిస్తోందట కేంద్రం. రాయలసీమ ఎత్తిపోతల పథకం పై ఎందుకు ఇంత పట్టుదలతో బిజెపి వ్యవహరిస్తోంది?

సాగునీటి రంగానికి తెలుగు రాష్ర్టాల ప్రాధాన్యతే బీజేపీ కన్నుకుట్టిందా?

రెండు రాష్ట్రాల్లోనూ సాగునీటి రంగానికి ప్రభుత్వాలు ప్రాధాన్యత ఇస్తున్నాయి. అందులో భాగంగా కాళేశ్వరం, పోలవరం లాంటి ప్రాజెక్టులు గోదావరిపై నిర్మిస్తుండగా కృష్ణా నీటి ఆధారంగా తెలంగాణలో పాలమూరు రంగారెడ్డి, డిండి, ఉదయసముద్రం, ఎస్ఎల్బిసి లాంటి ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయి.

ఏపిలో హంద్రి-నీవా, గాలేరు-నగరి తదితర ప్రాజెక్టులు నిర్మాణం చివరిదశలో ఉన్నాయి.

రెండు రాష్ట్రాల్లోనూ ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు పూర్తి చేసినప్పటికీ కృష్ణాలో నీటి సమస్య ఎదురయ్యే పరిస్థితి లేదు. తరచూ వరద నీరు వృధా అవుతోంది. గత ఏడాది 600 టిఎంసీలు వృధా అయ్యింది. ఒకవేళ కృష్ణాలో నీటి సమస్య ఎదురైనప్పటికీ గోదావరి నీటి మళ్లింపు ఆధారంగా ఈ సమస్యను అధిగమించడం వీలవుతుంది.

పోలవరం పూర్తయితే, తాజాగా చేపట్టిన కృష్ణా-పెన్నా నదుల అనుసంధానం పూర్తయిన తరువాత కృష్ణా నదిపై నాగార్జున సాగర్ నుంచి ఆధారపడడం తగ్గిపోతుంది.

ఈ పరిస్థితుల్లో శ్రీశైలం నుంచి అధికనీటిని వినియోగించుకునే విధంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు పటిష్టమైన కార్యాచరణను అమలు చేయాలి. అందుకోసం శ్రీశైలం జలాశయాన్ని విద్యుత్ ఉత్పత్తికి బదులు (అసలు తొలుత ఈ ప్రాజెక్ట్ జల విద్యుత్ కోసం నిర్మించారు) పూర్తిగా సాగు, తాగు నీటి అవసరాల కోసం వినియోగించుకోవచ్చు.

తెలంగాణలో ముఖ్యంగా మహబూబ్ నగర్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లో వర్షాధార పంటలు ఎక్కువగా పండిస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ లోని రాయలసీమ ప్రాంతంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఈ రెండు ప్రాంతాల్లోనూ తాగు, సాగు నీటి సౌకర్యాలు మెరుగుపరచడానికి పైన పేర్కొన్న సాగునీటి పథకాలను యుద్ధ ప్రాతిపదికన పూర్తిచేయాలి.

తెలంగాణలో కృష్ణా ఆధారిత ప్రాజెక్ట్ లపై నిర్లక్ష్యం…

తెలంగాణలోని కృష్ణా ఆధారిత సాగునీటి పథకాలు నత్తనడకన నడుస్తున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టును మూడేళ్ళలో పూర్తిచేసి తెలంగాణ ముఖ్యమంత్రి చరిత్ర సృష్టించారు. ఊహించని విధంగా ఎక్కడో ఉన్న గోదావరి నీటిని పంపింగ్ ద్వారా హైదరాబాద్ దగ్గరవరకు తీసుకురావడం ద్వారా ఆయన అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు. అదే విధంగా దక్షిణ తెలంగాణలోని ప్రాజెక్టుల పై ముఖ్యమంత్రి శ్రద్ధ చూపడం లేదనే అభిప్రాయం బలంగా ఉంది.

దక్షిణ తెలంగాణలో సాగునీరు అందించేందుకు చేపట్టిన ప్రాజెక్టులను పూర్తిచేయడం ద్వారా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడంతోపాటు కృష్ణా నీటిని గరిష్టంగా వాడుకోవడం తెలంగాణకు సాధ్యమవుతుంది.

అదే విధంగా ఏపిలోని రాయలసీమ ప్రాంతానికి సాగు, తాగు నీరు అందించడానికి వరద, మిగులు, నికర జలాల కేటాయింపులు ఉన్నాయి. అందుకు సంబంధించి కొన్ని పథకాలు పూర్తయి మరికొన్ని పథకాలు నిర్మాణంలో ఉన్నప్పటికి కేటాయించిన నీటిని ఏపి వినియోగించుకోలేకపోతోంది.

ఏపిలో నీటిని వినియోగించుకోలేకపోతున్న పోతిరెడ్డిపాడు ఎత్తు సమస్య…

శ్రీశైలం జలాశయం నుంచి రాయలసీమకు పోతిరెడ్డిపాడు ద్వారా 114 టిఎంసిల నీటిని వినియోగించాల్సి ఉండగా గత రెండు సంవత్సరాలు మినహాయిస్తే మిగిలిన ఏ ఏడాది కూడా సగం నీటిని కూడా సీమ ప్రాజెక్ట్ లకు మళ్లించలేకపోయారు.

రాయలసీమకు తెలుగు గంగ (29 టిఎంసీలు), ఎస్.ఆర్.బి.సి (19), గాలేరు-నగరి-జిఎన్ఎస్ఎస్ (39), చెన్నైకి తాగు నీరు (15), టిబిపిహెచ్ ఎల్ సి (10), తాగు నీటి అవసరాలు- ఆవిరి నష్టాలు (3 టిఎంసీలు) కలిపి మొత్తం 114 టిఎంసీల నీటిని వినియోగించుకోవాలి.

2004-5 నుంచి 2019-20 వరకు నీటి వినియోగాన్ని పరిశీలిస్తే ఆ విషయం తేటతెల్లం అవుతోంది. 2004-05లో మొత్తం 56.51 టిఎంసిలు వినియోగించారు. 2005-06లో 78.49, 2007-08లో 48.05, 2009-10లో 60.14 టిఎంసిలు (ఈ సంవత్సరం కృష్ణాకు చారిత్రాత్మక స్థాయిలో భారీ వరద వచ్చింది) మాత్రమే వినియోగించారు. 2012-13లో అతి తక్కువగా 22.49 టిఎంసిలు, 2014-15లో 59.17 నీటిని ఉపయోగించారు. 2015-16లో అతి తక్కువగా కేవలం 0.95 అంటే ఒక టిఎంసి నీటిని కూడా విడుదల చేయలేదు. ఆ తర్వాత వరుసగా నాలుగేళ్ళు గత ఏడాది వరకు 67.44, 91.70,115.40, 179.30 టిఎంసిల చొప్పున లభించాయి.

రాయలసీమ ఎత్తిపోతల పాత ప్రాజెక్టే…

ఈ పరిస్థితుల్లో నీటిని పూర్తిస్థాయిలో వినియోగించుకొని వృధాను అరికట్టేందుకు రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఏపి ప్రభుత్వం చేపట్టింది. ఇది కొత్త పథకం కాదని ఎన్జీటి ఆదేశాల మేరకు ఏర్పడిన కేంద్ర పర్యావరణ నిపుణుల కమిటి తేల్చిచెప్పింది. వాస్తవానికి ఈ ప్రాజెక్ట్ కింద కొత్త ఆయకట్టు లేనేలేదు. పాత ఆయకట్టుకు అంటే పైన పేర్కొన్న ప్రాజెక్టుకు కేటాయించిన నీరు ఎస్ఆర్ఎంసిలోకి వెళ్లేందుకు మాత్రమే ఉపయోగపడుతుంది. అందుకోసం సంఘమేశ్వర వద్ద పంపింగ్ కేంద్రాన్ని నిర్మించి నీటిని ఎస్ఆర్ఎంసిలోకి పోతిరెడ్డిపాడు సమీపంలో విడుదల చేస్తారు. అందువల్ల ఈ ప్రాజెక్ట్ ను కొత్త ప్రాజెక్ట్ గా పరిగణించాల్సిన అవసరం లేదు. కేటాయించిన నీటిని ఉపయోగించుకునేందుకు మాత్రమే వీలవుతుంది.

రాజకీయ స్వార్థంతో పార్టీలు?

అయితే వివాదం ఎందుకు తలెత్తింది? ఏపిలోని రాజకీయ పార్టీలు దీనిపై మాట్లాడడం లేదు. తేలుకుట్టిన దొంగల్లా తెలుగుదేశం, సిపిఐ, కాంగ్రెస్ పార్టీలు వ్యవహరిస్తున్నాయి. దీనిపై మాట్లాడితే ప్రాంతాల ప్రకారం ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి ఆ పార్టీలు నోరుమెదపడం లేదు. ఇక ఎల్లో మీడియా కూడా అదే ధోరణిలో వ్యవహరిస్తోంది. అందువల్ల ఏపిలో దీనిపై చర్చేలేదు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైఫల్యం…

అదే సమయంలో ఏపి ప్రభుత్వం రాజకీయంగా ఘోరంగా వైఫల్యం చెందింది. ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి వాస్తవాలను ప్రజల ముందు ఉంచలేకపోతోంది. ఇంతవరకు ముఖ్యమంత్రిగానీ, నీటి పారుదల శాఖ మంత్రిగానీ, లేదా అధికార పార్టీ నేతలుగానీ ఈ ప్రాజెక్టు గురించి నోరు విప్పిందేలేదు.

ప్రాజెక్ట్ కొత్తది కాదని, కేటాయించిన నీటినే వినియోగించుకుంటున్నామని రెండు రాష్ట్రాల ప్రజలకు అర్థమయ్యేరీతిలో వివరించడానికి ఆసక్తి చూపడం లేదు. దాంతో ఏపి ప్రభుత్వం తెలంగాణకు అన్యాయం చేస్తోందని తెలంగాణ ప్రాంత ప్రజల్లో ముఖ్యంగా దక్షిణ తెలంగాణ ప్రాంతంలో అభిప్రాయం బలంగా ఉంది. ఇక్కడ ఏపి ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది.

తెలంగాణలోనే వివాదం – బిజెపి నిప్పు రాజేస్తోందా?

వివాదమల్లా తెలంగాణకు వచ్చేసరికే. తెలంగాణలోని రాజకీయ పార్టీలు ముఖ్యంగా కాంగ్రెస్, బిజెపిలు… కేసీఆర్ జగన్ తో కుమ్మక్కు కావడం వల్లనే రాయలసీమ ఎత్తిపోతల పథకం గురించి చూసిచూడనట్లు వ్యవహరిస్తున్నారని బలంగా ఆరోపణలు వచ్చాయి.

ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు తెలంగాణ హైకోర్టులో కేసు వేశారు. ఎన్జీటిలో కేసు వేసినప్పటికీ టెండర్ ప్రక్రియ నిర్వహించుకునేందుకు అనుమతి లభించింది. తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టులో కేసు వేసింది. ఇవన్నీ విచారణ జరగాల్సి ఉంది. ఈలోగా ఎన్జీటి ఆదేశాల మేరకు ఏపి ప్రభుత్వం రాయలసీమ ఎత్తిపోతల పథకానికి టెండర్ ప్రక్రియను ముగించింది.

స్థానిక బిజెపి నాయకులు తెలంగాణలో మాట్లాడుతున్న విధంగానే కేంద్రం ప్రభుత్వం రంగంలోకి దిగింది. రెండు రాష్ట్రాల్లోనూ బిజెపి నాయకులు అక్కడి ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా ఆ రాష్ట్ర ప్రభుత్వాల పట్ల అదే ధోరణితో వ్యవహరిస్తోంది.

ఏపిలో ఇప్పుడు బిజెపి ధోరణి మారింది. కేంద్ర ప్రభుత్వంతో ఏపికి ఇప్పటికైతే సఖ్యత వాతావరణమే ఉంది. తెలంగాణలో అందుకు భిన్నంగా ఉంది. లోక్ సభ ఎన్నికల తరువాత టిఆర్ఎస్ తో బిజెపికి సంబంధాలు పూర్తిగా బెడిసికొట్టాయి. ప్రతీ చిన్న అంశంపైన బిజెపి నాయకులు కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తుంటే వాటి ఆధారంగా కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వానికి తాఖీదులు పంపుతోంది. గతంలో ఈ విధంగా ఉండేది కాదు.

నీటి విషయానికి వస్తే కాళేశ్వరం మూడో టిఎంసీ పనులు, రాయలసీమ ఎత్తిపోతల పథకంపై తెలంగాణ బిజెపి నాయకులు చేసిన ఫిర్యాదులకు అనుకూలంగా కేంద్ర మంత్రిత్వ శాఖలు దూకుడుగా వ్యవహరిస్తున్నాయి. కేంద్రంలోని బిజెపి ముఖ్యంగా ఆర్ఎస్ఎస్… వన్ నేషన్ విధానాన్ని అన్ని విభాగాల్లోనూ అమలు చేసేందుకు ఆసక్తి చూపిస్తోంది. ఇప్పుడు నీటి పారుదల రంగంలో కూడా అదే ప్రయోగం చేస్తోంది. రాష్ట్రాల మధ్య ముఖ్యంగా తెలంగాణ, ఏపి మధ్య వివాదాన్ని తనకు అనుకూలంగా మలుచుకునేందుకు ప్రయత్నిస్తోందని ఇంజనీరింగ్ నిపుణులు సైతం అభిప్రాయ పడుతున్నారు. రెండు రాష్ట్రాల జుట్టు తమ చేతుల్లో ఇరికించుకోవాలనే విధానం కనిపిస్తోంది.

కాళేశ్వరం మూడో టిఎంసీ పనులు, పాలమూరు రంగారెడ్డి, డిండి, ఉదయ సముద్రం తో పాటు రాయలసీమ ఎత్తిపోతల పథకానికి డిపిఆర్లు ఇవ్వాలని అప్పటిదాకా పనులు ఆపేయాలని కేంద్రం ఆదేశించినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. ఇప్పటికే రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించవద్దని కేంద్రం ఆదేశించింది. ఈ విధంగా మొత్తం వ్యవహరాన్ని తమ కనుసన్నల్లోకి తిప్పుకోవడం ద్వారా తెలంగాణకు అనుకూలంగా వ్యవహరించి ఈ ప్రాంతంలో బలపడాలనేది బిజెపి వ్యూహమా? అనే అనుమానం ఇంజనీరింగ్ నిపుణులు వ్యక్తం చేస్తున్నారు.

ఏపిలో బిజెపి బలపడే సూచనలు కనిపించడం లేదు. తెలంగాణలో కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయంగా ఎదగాలంటే టిఆర్ఎస్ ను ఇరకాటంలో పెట్టి ఈ ప్రాంతానికి మేలుచేస్తున్న విధంగా పార్టీ, కేంద్ర ప్రభుత్వం వ్యవహరించేందుకు సన్నద్దమవుతున్నట్లు రాజకీయ పరిశీలకులు ప్రస్తుత పరిణామాలను బట్టి అంచనా వేస్తున్నారు.

ఇదే జరిగితే రెండు రాష్ట్రాల రైతులు నష్టపోయే విధంగా కృష్ణా నీరు వృధాగా సముద్రం పాలవుతుంది. అటు రాయలసీమ, ఇటు దక్షిణ తెలంగాణ శాశ్వతంగా కరువుబారిన పడతాయి.

First Published:  21 Aug 2020 3:44 AM GMT
Next Story