జనసేన, బీజేపీ... ఏంటీ గందరగోళం...
రాజధాని తరలింపు వ్యవహారంలో కౌంటర్ దాఖలు చేస్తానంటూ ముందుకొచ్చింది జనసేన. అమరావతి రైతులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తానంటున్నారు పవన్ కల్యాణ్. అంటే పరోక్షంగా మూడు రాజధానులకు ఆయన తన మద్దతు లేదని ప్రకటించినట్టే. ఇక రాష్ట్రంలో జనసేన మిత్రపక్షం బీజేపీ విషయానికొస్తే.. ఆ పార్టీ ఈ విషయంలో ఎలాంటి సంకేతాలను ఇవ్వలేదు. అంటే జనసేన నిర్ణయాన్ని కేవలం పవన్ కల్యాణ్ నిర్ణయంగా మాత్రమే చూడాలా? లేదా మిత్రపక్షం బీజేపీ కూడా అదే దారిలో ఉందని […]
రాజధాని తరలింపు వ్యవహారంలో కౌంటర్ దాఖలు చేస్తానంటూ ముందుకొచ్చింది జనసేన. అమరావతి రైతులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తానంటున్నారు పవన్ కల్యాణ్. అంటే పరోక్షంగా మూడు రాజధానులకు ఆయన తన మద్దతు లేదని ప్రకటించినట్టే.
ఇక రాష్ట్రంలో జనసేన మిత్రపక్షం బీజేపీ విషయానికొస్తే.. ఆ పార్టీ ఈ విషయంలో ఎలాంటి సంకేతాలను ఇవ్వలేదు. అంటే జనసేన నిర్ణయాన్ని కేవలం పవన్ కల్యాణ్ నిర్ణయంగా మాత్రమే చూడాలా? లేదా మిత్రపక్షం బీజేపీ కూడా అదే దారిలో ఉందని అనుకోవాలా? ఓవైపు కేంద్రం తమ పరిధిలో ఏమీ లేదు అని కోర్టులో అఫిడవిట్ దాఖలు చేయడం, మరోవైపు రాష్ట్రంలో తమ మిత్రపక్షమైన జనసేనతో కౌంటర్ దాఖలు చేయించాలని చూడటం.. ఇదంతా దేనికి సంకేతం.
అంటే ఈ వ్యవహారాన్ని ఇలాగే కోర్టుల్లో సాగదీయాలనేది కేంద్రం వ్యూహమా? ఒకవేళ అదే నిజమైతే.. మరో మూడున్నరేళ్లపాటు రాజధాని తరలింపు వ్యవహారం కోర్టుల్లో నానితే నష్టపోయేది ఎవరు? ఏపీ ప్రజలు కాదా?
కరోనా వల్ల ఈ ఏడాది విద్యా సంవత్సరం ఆలస్యమైంది కానీ, లేకపోతే ఇంగ్లిష్ మీడియం వ్యవహారంపై పెద్ద రచ్చ జరిగేది. న్యాయస్థానాల జోక్యంతో అసలు ఇంగ్లిష్ మీడియం ఉంటుందా లేదా అనే సందేహం కూడా ఏర్పడింది. ఇప్పుడు మూడు రాజధానుల వ్యవహారం కూడా అలాగే కనిపిస్తోంది.
టీడీపీ అమరావతి వైపు నిలిచిపోయింది. వైసీపీ అభివృద్ధి వికేంద్రీకరణను వదిలిపెట్టనంటోంది. గోడమీద పిల్లి వాటంలా.. అటు ఇటు అంటోంది మాత్రం బీజేపీ, జనసేనే. ఏది జరిగినా దాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవాలని చూస్తున్నాయి ఈ రెండు పార్టీలు. మా చేతిల్లో ఏమీ లేదు అని చెబుతూనే, మేం చేయాల్సింది చేస్తాం అన్నట్టుగా ప్రవర్తిస్తున్నాయి. మూడు రాజధానుల విషయంలో ప్రజల్లో మరింత గందరగోళానికి కారణం అవుతున్నాయి బీజేపీ, జనసేన.