Telugu Global
National

దేవీ నవరాత్రులు... ‘అందరికీ ఆహ్వానం’ బదులు... ‘నో ఎంట్రీ’ !

సాధారణంగా ఉత్సవాలు, వేడుకలు జరుగుతున్నపుడు ఎంత ఎక్కువమంది వస్తే అంతమంచిదని అందరూ భావిస్తారు. అందుకే వెల్ కమ్… అని, అందరికీ ఆహ్వానం అనీ బోర్డులు పెడుతుంటారు. కానీ ఇప్పుడున్న పరిస్థితి వేరు. ఎంత తక్కువమంది వస్తే అంత మంచిది.  పశ్చిమ బెంగాల్లో దసరా నవరాత్రుల సంబరాల్లో సైతం ఇదే పరిస్థితి కనబడుతోంది. దుర్గామాత పూజ జరుగుతున్న మండపాల ముందు ‘నో ఎంట్రీ’ బోర్డులు దర్శనమిస్తున్నాయి. అమ్మవారి పూజా మండపాల్లోకి నిర్వాహకులు మాత్రమే వెళ్లాలని, ఎవరెవరు వెళ్లవచ్చు… అనేది […]

దేవీ నవరాత్రులు... ‘అందరికీ ఆహ్వానం’ బదులు... ‘నో ఎంట్రీ’ !
X

సాధారణంగా ఉత్సవాలు, వేడుకలు జరుగుతున్నపుడు ఎంత ఎక్కువమంది వస్తే అంతమంచిదని అందరూ భావిస్తారు. అందుకే వెల్ కమ్… అని, అందరికీ ఆహ్వానం అనీ బోర్డులు పెడుతుంటారు. కానీ ఇప్పుడున్న పరిస్థితి వేరు. ఎంత తక్కువమంది వస్తే అంత మంచిది. పశ్చిమ బెంగాల్లో దసరా నవరాత్రుల సంబరాల్లో సైతం ఇదే పరిస్థితి కనబడుతోంది. దుర్గామాత పూజ జరుగుతున్న మండపాల ముందు ‘నో ఎంట్రీ’ బోర్డులు దర్శనమిస్తున్నాయి.

అమ్మవారి పూజా మండపాల్లోకి నిర్వాహకులు మాత్రమే వెళ్లాలని, ఎవరెవరు వెళ్లవచ్చు… అనేది తెలుపుతూ ఆ పేర్లను ప్రకటిస్తూ మండపం బయట బోర్డులు ఉంచాలని కోల్ కతా హైకోర్టు ఆదేశాలివ్వటంతో ఉత్సవాల్లో ఈ తీరు కనబడుతోంది. పెద్ద మండపాల్లోకి 25 మంది, చిన్నవాటిలోకి 15 మంది మాత్రమే వెళ్లాలని కూడా కోర్టు నిబంధన విధించింది. పూజా స్థలంలోకి జనాన్ని అనుమతిస్తే… పోలీసులు నియంత్రించలేరని, రెండుమూడు లక్షలమంది భక్తులను ఇరవై వేలమంది పోలీసులు ఎలా కంట్రోల్ చేయగలరని న్యాయస్థానం ప్రశ్నించింది. రాష్ట్రంలో దసరా నవరాత్రుల పూజా మండపాలను అనుమతించడంపై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని విచారిస్తూ కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.

పూజలు నిర్వహించే చిన్న మండపాలకు ఐదుమీటర్లు, పెద్దవాటికి పదిమీటర్ల దూరం వరకు నో ఎంట్రీ జోన్లగా పరిగణించాలని కోర్టు పేర్కొంది. మండపం సరిహద్దు ఎక్కడ ఉందో అక్కడినుండి ఈ కొలతలు వేయాల్సి ఉంటుంది. ఇలాంటి చర్యలు తీసుకోకపోతే జనం గుమిగూడటం వలన ఒక్కసారిగా వైరస్ విజృంభించే ప్రమాదం ఉందని కోర్టు తన ఉత్తర్వుల్లో పేర్కొంది. అందుకే అమ్మవారికి ఘనంగా నవరాత్రులు నిర్వహించే పశ్చిమ బెంగాల్లో… పూజా మండపాల్లో ‘ప్రవేశం లేదు’ అనే బోర్డులు దర్శనమిస్తున్నాయి.

రాష్ట్రవ్యాప్తంగా 37వేల దుర్గాపూజా ఈవెంట్లు నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నిర్వాహక సంస్థకు యాభై వేలు ప్రకటించింది. అయితే ప్రభుత్వం దుర్గాపూజకు కేటాయించిన డబ్బుని శానిటైజర్లకు, మాస్కులకు, స్థానికంగా కోవిడ్ నిబంధనలు పాటించేందుకు, జాగ్రత్త చర్యలకు మాత్రమే ఖర్చుచేయాలని హైకోర్టు గతవారమే పేర్కొంది. ఇదిలా ఉంటే… మండపాల వద్ద అతిపెద్ద టివి తెరలను ఏర్పాటు చేసి ప్రజలు దూరం నుండే అమ్మవారి పూజని చూసేలా నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు.

First Published:  21 Oct 2020 12:29 AM GMT
Next Story