అటు పొగుడుతూ... ఇటు గిల్లుతున్నాడు...
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు మధ్య అగాధం ఉందన్న విషయం అందరికీ తెలిసిందే. త్వరలో జరుగుతాయనుకున్న స్థానిక సంస్థల ఎన్నికలను మార్చిలో ఎవరితోనూ సంప్రదించకుండా కరోనా సాకుతో ఏకపక్షంగా వాయిదా వేసిన రమేష్ కుమార్ నేరుగా ప్రభుత్వంతో తగాదాకు ఆజ్యం పోశారు. ఆ తరువాత పలు పరిణామాలు జరిగి, మళ్ళీ ఆయనే ఎన్నికల కమిషనర్ గా వచ్చారు. అయితే ఇప్పుడు ఆయన ప్రభుత్వాన్ని ప్రసన్నం చేసుకునేందుకో, తన పంతం నెగ్గించుకుని ఎన్నికలు […]
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు మధ్య అగాధం ఉందన్న విషయం అందరికీ తెలిసిందే. త్వరలో జరుగుతాయనుకున్న స్థానిక సంస్థల ఎన్నికలను మార్చిలో ఎవరితోనూ సంప్రదించకుండా కరోనా సాకుతో ఏకపక్షంగా వాయిదా వేసిన రమేష్ కుమార్ నేరుగా ప్రభుత్వంతో తగాదాకు ఆజ్యం పోశారు. ఆ తరువాత పలు పరిణామాలు జరిగి, మళ్ళీ ఆయనే ఎన్నికల కమిషనర్ గా వచ్చారు.
అయితే ఇప్పుడు ఆయన ప్రభుత్వాన్ని ప్రసన్నం చేసుకునేందుకో, తన పంతం నెగ్గించుకుని ఎన్నికలు నిర్వహించడానికో తెలీదుగాని జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని పొగుడుతున్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ
ప్రభుత్వంపై పొగడ్తలతో పాటు మరో కీలకమైన అంశాన్ని కూడా ప్రకటించారు.
ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలను నిర్వహించనున్నట్టు వెల్లడించారు. అన్ని రాజకీయ పక్షాలతో చర్చించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. పంచాయతీ ఎన్నికలకు న్యాయపరమైన ఇబ్బందులు లేవన్నారు. అందులోనూ పార్టీలకు అతీతంగా జరిగే ఎన్నికలన్నారు.
ఏపీలో కరోనా ఉధృతి తగ్గిందని, 10 వేల నుంచి 753కు కేసుల సంఖ్య తగ్గిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్లే ఇది సాధ్యమైందని అన్నారు. ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలను నిర్వహించాలని అనుకోవడానికి గల కారణాలను ఆయన వెల్లడించారు.
రాజ్యాంగపరమైన అవసరంతో పాటు కేంద్ర ఆర్థిక సంఘం నిధులు తీసుకునేందుకు ఈ ఎన్నికలు తప్పక నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణలో జీహెచ్ఎంసీ ఎన్నికలు కూడా జరుగుతున్నాయని ఆయన గుర్తు చేశారు. నాలుగు వారాల ముందు ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుందని వివరించారు.
కుదరదంటున్న ప్రభుత్వం
ఇది ఇలా ఉండగా ఈసీ నిర్ణయాన్ని ప్రభుత్వం వ్యతిరేకిస్తోంది. మార్చిలో కేవలం రెండే రెండు కేసులున్నపుడు ఎన్నికలను వాయిదా వేసిన కమిషన్ ఇప్పుడు రోజూ వందల్లో పాజిటివ్ కేసులు వస్తుంటే ఎన్నికలు ఎలా జరుపుతుందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు.
కరోనా వైరస్ రెండోవేవ్ కూడా ఉండొచ్చని వైద్య నిపుణులు చెబుతున్న విషయాన్ని ఆయన గుర్తు చేస్తూ ఇప్పుడు ఎన్నికలు నిర్వహించడం ప్రమాదకరమే అన్నారు. ఇప్పుడు ఈసీ ఎలా స్పందిస్తుందో చూడాలి.