మీకు ఇలాంటి సలహాలు ఎవరిస్తున్నారు జగన్?
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నడుపుతున్నారా? డీజీపీ గౌతమ్ సవాంగ్ నడుపుతున్నారా? అని ప్రశ్నించాడు నిన్న సీపీఐ నాయకుడు రామకృష్ణ. ‘పోలవరం పరిరక్షణ యాత్ర’ అంటూ శనివారం రాత్రికి రాజమండ్రికి చేరుకున్న సీపీఐ రామకృష్ణను హోటల్ గదిలో ఎందుకు నిర్భందించాల్సి వచ్చిందో… ఎవరికీ అర్థం కాదు. అలాగే మరో సీపీఐ నాయకుడు నారాయణను తిరుపతిలో ఎందుకు అదుపులోకి తీసుకోవాల్సి వచ్చిందో ఎవరికీ అంతుపట్టడం లేదు. సీపీఐ నాయకుల పోలవరం పరిరక్షణ యాత్ర వెనకాల ఎవరైనా […]
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నడుపుతున్నారా? డీజీపీ గౌతమ్ సవాంగ్ నడుపుతున్నారా? అని ప్రశ్నించాడు నిన్న సీపీఐ నాయకుడు రామకృష్ణ.
‘పోలవరం పరిరక్షణ యాత్ర’ అంటూ శనివారం రాత్రికి రాజమండ్రికి చేరుకున్న సీపీఐ రామకృష్ణను హోటల్ గదిలో ఎందుకు నిర్భందించాల్సి వచ్చిందో… ఎవరికీ అర్థం కాదు. అలాగే మరో సీపీఐ నాయకుడు నారాయణను తిరుపతిలో ఎందుకు అదుపులోకి తీసుకోవాల్సి వచ్చిందో ఎవరికీ అంతుపట్టడం లేదు.
సీపీఐ నాయకుల పోలవరం పరిరక్షణ యాత్ర వెనకాల ఎవరైనా ఉండొచ్చు. ఎవరి ప్రోద్భలంతోనైనా ఆయన ఈ యాత్ర చేపట్టి ఉండవచ్చు, ఏ పార్టీ ప్రయోజనాలకోసమో సీపీఐ ఇలాంటి త్యాగాలు చేస్తూ ఉండవచ్చు. కానీ…. రామకృష్ణ పోలవరాన్ని సందర్శించకుండా ఆపాల్సిన అవసరం ఎందుకొచ్చినట్లు? ఆయన పోలవరాన్ని సందర్శిస్తే శాంతిభద్రతల సమస్య తలెత్తుతుందా? పోలవరం పనులు ఎలా జరుగుతున్నాయో ప్రజలకు తెలిసి, మైలేజీ వస్తుందని భయపడుతుందా ప్రభుత్వం?.
ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరంతరం పోరాటాలు చేయించడం చంద్రబాబుకు అలవాటు. తాను గానీ తన వాళ్ళ చేత గానీ ఎప్పుడూ ఏదో ఒక సమస్యపై ఆందోళనలు చేస్తూ నిరంతరం మీడియాలో ప్రముఖంగా కనిపించడం ఆయనకు ఇష్టం.
నిజానికి నిన్న సీపీఐ రామకృష్ణ చేయాలనుకున్న పోలవరం యాత్రం వైసీపీ సరిగ్గా వినియోగించుకొని ఉంటే జగన్ ప్రభుత్వానికి గొప్ప మైలేజీ వచ్చేది. రామకృష్ణను అడ్డుకోకుండా పోలవరానికి ఆయనను యాత్ర చేయనిచ్చి ఉంటే టీడీపీయే నష్టపోయేది.
కానీ రామకృష్ణ ఆరోపించినట్టు ఆయన యాత్రను అడ్డుకున్న ఆలోచన, ఆ నిర్ణయం వైసీపీ పెద్దలది కాక డీజీపీ సవాంగ్ నిర్ణయమే అయి ఉంటే ఆ నిర్ణయం తీసుకున్న సవాంగ్ టీడీపీకి ఎంతో మేలు చేసినట్లు అయ్యారు.
నిజానికి మేఘా సంస్థ… సీపీఐ రామకృష్ణ పోలవరం సందర్శనకు… ప్రాజెక్టు వద్ద స్వాగత ఏర్పాట్లు చేసింది. ఆయనకు, ఆయన అనుచరులకు మధ్యాహ్న భోజన ఏర్పాట్లు చేసింది. ఫొటో ఎగ్జిబిషన్ను ఏర్పాటు చేసింది. తాము ఈ ప్రాజెక్టు చేపట్టక ముందు పోలవరం ప్రాజెక్టు దృశ్యాలు, తాము ప్రాజెక్టు చేపట్టాక ఈ ఎనిమిది నెలలలో ఎంత ప్రోగ్రస్ ఉందో చూపించే ఫొటోలతో ఎగ్జిబిషన్ను ఏర్పాటు చేసింది.
రామకృష్ణ ప్రాజెక్టును సందర్శిస్తే ఈ కొద్దికాలంలోనే మేఘా సంస్థ ఈ ప్రాజెక్టును ఎంత ముందుకు తీసుకువెళ్ళిందో ప్రపంచానికి తెలిసేది. అనివార్యంగా రామకృష్ణ కూడా వేగంగా జరుగుతున్న ప్రాజెక్టు పనులను, పోలవరం పురోగతిని మెచ్చుకోక తప్పని పరిస్థితి ఏర్పడి ఉండేది.
అయితే రామకృష్ణ ఆరోపించినట్లు గౌతం సవాంగ్ నిర్ణయం వల్ల వైసీపీకి రావాల్సిన మైలేజీ రాకపోగా, టీడీపీకి గొప్ప మైలేజీ లభించింది. రామకృష్ణ నిర్భందంతో ఆంధ్రప్రదేశ్లో అనేకచోట్ల టీడీపీ శ్రేణులు ఆందోళనలు చేయడానికి అవకాశం లభించింది.