కోర్టులు తన పరిధిలోలేని అంశాలపై జోక్యం చేసుకోవడం మంచిది కాదు
మనిషికి మాట్లాడే స్వేచ్ఛను ప్రకృతే ప్రసాదించింది. అయితే, మనం ఒక దేశంలో ఉంటున్నాం కాబట్టి, ఆ దేశ రాజ్యాంగం విధించిన కొన్ని పరిమితులకు లోబడి స్వేచ్ఛగా మాట్లాడే హక్కు అందరికీ ఉంటుంది. ఈ పరిమిత స్వేచ్ఛను కూడా నిర్బంధిస్తే.. వ్యవస్థ కుప్పకూలుతుంది. భావ ప్రకటనా స్వేచ్ఛ లేదా పత్రికా స్వేచ్ఛపై న్యాయవ్యవస్థ తన పరిధికి మించి జోక్యం చేసుకోవడం ప్రజాస్వామ్యానికి కీడు చేస్తుందని వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ లీడర్, ఎంపీ విజయసాయిరెడ్డి అభిప్రాయపడ్డారు. శాసన వ్యవస్థ, కార్యనిర్వాహక […]
మనిషికి మాట్లాడే స్వేచ్ఛను ప్రకృతే ప్రసాదించింది. అయితే, మనం ఒక దేశంలో ఉంటున్నాం కాబట్టి, ఆ దేశ రాజ్యాంగం విధించిన కొన్ని పరిమితులకు లోబడి స్వేచ్ఛగా మాట్లాడే హక్కు అందరికీ ఉంటుంది. ఈ పరిమిత స్వేచ్ఛను కూడా నిర్బంధిస్తే.. వ్యవస్థ కుప్పకూలుతుంది. భావ ప్రకటనా స్వేచ్ఛ లేదా పత్రికా స్వేచ్ఛపై న్యాయవ్యవస్థ తన పరిధికి మించి జోక్యం చేసుకోవడం ప్రజాస్వామ్యానికి కీడు చేస్తుందని వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ లీడర్, ఎంపీ విజయసాయిరెడ్డి అభిప్రాయపడ్డారు.
శాసన వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ, న్యాయ వ్యవస్థ… ప్రభుత్వాన్ని నడిపే ఈ మూడు వ్యవస్థలు ప్రజలకు జవాబుదారీ అనేది నిజం. ప్రజల ప్రయోజనాలకు కట్టుబడి, వాళ్లకు సేవ చేయడానికే వాళ్లు ఇక్కడ ఉన్నారు. అధికారాల విభజన సిద్ధాంతం ప్రకారం ఈ మూడు వ్యవస్థలూ వేరువేరు విధులు కలిగి ఉన్నాయి. అలాగే, ఈ మూడింటికీ కొన్ని పరిధులు ఉన్నాయి. కాబట్టి, ఈ మూడు వ్యవస్థలు ఒకదానితో మరొకటి బ్యాలెన్స్ చేసుకుంటూ ప్రభుత్వాన్ని నడుపుతాయి.
అయితే, మూడు మూల స్తంభాలపైనే వ్యవస్థ నిలబడదు కదా? కాబట్టి, ఈ సమయంలో మనం నాలుగో స్తంభం అయిన మీడియా గురించి, అది పోషించే పాత్ర గురించి మాట్లాడుకోవాలి. ఈ మూడు వ్యవస్థలు ఎలా పని చేస్తున్నాయి? ప్రజాప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొనే ప్రభుత్వాన్ని నడుపుతున్నాయా? అని నిరంతరం కాపలా కాస్తూ ఈ మూడు వ్యవస్థలపై మీడియా నిఘా పెడుతుంది.
ప్రజల హక్కులకు భంగం కలిగినప్పుడు సామాజిక న్యాయం అందించడంలో భారత న్యాయవ్యవస్థ అవసరమైనప్పుడల్లా క్రియాశీల పాత్ర పోషించింది. పోషిస్తూనే ఉంది.
జ్యుడిషియల్ యాక్టివిజం, జ్యుడిషియల్ ఓవర్రీచ్
న్యాయవ్యవస్థ జోక్యాన్ని జ్యుడిషియల్ యాక్టివిజం, జ్యుడిషియల్ ఓవర్రీచ్ రెండు ప్రధాన విభాగాలుగా చూడొచ్చు. ఈ రెండింటి మధ్య సన్నటి గీత మాత్రమే ఉంది. ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని న్యాయమూర్తి ఒక విషయం మీద తన సొంత అభిప్రాయం చెప్పడమే జ్యుడిషియల్ యాక్టివిజం. ఇది పాజిటివ్ సైడ్. జ్యుడిషియల్ యాక్టివిజం హద్దులు మీరి… తన పరిధిలో లేని అధికారాలను కూడా ప్రభావితం చేస్తే దాన్ని జ్యుడిషియల్ ఓవర్రీచ్ అంటారు. జ్యుడిషియల్ ఓవర్రీచ్ విషయంలో… సుప్రీం కోర్టు చాలాసార్లు తమ దృష్టి సారించింది.
అయినా రాష్ట్రాల్లో ఉన్న హైకోర్టుల్లో ఈ విషయంలో ఇప్పటికీ అస్పష్టత, అంధకారం కొనసాగుతుండటం వల్ల అది.. పత్రికా స్వేచ్ఛను ప్రభావితం చేస్తోంది. ఉదాహరణకు ఒక స్కామ్కి సంబంధించి మాజీ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా వైకే సభర్వాల్ పై కార్టున్ని మిడ్ డే న్యూస్ పేపర్ ప్రచురించింది. దీన్ని సీరియస్గా తీసుకుంటూ 2007లో ఢిల్లీ హైకోర్టు ఆ పత్రిక ఎడిటర్, రిపోర్టర్, పబ్లిషర్, కార్టూనిస్ట్లకు నాలుగు నెలల జైలు శిక్ష విధించింది.
2017లో జరిగిన హైకోర్టు బార్ అసోసియేషన్ వర్సెస్ ఒడిశా కేసును రిపోర్ట్ చేసే విషయంలోనూ అక్కడి హైకోర్టు ఇలాగే ఆంక్షలు విధించింది. ఫిబ్రవరి 2017లో హైకోర్టును సందర్శించడానికి ఓ మహిళా ఇన్స్పెక్టర్ వచ్చింది. కోర్టు ప్రాంగణంలో తనతో కొంతమంది లాయర్లు అసభ్యంగా ప్రవర్తించారని ఆమె ఆరోపించారు. దీన్ని మీడియా ప్రసారం చేసింది. నిజనిజాలు తెలుసుకోకుండా మీడియా మహిళా ఇన్స్పెక్టర్ వర్షన్ని మాత్రమే రిపోర్ట్ చేస్తోందని హైకోర్టు సీరియస్ అయింది. మీడియా దీన్ని ఆపకపోతే న్యాయానికి దేవాలయంగా భావించే హైకోర్టు మీద ప్రజలు విశ్వాసం కోల్పోతారని, వెంటనే ఈ ప్రసారాలు ఆపేయాలని హైకోర్టు మీడియాకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
అమరావతి భూముల కేసును రిపోర్ట్ చేయకుండా మీడియాపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇటీవల ఇచ్చిన గ్యాగ్ ఆర్డర్ కూడా జ్యుడిషియల్ ఓవర్రీచ్కి ఒక స్పష్టమైన ఉదాహరణ. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన కొన్ని గంటల్లోనే ఈ ఉత్తర్వులు ఇచ్చింది. న్యాయవ్యవస్థ తన అధికార పరిధి దాటడం వల్ల ఏర్పడిన గందరగోళం ఇది.
న్యాయ నిపుణుడు, మాజీ కేంద్ర సమాచార కమిషనర్, ఆచార్య ఎం. శ్రీధర్ ఆన్లైన్ న్యూస్ పోర్టల్తో మాట్లాడుతూ… ‘‘హైకోర్టు ఆదేశాలు… 19 (1),19 (2) భావ ప్రకటనా స్వేచ్ఛకు వ్యతిరేకం. ఇది సమర్థనీయం మాత్రం కాదు’’ అని చెప్పారు.
ఈ కేసు ఎఫ్ఐఆర్ దశలో ఉన్నందున ఈ విషయంలో మీడియా ప్రసారాల గురించి మాట్లాడటం కోర్టు పరిధిలోకి రాదని ఉస్మానియా యూనివర్సిటీ, మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం ప్రొఫెసర్ కె. నాగేశ్వర్ అన్నారు.
మీడియా సున్నితమైన కేసులను బాధ్యతాయుతంగా కవర్ చేయాలని, ఈ కేసుల్లో విచారణకు దూరంగా ఉండాలనడాన్ని ఎవరూ కాదనరు. కానీ, ఏదేమైనా, పత్రికా స్వేచ్ఛ మీద ఆంక్షలు విధించడం, సమాచారం తెలియకుండా చేయడం అంటే పౌరులకు కీడు చేయడమే అవుతుంది. కార్యనిర్వాహక, శాసనసభ జారీ చేసిన ఉత్తర్వుల్ని న్యాయవ్యవస్థ రివ్యూ చేస్తుంది. మరి, న్యాయవ్యవస్థ పౌరుల భావాప్రకటనా స్వేచ్ఛను నియంత్రించినప్పుడు ఏం జరుగుతుంది? ప్రత్యేకించి పత్రికా స్వేచ్ఛపై ఆంక్షలు విధించడం, తన పరిధిలోలేని అంశాలపై కలుగు చేసుకోవడం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం భరించలేదు. ఒకవేళ భావప్రకటనా స్వేచ్ఛను నియంత్రిస్తే అది ప్రజాస్వామ్యం నాశనం కావడానికి దారితీస్తుంది.