రజనీని వెంటాడుతున్న ‘తూత్తుకుడి’ కేసు..! పార్టీ ప్రకటించబోతున్న టైంలో తలనొప్పులు..!
తమిళనాడులో కొత్త రాజకీయపార్టీని పెట్టబోతున్నట్టు తలైవా రజనీకాంత్ ప్రకటించారు. త్వరలోనే ఆ పార్టీకి సంబంధించిన జెండా, ఎజెండాను ప్రకటించబోతున్నారు. రజనీ పొలిటికల్ ఎంట్రీతో తమిళనాడులో రాజకీయం వేడెక్కింది. ఇప్పటికే విలక్షణ నటుడు కమల్హాసన్ పార్టీ పెట్టేశారు. మరోవైపు ప్రముఖ హీరో విశాల్ కూడా పోటీచేస్తున్నట్టు సమాచారం. తమిళనాడులో గతానికి భిన్నంగా ఆధ్యాత్మిక సిద్ధాంతాలతో రజనీకాంత్ పార్టీ పెట్టబోతున్నట్టు సమాచారం. అయితే తొలినుంచి తమిళప్రజలు ద్రవిడపార్టీలు, నాస్తికవాద పార్టీలవైపే మొగ్గుచూపారు. పెరియార్ రామస్వామి, అన్నాదురై, కరుణానిధి లాంటి అభ్యుదయభావాలున్న […]
తమిళనాడులో కొత్త రాజకీయపార్టీని పెట్టబోతున్నట్టు తలైవా రజనీకాంత్ ప్రకటించారు. త్వరలోనే ఆ పార్టీకి సంబంధించిన జెండా, ఎజెండాను ప్రకటించబోతున్నారు. రజనీ పొలిటికల్ ఎంట్రీతో తమిళనాడులో రాజకీయం వేడెక్కింది. ఇప్పటికే విలక్షణ నటుడు కమల్హాసన్ పార్టీ పెట్టేశారు. మరోవైపు ప్రముఖ హీరో విశాల్ కూడా పోటీచేస్తున్నట్టు సమాచారం. తమిళనాడులో గతానికి భిన్నంగా ఆధ్యాత్మిక సిద్ధాంతాలతో రజనీకాంత్ పార్టీ పెట్టబోతున్నట్టు సమాచారం.
అయితే తొలినుంచి తమిళప్రజలు ద్రవిడపార్టీలు, నాస్తికవాద పార్టీలవైపే మొగ్గుచూపారు. పెరియార్ రామస్వామి, అన్నాదురై, కరుణానిధి లాంటి అభ్యుదయభావాలున్న వ్యక్తులను తమిళప్రజలు ఆదరించారు. ఈ క్రమంలో రజనీ చేసే కొత్తరాజకీయాలను తమిళ ప్రజలు స్వాగతిస్తారో లేదు వేచిచూడాలి. అయితే మరికొన్నిరోజుల్లోనే తమిళనాడులో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఓ పాతకేసు ఇప్పుడు రజనీకాంత్ను వెంటాడుతోంది. తూత్తుకుడి ఆందోళనల నేపథ్యంలో రజనీకాంత్ చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు మద్రాస్ హైకోర్టు సమన్లు జారీచేసింది.
తూత్తుకుడి కేసు నేపథ్యం ఇదీ..!
తమిళనాడు రాష్ట్రంలోని తూత్తుకుడి ప్రాంతంలో ఉన్న వేదాంత స్టెరిలైట్ రాగి కర్మాగారాన్ని మూసివేయాలని 2018లో ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ఈ అందోళన తమిళనాడులో తీవ్ర ఉద్రిక్తతలు సృష్టించింది. తమిళప్రజలు పెద్ద ఎత్తున రోడ్లమీదకు వచ్చి నిరసన వ్యక్తం చేశారు. ఆందోళనలు అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు కాల్పులు జరిపారు. కాల్పుల్లో 13 మంది పౌరులు మరణించారు. ఈ ఘటనపై రాష్ట్రం అట్టుడుకుతుంటే రజనీకాంత్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
తూత్తుకుడి నిరసనలో అసాంఘిక శక్తులు ప్రవేశించాయని ఆయన ఆరోపించారు. రజనీ వ్యాఖ్యలపై పెద్ద దుమారం రేగింది. అసాంఘిక శక్తులు వచ్చాయని ఎలా చెప్పగలుగుతారని పలువురు రజనీకాంత్ను ప్రశ్నించారు. అయితే ఈ ప్రశ్నకు రజనీనుంచి సమాధానం రాలేదు. మరోవైపు రజనీ వ్యాఖ్యలతో తీవ్ర ఉద్రిక్తత చెలరేగడంతో ఆయన ప్రజలకు క్షమాపణ చెప్పారు. ఈ ఉదంతంపై మద్రాసు హైకోర్టు మాజీ న్యాయమూర్తి అరుణ జగదీశన్ నేతృత్వంలో ఏక సభ్య కమిషన్ ను ఏర్పాటు చేశారు.
గతంలో ఒకసారి రజనీకి సమన్లు పంపగా..ఆయన వ్యక్తిగత సహాయకుడు హాజరై.. రజనీ హాజరయ్యేందుకు మినహాయింపు కోరారు. ఇదిలా ఉంటే.. తాజాగా మరోసారి సమన్లు జారీ చేశారు. వచ్చే జనవరి 19న కమిషన్ ముందు హాజరు కావాలన్నారు. అయితే ఈ అంశంపై రజనీకాంత్ ఎలా స్పందిస్తారో వేచిచూడాలి.