Telugu Global
National

బలహీనపడుతున్న దీదీ దళం!

బెంగాల్ రాజకీయాలు కొత్త మలుపు తిరుగుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండడంతో అధికార తృణమూల్, బీజేపీ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. బెంగాల్ గడ్డపై కాషాయ జెండా ఎగరేయాలనుకుంటున్న బీజేపీ దూకుడును ప్రదర్శిస్తోంది. అధికార పార్టీని బలహీనపరిచే లక్ష్యంతో పావులు కదుపుతోంది. ఇప్పటికే పలువురు తృణమూల్ నేతలను తన గూటికి చేర్చుకుంది. వలసతో ఉక్కిరిబిక్కిరవుతున్న మమతా బెనర్జీకి తాజాగా మరో ఎదురు దెబ్బ తగిలింది. బెంగాల్ రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి లక్ష్మీరతన్ శుక్లా తన పదవికి రాజీనామా […]

బలహీనపడుతున్న దీదీ దళం!
X

బెంగాల్ రాజకీయాలు కొత్త మలుపు తిరుగుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండడంతో అధికార తృణమూల్, బీజేపీ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. బెంగాల్ గడ్డపై కాషాయ జెండా ఎగరేయాలనుకుంటున్న బీజేపీ దూకుడును ప్రదర్శిస్తోంది. అధికార పార్టీని బలహీనపరిచే లక్ష్యంతో పావులు కదుపుతోంది. ఇప్పటికే పలువురు తృణమూల్ నేతలను తన గూటికి చేర్చుకుంది. వలసతో ఉక్కిరిబిక్కిరవుతున్న మమతా బెనర్జీకి తాజాగా మరో ఎదురు దెబ్బ తగిలింది. బెంగాల్ రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి లక్ష్మీరతన్ శుక్లా తన పదవికి రాజీనామా చేశారు.

రాజకీయాల నుంచి తప్పుకోవాలనుకుంటున్నట్లు తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు శుక్లా. కాగా…ఆయన త్వరలోనే బీజేపీలో చేరుతారనే ప్రచారం జరుగుతోంది. శుక్లాతో పాటు సువేందు అధికారి తండ్రి ఎంపీ శిశిర్, సువేందు సోదరుడు దివ్యేందు కూడా త్వరలోనే బీజేపీలో చేరనున్నట్లు తెలుస్తోంది. వరుస దెబ్బలతో అధికార పార్టీ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.

అసెంబ్లీ ఎన్నికల నాటికి రాష్ట్రంలో బలమైన శక్తిగా ఎదగాలనుకుంటున్న బీజేపీ తృణమూల్ నేతలపై ఆపరేషన్ ఆకర్ష్ వ్యూహాన్ని ప్రయోగిస్తోంది. ఇప్పటికే తృణమూల్ తిరుగుబాటు నేత సువేందు అధికారితో పాటు ఎంపీ సునీల్ మండల్ సహా పదిమంది ఎమ్మెల్యేలు అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరారు. ఆ సందర్భంగా అసెంబ్లీ ఎన్నికల నాటికి టీఎంసీ పూర్తిగా ఖాళీ అవుతుందంటూ అమిత్ షా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. టీఎంసీలో మమత మాత్రమే మిగులుతుందంటూ జోస్యం చెప్పారు. ఆయన అన్నట్లే వరుసగా నేతలు ఒక్కక్కరూ టీఎంసీని వీడుతుండడం గమనార్హం.

గత ఎన్నికల్లో బీజేపీ పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. కానీ గడిచిన ఐదేళ్లలో పరిస్థితులు పూర్తిగా తారుమారయ్యాయి. బీజేపీ బలపడడంతో పాటు, అధికార పార్టీని బలహీన పర్చడంలోనూ సక్సెస్ అయ్యింది. ఇప్పుడు అధికార పార్టీతో ఢీ అంటే ఢీ అని తలపడుతోంది. వచ్చే ఎన్నికల్లో అధికారాన్ని చేజిక్కించుకోవడం కోసం తన సర్వశక్తులను ఒడ్డుతోంది. కాగా… మమతా బెనర్జీ సైతం బీజేపీని కట్టడి చేయడానికి వీలైనంత మేరకు ప్రయత్నిస్తూనే ఉంది.

బీజేపీ దూకుడుకు తోడు ఎంఐఎం రూపంలో అధికార పార్టీని మరో ప్రమాదం వెంటాడుతోంది. బీహార్ ఎన్నికల్లో 5 స్థానాలు గెలుచుకున్న ఎంఐఎం దృష్టి ఇప్పుడు బెంగాల్ పై పడింది. ముస్లిం ఓట్లు ఎక్కువగా ఉండే బెంగాల్ లోనూ తన సత్తాచాటాలనుకుంటోంది మజ్లిస్ పార్టీ. తాజాగా ప్రముఖ బెంగాల్ ముస్లిం నేత అబ్బాస్ సిద్దీఖీతో భేటీ అయిన ఓవైసీ మమతా బెనర్జీపై తీవ్ర విమర్శలు చేశారు. తృణమూల్ పట్ల ప్రజలు విసిగిపోయారని, ముస్లింలు మార్పు కోరుకుంటున్నారని వ్యాఖ్యానించారు. తృణమూల్ నేతలు సైతం ఓవైసీ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. మజ్లిస్ పార్టీ బీజేపీకి బీ టీం గా పనిచేస్తుంది నిజమని, బెంగాల్ ముస్లింలు టీఎంసీతోనే ఉన్నారని స్పష్టం చేశారు. మొత్తానికి బీజేపీ దూకుడుతో దీదీకి చిక్కులు తప్పేలా కనిపించడం లేదు.

First Published:  5 Jan 2021 11:51 PM GMT
Next Story