Telugu Global
NEWS

కిమ్ కాదు, డిక్టేటర్ కాదు.. నిమ్మగడ్డ అధికారి మాత్రమే..

ఎస్ఈసీ పదవిలో ఉన్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ తనని తాను ఓ డిక్టేటర్ లాగా భావిస్తున్నారని, ఉత్తర కొరియా అధ్యక్షుడ కిమ్ లాగా నియంతలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు వైసీపీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే అంబటి రాంబాబు. నిమ్మగడ్డ కేవలం ఓ అధికారి మాత్రమేనని గుర్తు చేశారు. సీనియర్ ఎమ్మెల్యే, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఇళ్లు దాటకుండా, ప్రెస్ మీట్ల పెట్టకుండా నిలువరించాలని చూడటం రాజ్యాంగ విరుద్ధం అని, అది మానవ హక్కుల ఉల్లంఘన, సభా హక్కుల ఉల్లంఘన […]

కిమ్ కాదు, డిక్టేటర్ కాదు.. నిమ్మగడ్డ అధికారి మాత్రమే..
X

ఎస్ఈసీ పదవిలో ఉన్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ తనని తాను ఓ డిక్టేటర్ లాగా భావిస్తున్నారని, ఉత్తర కొరియా అధ్యక్షుడ కిమ్ లాగా నియంతలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు వైసీపీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే అంబటి రాంబాబు. నిమ్మగడ్డ కేవలం ఓ అధికారి మాత్రమేనని గుర్తు చేశారు. సీనియర్ ఎమ్మెల్యే, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఇళ్లు దాటకుండా, ప్రెస్ మీట్ల పెట్టకుండా నిలువరించాలని చూడటం రాజ్యాంగ విరుద్ధం అని, అది మానవ హక్కుల ఉల్లంఘన, సభా హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని అన్నారాయన. చిత్తూరు జిల్లాలో చంద్రబాబుని జీరో చేయడం పెద్దిరెడ్డి వల్ల సాధ్యపడిందని, ఆయనకంటె పెద్ద శక్తిగా ఎదుగుతున్నందుకు ఓర్వలేక.. చంద్రబాబు కుట్రపూరితంగా నిమ్మగడ్డతో ఈ పని చేయించారని అన్నారు. పెద్దిరెడ్డిపై ఆంక్షలు విధించిన విషయంలో ఎస్ఈసీ ఆదేశాలు తనకింకా అందలేదని డీజీపీ చెప్పారని గుర్తు చేశారు అంబటి.

ప్రతిపక్షాలకోసమే నిమ్మగడ్డ..
అధికార పక్షానికి వ్యతిరేకంగా, ప్రతిపక్షాలకోసం, ముఖ్యంగా చంద్రబాబు కోసమే నిమ్మగడ్డ పనిచేస్తున్నట్టు అర్థమవుతోందని అన్నారు అంబటి రాంబాబు. ప్రభుత్వంతో ఘర్షణపడి ఎన్నికలు జరపాలని నిమ్మగడ్డ భావిస్తున్నారని, ఎన్నికల కమిషనర్ కు అతీతమైన శక్తులు వచ్చినట్టు ఆయన భావించడం తప్పు అని గుర్తు చేశారు. పంచాయతీ ఎన్నికలకు మేనిఫెస్టో విడుదల చేసిన చంద్రబాబుపై చర్యలు తీసుకోకపోవడం లాలూచీలో భాగమేనని అన్నారు. రాజ్యాంగ రక్షణ ఉన్నది కదా అని ఇతరుల హక్కుల్లో జొరబడి మానవహక్కుల్ని హరించటానికి ప్రయత్నం చేస్తే అది రాజ్యాంగం రక్షణ కాదు.. రాజ్యాంగ భక్షణ అవుతుందని అన్నారు అంబటి.

పనిచేస్తే అండ.. గీత దాడితే వేటు..
అధికారులు నీతిగా, నిజాయితీగా పనిచేసినంతకాలం తమ ప్రభుత్వం కడుపులో పెట్టుకుని చూసుకుంటుందని, సక్రమంగా అధికారులు విధులు నిర్వహించకపోతే వారి మీద తమ ప్రభుత్వం యాక్షన్ తీసుకుంటుందని, బ్లాక్‌ లిస్ట్‌లో పెడుతుందని మరోసారి గుర్తు చేశారు. అందులో ఎలాంటి అనుమానం లేదని స్పష్టం చేశారు అంబటి. తప్పు చేయనంతకాలం ఉద్యోగులు భయపడాల్సిన అవసరం లేదని, చట్టవ్యతిరేకంగా వ్యవహరిస్తే ఎస్ఈసీ సహా ఎవరికీ రక్షణ ఉండదని అన్నారు.
సెక్యూరిటీ సర్టిఫికేట్ లేకుండా ఈ- వాచ్ యాప్ విడుదల చేసిన నిమ్మగడ్డ రాజ్యాంగబద్ధంగా వ్యవహరించలేదని అన్నారు. ఏకగ్రీవాలను అడ్డుకోవడం కూడా రాజ్యాంగ వ్యతిరేకమేనని చెప్పారు అంబటి.

విశాఖ స్టీల్ పై..
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యవహారంలో కేంద్రం ఓ అడుగు ముందుకేస్తే.. అప్పుడు తమ సత్తా చూపిస్తామని అన్నారు అంబటి. ట్వీట్లు పెట్టే చంద్రబాబు కంటే.. ప్రజల పక్షాన వైసీపీనే ఎక్కువ బాధ్యతగా ఉంటుందని చెప్పారు. అన్నీ ఉన్న ఆకు అణిగిమణిగి ఉంటుందని, ఏమీ లేని ఆకులే ఎగిరెగిరి పడుతున్నాయని.. చంద్రబాబు, గంటా శ్రీనివాస్ పై సెటైర్లు వేశారు. ఉద్యమాలు, రాజీనామాలంటూ కొంతమంది డ్రామాలాడుతున్నారని విమర్శించారు.

First Published:  6 Feb 2021 8:20 PM GMT
Next Story