Telugu Global
NEWS

పదేళ్లు సీఎం నేనే.. తేడాగా మాట్లాడితే తోలు తీస్తా..

కేసీఆర్ పదవిలోనుంచి దిగిపోయి తన కొడుకు కేటీఆర్ ని ముఖ్యమంత్రిగా చేస్తారనే వార్తలు తెలంగాణలో బలంగా వినిపించాయి. రేపో మాపో ముహూర్తం పెడతారని, బల్లగుద్ది మరీ మాట్లాడారు రాజకీయ విశ్లేషకులు. చివరకు మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా కేటీఆర్ కి శుభాకాంక్షలు తెలపడంలో పోటీ పడ్డారు. కట్ చేస్తే.. సీన్ పూర్తిగా మారిపోయింది. తెలంగాణ సీఎంగా తానే మరో పదేళ్లు కొనసాగుతానని కొత్త ముఖ్యమంత్రి అనే మాటే లేదని కేసీఆర్ స్పష్టం చేశారు. అది మామూలుగా చెబితే పర్లేదు. […]

పదేళ్లు సీఎం నేనే.. తేడాగా మాట్లాడితే తోలు తీస్తా..
X

కేసీఆర్ పదవిలోనుంచి దిగిపోయి తన కొడుకు కేటీఆర్ ని ముఖ్యమంత్రిగా చేస్తారనే వార్తలు తెలంగాణలో బలంగా వినిపించాయి. రేపో మాపో ముహూర్తం పెడతారని, బల్లగుద్ది మరీ మాట్లాడారు రాజకీయ విశ్లేషకులు. చివరకు మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా కేటీఆర్ కి శుభాకాంక్షలు తెలపడంలో పోటీ పడ్డారు.
కట్ చేస్తే.. సీన్ పూర్తిగా మారిపోయింది. తెలంగాణ సీఎంగా తానే మరో పదేళ్లు కొనసాగుతానని కొత్త ముఖ్యమంత్రి అనే మాటే లేదని కేసీఆర్ స్పష్టం చేశారు. అది మామూలుగా చెబితే పర్లేదు. సొంత పార్టీ నేతలకే సీరియస్ వార్నింగ్ ఇచ్చిమరీ తమ మనసులో మాట బయటపెట్టారు కేసీఆర్.

” ముఖ్యమంత్రి మార్పు గురించి కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు అనవసరంగా మాట్లాడుతున్నారు. రోజుకొకరు లైన్‌లోకి వచ్చి సీఎం మారతారంటూ లూజ్‌ టాక్‌ చేస్తూ నాన్సెన్స్‌ ప్రకటనలు చేస్తున్నారు. ఈ రోజు తర్వాత మళ్లీ ముఖ్యమంత్రి మార్పుపై ఎవరైనా మాట్లాడితే బండకేసి కొడతా.. తోలు తీస్తా.. కర్రుకాల్చి వాత పెడతా. క్రమశిక్షణ ఉల్లంఘించే వారిని నేరుగా బయటికి పంపిస్తా.”

ఇదీ కేసీఆర్ భాష. ఈ రేంజ్ లో డోసు పడిన తర్వాత ఇంకెవరూ సీఎం మార్పుపై మాట్లాడరనుకోండి. అయితే మొదట్లో సీఎం మార్పు వార్తలు వచ్చినప్పుడు కేసీఆర్ ఎందుకు స్పందించలేదు? తనని ముందే మంత్రులు సైతం కాబోయే సీఎం అంటూ పొగడ్తల వర్షం కురిపిస్తుంటే కేటీఆర్ సైతం ఎందుకు మౌనం వహించారు? అంతా అయిపోతుందనుకున్న టైమ్ లో కేసీఆర్ సడన్ గా అడ్డం తిరగడం ఏంటి? పార్టీ నాయకులకైనా సున్నితంగా చెప్పాల్సిన అంశంపై ఇంత రాద్ధాంతం చేయడం దేనికి? ఇవన్నీ సమాధానం లేని ప్రశ్నలు.

పార్టీ, పాన్ డబ్బా ఒకటేనా..?
పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పాల్గొన్న కేసీఆర్ దాదాపుగా అన్ని విషయాల్లోనూ సీరియస్ గా స్పందించారు. బండకేసి బాదుతా, తోలు తీస్తా, వాత పెడతానంటూ సీఎం మార్పు వ్యవహారంలో రెచ్చిపోయారు. ఇక రసమయి బాలకిషన్ వంటివారు పార్టీని లిమిటెడ్ కంపెనీగా పోల్చడంపై కూడా కేసీఆర్ పరోక్షంగా మండిపడ్డారు. పార్టీని నడపడం పాన్‌ డబ్బా పెట్టినంత ఈజీ కాదని, ఆట పాటలతో పార్టీలు నడవలేవని అన్నారు. గతంలో జానారెడ్డి, విజయశాంతి, ఆలె నరేంద్ర, దేవేందర్‌ గౌడ్‌.. ఇలా తెలంగాణలో 12 పార్టీలు ఏర్పడ్డాయని, ఎవరూ నడపలేకపోయారని, అలాంటి పార్టీలతో వారు, వారితోపాటు పార్టీల్లోకి వచ్చినవారు ఎంతో నష్టపోయారని గుర్తు చేశారు. సొంత పార్టీలో నేతలు తోక జాడిస్తే.. వచ్చే ఎన్నికల్లో పక్కనపెట్టడానికి మొహమాట పడబోనని పరోక్షంగా అందరికీ ఓ వార్నింగ్ ఇచ్చేశారు కేసీఆర్. ఇక సోషల్ మీడియాలో జరిగే ప్రచారాలపై కూడా ఆయన మండిపడ్డారు. సోషల్‌ మీడియా పరిస్థితి దరిద్రంగా తయారైందని, వ్యతిరేక ప్రచారాన్ని తిప్పికొట్టేలా పార్టీ పరంగా సోషల్‌ మీడియా కమిటీలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. మొత్తమ్మీద 2గంటలసేపు సాగిన సుదీర్ఘ ప్రసంగంతో కేసీఆర్ ఈజ్ బ్యాక్ అనిపించారు.

First Published:  7 Feb 2021 9:02 PM GMT
Next Story