Telugu Global
NEWS

జగన్ ఫోకస్ ఏపీపైనే.. షర్మిలతో ఆయనకు విభేదాలు లేవు..

ఏపీ సీఎం జగన్, ఆయన చెల్లెలు షర్మిల మధ్య వ్యక్తిగత విభేదాలు లేవని క్లారిటీ ఇచ్చారు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. వైఎస్సార్ అభిమానులతో షర్మిల సమావేశం తదనంతర పరిణామాలపై ఆయన స్పందించారు. మూడు నెలలుగా తెలంగాణలో వైసీపీ విస్తరణ గురించి చర్చలు జరుగుతున్నాయని, అయితే జగన్మోహన్ రెడ్డి దానిని పూర్తిగా వ్యతిరేకించారని చెప్పారు. తెలంగాణలో వైసీపీని విస్తరిస్తే.. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య కొత్త సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని, రాష్ట్ర ప్రజలకు అది మంచిది […]

జగన్ ఫోకస్ ఏపీపైనే.. షర్మిలతో ఆయనకు విభేదాలు లేవు..
X

ఏపీ సీఎం జగన్, ఆయన చెల్లెలు షర్మిల మధ్య వ్యక్తిగత విభేదాలు లేవని క్లారిటీ ఇచ్చారు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. వైఎస్సార్ అభిమానులతో షర్మిల సమావేశం తదనంతర పరిణామాలపై ఆయన స్పందించారు. మూడు నెలలుగా తెలంగాణలో వైసీపీ విస్తరణ గురించి చర్చలు జరుగుతున్నాయని, అయితే జగన్మోహన్ రెడ్డి దానిని పూర్తిగా వ్యతిరేకించారని చెప్పారు. తెలంగాణలో వైసీపీని విస్తరిస్తే.. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య కొత్త సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని, రాష్ట్ర ప్రజలకు అది మంచిది కాదని, రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతింటాయని భావించిన జగన్ ఆ ప్రతిపాదనకు నో చెప్పారని అన్నారు. తెలంగాణ, ఏపీ మధ్య సమస్యలు వస్తే స్టేట్ టు స్టేట్, గవర్నమెంట్ టు గవర్నమెంట్ పరిష్కరించుకునే విధంగా ఉండాలనేది జగన్ ఆకాంక్ష అని స్పష్టం చేశారు సజ్జల. తెలంగాణలో వైసీపీని విస్తరిస్తే, ఆ అవకాశం ఉండదని జగన్ ముందు చూపుతో ఆలోచించారని, ఆయన ఫ్యూచరిస్టిక్ నాయకుడని చెప్పారు.

షర్మిల రాజకీయంపై..
తెలంగాణలో తాను సొంతంగా వేరే పార్టీని ఎందుకు పెట్టకూడదని షర్మిల భావించి ఉండొచ్చని చెప్పారు సజ్జల. వైయస్ఆర్ కుమార్తెగా ఆమె ఆలోచనలు, భిన్నంగా వేరే రకంగా ఉన్నాయని, తాజాగా జరిగిన సమావేశంలో ఆ ఆలోచనల్ని విస్తరించే విధంగా షర్మిల మాట్లాడారని చెప్పారు. అన్న, చెల్లెల్లయినా ఇద్దరి అభిప్రాయాలు వేర్వేరుగా ఉండొచ్చని, ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు నాలుగు పార్టీల్లో ఉన్న సందర్భాలు కూడా ఉన్నాయని గుర్తు చేశారు. భవిష్యత్తులో ఇద్దరి వ్యవహారాలు రెండు పార్టీలకు సంబంధించినవిగా ఉంటాయే కానీ, కుటుంబ వ్యవహారంలాగా ఉండదని క్లారిటీ ఇచ్చారు. రాజకీయ ఆలోచనల్లో భిన్నాభిప్రాయాలు ఉంటాయి కానీ వ్యక్తుల మధ్య విభేదాలు ఎందుకు ఉంటాయని ప్రశ్నించారు. తెలంగాణలో పార్టీని విస్తరించే అభిప్రాయంపై జగన్, షర్మిలకు భిన్నమైన, స్థిరమైన అభిప్రాయాలున్నాయని అన్నారు సజ్జల. తెలంగాణలో పార్టీ పెట్టే విషయంలో షర్మిలకి నచ్చజెప్పే ప్రయత్నం జరిగిందని చెప్పారు. వైయస్ఆర్ ఫ్యామిలీలో పదవుల కోసం గొడవలు వస్తాయనేది సిల్లీ క్వశ్చన్ అంటూ కొట్టి పారేశారు. జగన్ సతీమణి భారతికి కూడా రాజకీయపరమైన ఆకాంక్షలు ఉన్నాయంటూ అప్పుడే సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోందని, అవన్నీ అభూత కల్పనలు అని కొట్టిపారేశారు.

ఏ పార్టీతోనూ తెరవెనక సంబంధాలు పెట్టుకునే అగత్యం వైసీపీకి లేదని, జగన్ ఎప్పుడూ స్ట్రైట్ ఫ్రమ్ హార్ట్ ఆలోచిస్తారని అన్నారు. 2019 ఎన్నికల్లో దేశంలోనే నాల్గవ అతిపెద్ద పార్టీగా లోక్ సభ స్థానాలు గెలుచుకున్నామని, అలాగని జగన్ ఢిల్లీలో కూర్చోలేదని, రాష్ట్రం పట్ల ఆయనకు పూర్తి కమిట్ మెంట్ ఉందని చెప్పారు. తెలంగాణలో కూడా వైఎస్ రాజశేఖరరెడ్డిని అభిమానించే వాళ్ళు ఉన్నారని, వారికీ ఆకాంక్షలున్నాయని చెప్పారు.

పంచాయతీలో వైసీపీదే ఘన విజయం..
పంచాయతీ తొలిదశలో జరిగిన ఎన్నికల్లో ఘన విజయం తమదేనని ధీమా వ్యక్తం చేశారు సజ్జల రామకృష్ణారెడ్డి. గత 20 నెలలుగా సీఎం జగన్ సంక్షేమ పాలనకు ఈ ఫలితాలు ప్రతిబింబం అవుతాయని అన్నారు. ఈ ఎన్నికలకు కూడా వక్రభాష్యాలు చెప్పేందుకు, ప్రజలను గందరగోళపరిచేందుకు, ప్రతిపక్ష నేత చంద్రబాబు కుయుక్తులు పన్నుతున్నారని అన్నారు. ఆ కుయుక్తులలో ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రధాన పాత్రధారి అని విమర్శించారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న నిమ్మగడ్డ, పచ్చ చొక్కా వేసుకున్న టీడీపీ కార్యకర్తలా పనిచేస్తున్నాడని సజ్జల తప్పుబట్టారు. రాజ్యాంగం రాసిన పెద్దలు కూడా భవిష్యత్ లో ఇలాంటి వారు వస్తారని ఊహించి ఉండరని చెప్పారు. గతంలో సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ పై విమర్శలు వచ్చినప్పుడు.. అక్కడ మల్టీ మెంబర్స్ ను ఏర్పాటు చేశారని, రాష్ట్ర స్థాయిలో కూడా మల్టీ మెంబర్స్ ఉండాలని చెప్పారు. దీనిపై జాతీయ స్థాయిలో ఒక చర్చ జరగాలని అన్నారు సజ్జల.

First Published:  9 Feb 2021 7:17 AM GMT
Next Story