Telugu Global
NEWS

చంద్రబాబు పర్యటనకు ముందే పల్లా దీక్ష భగ్నం..

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపేందుకు రాష్ట్రంలోని రాజకీయ పార్టీలన్నీ సొంత ఉద్యమాల్ని మొదలు పెట్టాయి. స్టీల్ ప్లాంట్ కార్మికులు చేస్తున్న ఆందోళన వీటికి అదనం. ఈ దశలో.. కేంద్రాన్ని పల్లెత్తు మాట అనకుండా.. పదే పదే వైసీపీని టార్గెట్ చేస్తూ చంద్రబాబు సరికొత్త రాజకీయానికి తెరతీశారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వైసీపీ ప్రభుత్వమే కారణం అంటూ విమర్శిస్తున్నారు, అదే సమయంలో తమ పార్టీ తరపున మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావుతో దీక్ష మొదలు పెట్టించారు. ఏపీ టీడీపీ […]

చంద్రబాబు పర్యటనకు ముందే పల్లా దీక్ష భగ్నం..
X

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపేందుకు రాష్ట్రంలోని రాజకీయ పార్టీలన్నీ సొంత ఉద్యమాల్ని మొదలు పెట్టాయి. స్టీల్ ప్లాంట్ కార్మికులు చేస్తున్న ఆందోళన వీటికి అదనం. ఈ దశలో.. కేంద్రాన్ని పల్లెత్తు మాట అనకుండా.. పదే పదే వైసీపీని టార్గెట్ చేస్తూ చంద్రబాబు సరికొత్త రాజకీయానికి తెరతీశారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వైసీపీ ప్రభుత్వమే కారణం అంటూ విమర్శిస్తున్నారు, అదే సమయంలో తమ పార్టీ తరపున మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావుతో దీక్ష మొదలు పెట్టించారు. ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆల్రడీ దీక్షా శిబిరాన్ని సందర్శించి మద్దతు తెలిపారు. నారా లోకేష్ కూడా దీక్షా శిబిరం నుంచి భారీ డైలాగులు పేల్చారు. పూర్తిగా సీఎం జగన్ ని టార్గెట్ చేశారు. ఇక మిగిలింది చంద్రబాబు మాత్రమే. అన్నీ అనుకున్నట్టు జరిగితే.. ఈ మధ్యాహ్నం చంద్రబాబు విశాఖ వచ్చి పల్లా శ్రీనివాసరావు దీక్షా శిబిరాన్ని సందర్శించాల్సి ఉంది. విశాఖ ఉక్కుకోసం రాష్ట్రవ్యాప్తంగా మొదలు పెడతామంటున్న ఉద్యమ కార్యాచరణ కూడా అక్కడినుంచే ప్రకటిస్తారని అనుకున్నారు. కానీ సరిగ్గా బాబు పర్యటనకు ముందే టీడీపీ శిబిరం ఖాళీ అయింది. పల్లా శ్రీనివాసరావుని బలవంతంగా అక్కడినుంచి ఆస్పత్రికి తరలించారు పోలీసులు.

ఆందోళనలకు సిద్ధమైన టీడీపీ శ్రేణులు..
సమస్యలు పరిష్కారం అయినా, కాకపోయినా, అవుతాయనే ఉద్దేశం ఉన్నా లేకపోయినా.. నిర్ణీత సమయం తర్వాత ఆమరణ దీక్షల్ని భగ్నం చేయడం పోలీసులకు రివాజు. ఈనెల 10వతేదీన దీక్ష చేపట్టిన పల్లా శ్రీనివాసరావు ఆరోగ్యం విషమిస్తుందనే వార్తలు వస్తున్న నేపథ్యంలో పోలీసులు ఆయన్ను బలవంతంగా కృషి ఐకాన్ ఆస్పత్రికి తరలించారు. ఆరు రోజులుగా దీక్ష చేస్తూ నీరసించిన పల్లాకు వైద్యం అందిస్తున్నారు. అయితే సరిగ్గా చంద్రబాబు పర్యటనకు ముందుగానే ఈ పరిణామం జరగడంతో టీడీపీ శ్రేణులు దీన్ని ఓ కుట్రగా అభివర్ణిస్తున్నాయి. చంద్రబాబు వస్తే, ఉద్యమం మరింత పెరిగి పెద్దదవుతుందని, అది ఇష్టంలేకే జగన్ టీడీపీ దీక్షను భగ్నం చేయించారని మండిపడుతున్నారు ఆ పార్టీ నాయకులు.

పల్లా దీక్షా శిబిరాన్ని సందర్శించేందుకు చంద్రబాబు విశాఖ పర్యటన ఖరారు కాగా.. ఇప్పుడు దీక్ష ఆగిపోవడంతో.. ఆయన్ను ఆస్పత్రిలోనే పరామర్శించే అవకాశం ఉంది. అయితే చంద్రబాబు ఆస్పత్రికి వస్తే శాంతి భద్రతల సమస్యలు తలెత్తే అవకాశం ఉందని, పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మొత్తమ్మీద చంద్రబాబు విశాఖ పర్యటన వివాదాలకు తావిస్తుందో, పరామర్శ పర్వంతో సజావుగా సాగుతుందో.. వేచి చూడాలి.

First Published:  15 Feb 2021 9:33 PM GMT
Next Story