Telugu Global
NEWS

విజయసాయి పాదయాత్ర.. వెనక స్కెచ్​ ఏమిటి?

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్​లో ఆందోళనలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. విశాఖ స్టీల్ ప్లాంట్​ కార్మికసంఘాలు ఈ ఉద్యమాన్ని ప్రారంభించాయి. సహజంగానే వామపక్షాలు ఈ ఆందోళనకు మద్దతు ప్రకటించాయి. ఇక వెంటనే ప్రధాన రాజకీయాపార్టీలు టీడీపీ, వైసీపీ కూడా రంగంలోకి దిగాయి. ఉద్యమం మాట పక్కకు పెట్టి.. టీడీపీ, వైసీపీ పరస్పరం ఆరోపణలు గుప్పించుకుంటున్నాయి. ఇక బీజేపీ, జనసేన మాత్రం ప్రేక్షకపాత్రకే పరిమితమయ్యాయి. బీజేపీ, జనసేన ఢిల్లీకి వెళ్లి కేంద్ర పెద్దలతో ఈ విషయం చెప్పినట్టు […]

విజయసాయి పాదయాత్ర.. వెనక స్కెచ్​ ఏమిటి?
X

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్​లో ఆందోళనలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. విశాఖ స్టీల్ ప్లాంట్​ కార్మికసంఘాలు ఈ ఉద్యమాన్ని ప్రారంభించాయి. సహజంగానే వామపక్షాలు ఈ ఆందోళనకు మద్దతు ప్రకటించాయి. ఇక వెంటనే ప్రధాన రాజకీయాపార్టీలు టీడీపీ, వైసీపీ కూడా రంగంలోకి దిగాయి. ఉద్యమం మాట పక్కకు పెట్టి.. టీడీపీ, వైసీపీ పరస్పరం ఆరోపణలు గుప్పించుకుంటున్నాయి. ఇక బీజేపీ, జనసేన మాత్రం ప్రేక్షకపాత్రకే పరిమితమయ్యాయి.

బీజేపీ, జనసేన ఢిల్లీకి వెళ్లి కేంద్ర పెద్దలతో ఈ విషయం చెప్పినట్టు మీడియా కవరేజ్​ ఇచ్చుకున్నాయి.. అది వేరే విషయం. అయితే తెలుగుదేశం పార్టీ మాత్రం ప్రైవేటీకరణ నిర్ణయం తీసుకున్న బీజేపీని పల్లెత్తు మాట అనకుండా అధికార వైసీపీని, సీఎం జగన్​ను దోషిని చేసే ప్రయత్నం చేస్తున్నాయి. ఇందుకు టీడీపీ అనుకూల మీడియాలో సైతం కథనాలు వస్తున్నాయి. ఇటీవల చంద్రబాబు కూడా విశాఖ వెళ్లి.. విశాఖ ప్రైవేటీకరణ అంశాన్ని పక్కకు పెట్టి.. జగన్​మోహన్​రెడ్డి అరాచకాలు చేస్తున్నాడని.. రాజారెడ్డి రాజ్యాంగం నడుపుతున్నాడని మాట్లాడారు.

దీంతో అధికార పక్షం కూడా ప్రతిగా టీడీపీ అధినేత చంద్రబాబుపై ఆరోపణలు చేసింది. అసలు దేశంలో ప్రైవేటీకరణకు చంద్రబాబే ఆద్యుడని వాళ్లు ఆరోపించారు. ఈ గందరగోళం ఇలా కొనసాగుతుండగానే.. ‘విశాఖ’ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పాదయాత్ర చేయబోతున్నట్టు విజయసాయిరెడ్డి ప్రకటించారు. ఇవాళ పాదయాత్రను ప్రారంభించారు. కార్మికసంఘాలు, వివిధ పార్టీల నేతలు కూడా ఈ పాదయాత్రలో పాల్గొన్నారు.

అయితే విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు రాష్ట్రప్రభుత్వానికి ఏ సంబంధం లేదు ప్రజలకు వివరించడానికి విజయసాయిరెడ్డి ఈ పాదయాత్రను మొదలుపెట్టినట్టు సమాచారం. త్వరలో విశాఖపట్టణంలో మున్సిపల్​ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో తమ పార్టీకి ఎటువంటి నష్టం కలుగకుండా ఆయన పాదయాత్ర చేస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వం మూడు రాజధానులను ప్రకటించడంతో విశాఖ ప్రజలు ప్రభుత్వంపట్ల సానుకూలంగా ఉన్నారు.

అయితే విశాఖ స్టీల్​ ప్లాంట్​ ప్రైవేటీకరణ అంశంలో రాష్ట్రప్రభుత్వాన్ని బలి పశువును చేయాలని టీడీపీ చూస్తున్నది. దీంతో అధికార పక్షం కౌంటర్​ అటాక్​కు సిద్ధపడింది. ఈ పాదయాత్ర ద్వారా విశాఖ ప్రైవేటీకరణ అంశంలో రాష్ట్రప్రభుత్వానికి ఏ అధికారం లేదని.. అది కేంద్రపరిధిలోని అంశమని విజయ్​సాయిరెడ్డి ప్రజలకు వివరిస్తున్నారు. అయితే కేంద్ర నిర్ణయానికి వ్యతిరేకంగా వైసీపీ పోరాటాలకు కూడా సిద్ధమని కూడా ఆయన సంకేతాలు పంపుతున్నారు. అవసరమైతే టీడీపీతో కూడా కలిసి పోరాటం చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని ఆయన ప్రకటించారు. ఈ పాదయాత్రలో నగరి ఎమ్మెల్యే రోజా కూడా పాల్గొన్నారు.

First Published:  20 Feb 2021 8:32 AM GMT
Next Story