Telugu Global
NEWS

అచ్చం జగన్​లాగే.. ఎయిర్​పోర్టులో నేలపై కూర్చొని చంద్రబాబు దీక్ష..!

ఓడలు బండ్లవుతాయి.. బండ్లు ఓడలవుతాయి.. ప్రజాస్వామ్య దేశంలో అధికార మార్పిడి తథ్యం.. విపక్షంలో ఉన్నవాళ్లు గద్దె నెక్కుతారు.. గద్దె మీద ఉన్న వాళ్లు విపక్షానికి వెళతారు. ఎవరిని ఎక్కడ కూర్చోబెట్టాలి అనేది ప్రజల నిర్ణయం. గతంలో ఓ సారి ప్రతి పక్షనేతగా ఉన్న జగన్​ మోహన్​రెడ్డి.. విశాఖ పట్టణం బయలుదేరారు. ప్రత్యేకహోదాకు మద్దతుగా అక్కడ ఆందోళన చేయాలని భావించారు. ఇందుకోసం విశాఖకు వెళ్లారు. అయితే జగన్​ నిరసనలో పాల్గొనకుండా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆయన నేలమీద కూర్చొని […]

అచ్చం జగన్​లాగే.. ఎయిర్​పోర్టులో నేలపై కూర్చొని చంద్రబాబు దీక్ష..!
X

ఓడలు బండ్లవుతాయి.. బండ్లు ఓడలవుతాయి.. ప్రజాస్వామ్య దేశంలో అధికార మార్పిడి తథ్యం.. విపక్షంలో ఉన్నవాళ్లు గద్దె నెక్కుతారు.. గద్దె మీద ఉన్న వాళ్లు విపక్షానికి వెళతారు. ఎవరిని ఎక్కడ కూర్చోబెట్టాలి అనేది ప్రజల నిర్ణయం.

గతంలో ఓ సారి ప్రతి పక్షనేతగా ఉన్న జగన్​ మోహన్​రెడ్డి.. విశాఖ పట్టణం బయలుదేరారు. ప్రత్యేకహోదాకు మద్దతుగా అక్కడ ఆందోళన చేయాలని భావించారు. ఇందుకోసం విశాఖకు వెళ్లారు. అయితే జగన్​ నిరసనలో పాల్గొనకుండా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆయన నేలమీద కూర్చొని నిరసన వ్యక్తం చేశారు. అప్పట్లో ఈ ఘటన సంచలనంగా మారింది. అప్పుడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉన్నారు. కట్​చేస్తే.. జగన్​ ముఖ్యమంత్రి అయ్యారు.

ఇప్పుడు చంద్రబాబునాయుడు చిత్తూరు జిల్లాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల నిర్వహించిన పంచాయతీ ఎన్నికల్లో చంద్రబాబునాయుడు సొంత నియోజకవర్గంలోనే ఘోరంగా ఓడిపోయారు. దీంతో ఎక్కడో తేడా కొట్టిందని భావించి వెంటనే కుప్పం పయనమయ్యారు. అక్కడ రెండ్రోజులు పర్యటించి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.

అనంతరం ఈ ప్రభుత్వం ఎన్నికల్లో అక్రమాలు చేసిందని ఆరోపించారు. ఇందుకు నిరసనగా చిత్తూరు జిల్లా కేంద్రంలో సోమవారం ఆందోళన చేయబోతున్నట్టు ప్రకటించారు. దీంతో చంద్రబాబు సోమవారం హైదరాబాద్​ నుంచి రేణిగుంటకు విమానంలో వెళ్లారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో చిత్తూరుకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. కానీ రేణిగుంట విమానాశ్రయంలో పోలీసులు చంద్రబాబును అడ్డుకున్నారు. నిరసనకు అనుమతి లేదని చెప్పారు.

ఇప్పటికే చిత్తూరులోని పలువురు టీడీపీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే పోలీసుల తీరుకు నిరసనగా చంద్రబాబు ఎయిర్​పోర్ట్​లోనే బైఠాయించి నిరసన తెలిపారు. పలమనేరులో మాజీ మంత్రి ఎన్.అమర్నాథరెడ్డి, చిత్తూరులో ఎమ్మెల్సీ దొరబాబు, చిత్తూరు టీడీపీ పార్లమెంట్ అధ్యక్షుడు పులివర్తి నానితో పాటు జిల్లా వ్యాప్తంగా ఉన్న మాజీ ఎమ్మెల్యేలను అక్కడికక్కడే అరెస్టు చేశారు.

చిత్తూరులో చంద్రబాబు నాయుడు ధర్నా కార్యక్రమానికి అనుమతి లేనందున ఎవరినీ అంగీకరించబోమని జిల్లా ఎస్పీ సెంథిల్ కుమార్ చెప్పారు.ధర్నాకు అనుమతి లేనందున తిరిగి హైదరాబాద్​కు వెళ్లాలని పోలీసులు చంద్రబాబుకు సూచించారు. ఆయన మాత్రం ఇంకా ఎయిర్​పోర్టులోనే ఉన్నారు.

First Published:  1 March 2021 2:07 AM GMT
Next Story