Telugu Global
NEWS

71 లక్షల మెట్రిక్ టన్నుల లైమ్‌స్టోన్ అక్రమ మైనింగ్.. సీబీఐ ఎఫ్ఐఆర్‌లో టీడీపీ మాజీ ఎమ్మెల్యే

అనుమతులు లేకుండా గనుల నుంచి ఖనిజాలు తవ్వడం.. కోట్లాది రూపాయల అక్రమ సొమ్ము వెనుకేసుకోవడం చూస్తూనే ఉన్నాము. అలాంటి భారీ స్కామ్ ఒకటి ఏపీలో బయటపడింది. గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలో దాదాపు 70 నుంచి 90 లక్షల మెట్రిక్ టన్నుల లైమ్ స్టోన్, మొసాయిక్ చిప్స్‌ను అక్రమంగా తవ్వి అమ్మేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. గత 20 ఏళ్లుగా ఈ అక్రమ మైనింగ్ కొనసాగుతున్నట్లు తెలుస్తున్నది. ఆంధ్రప్రదేశ్ గనుల శాఖ 2018లో ఏపీ హైకోర్టుకు సమర్పించిన […]

71 లక్షల మెట్రిక్ టన్నుల లైమ్‌స్టోన్ అక్రమ మైనింగ్.. సీబీఐ ఎఫ్ఐఆర్‌లో టీడీపీ మాజీ ఎమ్మెల్యే
X

అనుమతులు లేకుండా గనుల నుంచి ఖనిజాలు తవ్వడం.. కోట్లాది రూపాయల అక్రమ సొమ్ము వెనుకేసుకోవడం చూస్తూనే ఉన్నాము. అలాంటి భారీ స్కామ్ ఒకటి ఏపీలో బయటపడింది. గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలో దాదాపు 70 నుంచి 90 లక్షల మెట్రిక్ టన్నుల లైమ్ స్టోన్, మొసాయిక్ చిప్స్‌ను అక్రమంగా తవ్వి అమ్మేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. గత 20 ఏళ్లుగా ఈ అక్రమ మైనింగ్ కొనసాగుతున్నట్లు తెలుస్తున్నది.

ఆంధ్రప్రదేశ్ గనుల శాఖ 2018లో ఏపీ హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో రూ. 130 కోట్లు విలువ చేసే 31 లక్షల మెట్రిక్ టన్నుల లైమ్ స్టోన్‌ను పిడుగురాళ్ల, దాచేపల్లి ప్రాంతాల నుంచి తవ్వినట్లు పేర్కొన్నది. అయితే సీబీఐ మాత్రం తమ దర్యాప్తులో గనుల శాఖ చెప్పిన దానికంటే రెట్టింపు లేదా అంతకంటే ఎక్కువ తరలించుకొని పోయినట్లు తెలిపింది. ఓబులాపురం గనుల నుంచి అక్రమంగా ఐరన్ ఓర్ తరలించిన గాలి జనార్థన రెడ్డి చేసిన స్కాం లాంటిదేనని చెబుతున్నది.

ఒక జాతీయ ఆంగ్ల పత్రిక రాసిన కథనం మేరకు.. పల్నాడులోని పలు మండలాల్లో తవ్వకాలు జరిపి అక్రమంగా లైమ్‌స్టోన్ తరలించినట్లు శాటిలైట్ చిత్రాల్లో కనుగొన్నట్లు తెలుస్తున్నది. 2014 నుంచి 2019 మధ్యలో పిడుగురాళ్ల, దాచేపల్లి మండలాలకు చెందిన పట్టా భూములు, రెవెన్యూ భూములు, లీజ్ క్వారీల నుంచి భారీ ఎత్తున లైమ్‌స్టోన్ తవ్వకాలు జరిపినట్లు సీబీఐ పేర్కొన్నది. అప్పటి టీడీపీ గురజాల ఎమ్మెల్యే యరపతనేతి శ్రీనివాసరావు అనుచరులే ఈ అక్రమ మైనింగ్‌కు పాల్పడినట్లు సీబీఐ గుర్తించింది. అంతే కాకుండా సీబీఐ యరపతనేని శ్రీనివాసరావు పేరును ఎఫ్ఐఆర్‌లో చేర్చింది.

శాటిలైట్ చిత్రాల ద్వారా కోట్లాది రూపాయల విలువైన లైమ్‌స్టోన్ మాయమైనట్లు గుర్తించి.. గత ఏడాది నవంబర్‌లో శ్రీనివాసరావు, అతని అనుచరుల ఇండ్లు, కార్యాలయాల్లో సీబీఐ సోదాలు నిర్వహించింది. 2018 అగస్టు 18న హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో మైన్స్ అండ్ జియాలజీ కార్యదర్శి పలు విషయాలు వివరించారు. 31 లక్షల టన్నుల లైమ్ స్టోన్, మొసాయిక్ చిప్స్ తవ్వకాలు జరిగాయి. దాని విలువ రూ. 130 కోట్ల రూపాయలు. అయితే దీనికి సంబంధించి రుసుము, అమ్మకపు ధర, జరిమానాను అక్రమ మైనింగ్ చేసిన వారి దగ్గర నుంచి వసూలు చేశామని.. అనంతరం వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు పేర్కొన్నారు.

అయితే 2014లో తొలి సారిగా అక్రమ మైనింగ్‌పై పిల్ వేసిన కే. గురవాచారి మాత్రం మైనింగ్ శాఖ ఇచ్చిన అఫిడవిట్ తప్పని చెప్పారు. 70 లక్షల మెట్రిక్ టన్నుల కంటే ఎక్కువ లైమ్‌స్టోన్‌ను అక్రమంగా తవ్వారని ఆయన ఆరోపించారు. వైసీపీ మాజీ ఎమ్మెల్సీ టీజీవీ కృష్ణారెడ్డి కూడా శ్రీనివాసరావు, ఆయన అనుచరులపై ఈ అక్రమ మైనింగ్‌కు సంబంధించి పిర్యాదు చేశారు. హైకోర్టు ఎంత మొత్తంలో తవ్వకాలు జరిపారో విచారించి వారి వద్ద నుంచి డబ్బు వసూలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. కానీ దీనిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని కృష్ణారెడ్డి చెబుతున్నారు.

దీంతో 2016లో శాటిలైట్ చిత్రాలు, 3డీ టెక్నాలజీతో తీసిన చిత్రాల ఆధారాలతో మరోసారి 2016లో పిర్యాదు చేశానని.. 2018లో హైకోర్టు మరోసారి చర్యలకు ఆదేశాలు జారీ చేసిందని కృష్ణారెడ్డి చెప్పారు. కానీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. సీబీఐ ఎఫ్ఐఆర్‌లో సహ నిందితుడిగా ఉన్న టీఎన్ శర్మ కూడా స్పందించారు. ఈ అక్రమ మైనింగ్‌లో తనను అనసవరంగా ఇరికించారని అన్నారు. తన పట్టా ల్యాండ్‌ను శ్రీనివాసరావు అక్రమంగా కబ్జా చేసి అక్కడ అక్రమ మైనింగ్ చేస్తున్నారని.. దీనిపై నేను పిర్యాదు చేస్తే చివరకు తననే నిందితుడిగా కేసు నమోదు చేశారని ఆయన వాపోయారు.

కాగా, శ్రీనివాసరెడ్డి స్పందిస్తూ.. టీడీపీ ప్రభుత్వం సీఐడీ దర్యాప్తు జరిపించిందని తెలిపారు. శర్మనే గత 20 ఏళ్లుగా అక్రమ మైనింగ్ చేస్తున్నట్లు తెలిసిందని ఆయన చెప్పారు.

First Published:  4 March 2021 7:02 AM GMT
Next Story