Telugu Global
NEWS

తెలంగాణపై తీవ్ర ప్రభావం చూపుతున్న ఏపీ కర్ఫ్యూ..

తెలంగాణలో వీకెండ్ కర్ఫ్యూ అమలు చేయాలని, లేదా కర్ఫ్యూ వేళలు పొడిగించాలంటూ హైకోర్టు ప్రభుత్వానికి సూచించిన వేళ, అలాంటి అవసరమేమీ లేదని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ప్రకటించారు. అయితే తెలంగాణలో కర్ఫ్యూ వేళలు పొడిగించకపోయినా, నిబంధనలు కఠినతరం చేయాల్సిన అవసరం లేకపోయినా.. అక్కడ అప్రకటిత కర్ఫ్యూ అమలులోకి వచ్చేసింది. ఆంధ్ర ప్రదేశ్ వ్యాప్తంగా రోజూ 18గంటల పాటు అమలవుతున్న కర్ఫ్యూ తెలంగాణపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. వారం క్రితమే మహారాష్ట్ర, కర్నాటకకు తెలంగాణ ఆర్టీసీ […]

తెలంగాణపై తీవ్ర ప్రభావం చూపుతున్న ఏపీ కర్ఫ్యూ..
X

తెలంగాణలో వీకెండ్ కర్ఫ్యూ అమలు చేయాలని, లేదా కర్ఫ్యూ వేళలు పొడిగించాలంటూ హైకోర్టు ప్రభుత్వానికి సూచించిన వేళ, అలాంటి అవసరమేమీ లేదని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ప్రకటించారు. అయితే తెలంగాణలో కర్ఫ్యూ వేళలు పొడిగించకపోయినా, నిబంధనలు కఠినతరం చేయాల్సిన అవసరం లేకపోయినా.. అక్కడ అప్రకటిత కర్ఫ్యూ అమలులోకి వచ్చేసింది. ఆంధ్ర ప్రదేశ్ వ్యాప్తంగా రోజూ 18గంటల పాటు అమలవుతున్న కర్ఫ్యూ తెలంగాణపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. వారం క్రితమే మహారాష్ట్ర, కర్నాటకకు తెలంగాణ ఆర్టీసీ బస్సుల్ని నిలిపివేసింది. ఇప్పుడు ఏపీకి కూడా బస్సులు ఆగిపోవడంతో తెలంగాణ రోడ్లపై వాహనాల రద్దీ తగ్గిపోయింది. ఎంజీబీఎస్ లో ఏపీ టెర్మినల్స్ అన్నీ ఖాళీగా కనిపించాయి.

అంతర్ రాష్ట్ర సర్వీసులే కీలకం..
ఏపీలో పగటి కర్ఫ్యూ తొలిరోజు విజయవంతంగా అమలైంది. 12గంటల వరకే ప్రజా రవాణా అందుబాటులో ఉంది, ఆ తర్వాత బైక్ లు, కార్లు.. ఇతర వ్యక్తిగత వాహనాలను కూడా రోడ్లపైకి అనుమతించలేదు. ఆర్టీసీ ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఉదయం 11 గంటలనుంచే సర్వీసులను నిలిపివేసింది. ముఖ్యంగా అంతర్ రాష్ట్ర సర్వీసులపై ఈ ప్రభావం బాగా కనపడింది. దాదాపుగా ఏపీనుంచి తెలంగాణకు వెళ్లే సర్వీసులన్నీ ఆగిపోయాయి, ప్రైవేటు బస్సులు కూడా ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. తెలంగాణ సరిహద్దు డిపోలనుంచి కూడా నామమాత్రంగానే బస్సులు వెళ్లాయి. అటు టీఎస్ఆర్టీసీ కూడా సర్వీసుల్ని పూర్తిగా తగ్గించేసింది.

కృష్ణా జిల్లా గరికపాడు చెక్‌ పోస్టు వద్ద తెలంగాణ నుంచి ఏపీలోకి వచ్చే వాహనాలను మధ్యాహ్నం 12 గంటల వరకే అనుమతించారు పోలీసులు. ఆ తర్వాత నుంచి అత్యవసర, సరకు రవాణా వాహనాలను మాత్రమే అనుమతించారు. వైద్యం, ఇతర అత్యవసర పనులపై వస్తున్న వారు సంబంధిత పత్రాలు, ఆధారాలు చూపిస్తేనే సరిహద్దు దాటేందుకు అనుమతి ఇచ్చారు. మిగతా వారిని వెనక్కి పంపేశారు. లారీలను రామాపురం క్రాస్‌ రోడ్డు వద్ద నిలిపేశారు. నార్కట్‌ పల్లి-అద్దంకి రహదారిపై వాడపల్లి చెక్‌ పోస్టుతో పాటు నాగార్జున సాగర్‌ లోని ఏపీ, తెలంగాణ సరిహద్దులోనూ ప్రత్యేక చెక్‌ పోస్టు పెట్టి వాహనాలు వెళ్లకుండా నియంత్రించారు. ఏపీలో కర్ఫ్యూ కట్టుదిట్టంగా అమలు కావడంతో.. తెలంగాణపై తీవ్ర ప్రభావం కనిపించింది.

First Published:  5 May 2021 10:29 PM GMT
Next Story