Telugu Global
NEWS

మేమూ రెడీ ! మోడీ టూర్లపై ఆర్టీఐ దరఖాస్తుల వెల్లువ

తెలంగాణ సీఎం కెసిఆర్ వేతనం, వివిధ రాష్ట్రాలకు ఆయన చేసిన పర్యటనలు తదితరాల సమాచారం కావాలంటూ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ 100 ఆర్టీఐ దరఖాస్తులు దాఖలు చేస్తే మేమూ తక్కువ తినలేదని టీఆరెస్ కూడా టిట్ ఫర్ టాట్ అంటోంది. ఈ పార్టీల మధ్య ఆర్టీఐ వార్ మొదలయింది. ప్రధాని మోడీ విదేశాలకు, ఇతర రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు అయిన ఖర్చులు, ఇతర సమాచారం ఇవ్వాలని కోరుతూ టీఆరెస్ సైతం 100 ఆర్టీఐ దరఖాస్తులు దాఖలు […]

Jeevan Reddy
X

తెలంగాణ సీఎం కెసిఆర్ వేతనం, వివిధ రాష్ట్రాలకు ఆయన చేసిన పర్యటనలు తదితరాల సమాచారం కావాలంటూ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ 100 ఆర్టీఐ దరఖాస్తులు దాఖలు చేస్తే మేమూ తక్కువ తినలేదని టీఆరెస్ కూడా టిట్ ఫర్ టాట్ అంటోంది.

ఈ పార్టీల మధ్య ఆర్టీఐ వార్ మొదలయింది. ప్రధాని మోడీ విదేశాలకు, ఇతర రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు అయిన ఖర్చులు, ఇతర సమాచారం ఇవ్వాలని కోరుతూ టీఆరెస్ సైతం 100 ఆర్టీఐ దరఖాస్తులు దాఖలు చేసింది.

కేంద్ర ప్రభుత్వ శాఖలు, ఫైనాన్స్, హోం, విదేశాంగ వ్యవహారాలు, ఇతర శాఖలకు సంబంధించిన వివరాలను ప్రధానమంత్రి కార్యాలయం నుంచి తెలుసుకోగోరుతున్నామంటూ ఈ దరఖాస్తుల్లో పేర్కొన్నారు. ఇదే విషయాన్ని టీఆరెస్ ఎమ్మెల్యే ఏ. జీవన్ రెడ్డి తెలియజేస్తూ.. రష్యా-ఉక్రెయిన్ యుద్దాన్ని మోడీ ఎలా ఆపారో తమకు స్పష్టం చేయాలని కోరారు.

ఆర్టీఐ చట్టాల కింద ఇంకా మేము చాలా సమాచారాన్ని అందజేయాలని కోరుతున్నాం.. ప్రధాని మోడీ డ్రెస్సులకు అయిన, అవుతున్న ఖర్చులు, ఒకప్పుడు లాహోర్ కి నాటి పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ ని కలుసుకునేందుకు ఎందుకు వెళ్లారన్న అంశాన్ని మేం తెలుసుకోవాలనుకుంటున్నాం అని ఆయన చెప్పారు.

2014 జూన్ 2 నుంచి టీఆరెస్ ప్రజలకు ఇచ్చిన హామీల గురించి వివరాలను బీజేపీ కోరిందని, కానీ మా పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అన్ని హామీలు నెరవేర్చామని అన్నారు. 2014 లో ఏపీ విభజన చట్టం లో చేసిన వాగ్దానాల పరిస్థితి ఎంతవరకు వచ్చింది.. ఇంకా జీఎస్టీ బకాయిలు, పసుపు బోర్డు వ్యవహారం, గత 8 ఏళ్ళలో కేంద్రం తెచ్చిన అప్పులు, జన్ ధన్ ఖాతాల్లో 15 లక్షల చొప్పున డిపాజిట్ చేస్తామన్న హామీలు.. ఇవన్నీ ఏమయ్యాయి.. ఈ సమాచారమంతా మాకు ఈ చట్టం కింద తెలియజేయాల్సిందే అని జీవన్ రెడ్డి అన్నారు.

సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో బీజేపీ బహిరంగ సభకు ఎలా అనుమతినిచ్చారని ఆయన ప్రశ్నించారు. పాతబస్తీ చార్మినార్ వద్ద గల భాగ్యలక్ష్మి ఆలయాన్ని అనేకమంది బీజేపీ నేతలు విజిట్ చేస్తున్నారని, అయితే ఈ ఆలయ అభివృద్ధికి కేంద్రం లేదా బీజేపీ పాలిత రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి సాయం అందజేస్తున్నాయో సమాచార హక్కు చట్టం కింద దాఖలు చేసిన దరఖాస్తుల్లో కోరామని ఆయన చెప్పారు.

ఈ ప్రశ్నలకు బీజేపీ స్పందించని పక్షంలో ఆ పార్టీ నాయకులను వదిలిపెట్టేది లేదని, టీఆరెస్ కోర్టులకు ఎక్కుతుందని ఆయన హెచ్చరించారు. మోడీ, బండి సంజయ్ ఇద్దరూ తమ ఎడ్యుకేషన్ సర్టిఫికెట్లను ప్రజలకు చూపాలని ఆయన డిమాండ్ చేశారు.

ఏడాదికి కోటి ఉద్యోగాలు ఇస్తామన్న హామీని బీజేపీ నెరవేర్చిందా, విదేశాల్లో ఉన్న నల్ల ధనాన్ని వెనక్కి తీసుకోస్తామన్న వాగ్దానం ఏమైంది? ఉక్రెయిన్-రష్యా యుధ్ధాన్ని మోడీ ఎలా ఆపారు? కాళేశ్వరం వంటి ప్రాజెక్టును దేన్నైనా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కట్టారా? కళ్యాణ్ లక్ష్మి లేదా ఇలాంటి పథకాలను ఏ రాష్ట్రంలోనైనా అమలు చేశారా ..? నిజామాబాద్ లో పసుపు బోర్డును ఏర్పాటు చేస్తామన్న హామీ ఎంతవరకు వచ్చింది వంటి వివిధ ప్రశ్నలను టీఆరెస్.. వేసింది.

First Published:  8 July 2022 1:37 AM GMT
Next Story