Telugu Global
Andhra Pradesh

అమిత్ షాను అడిగే ధైర్యం లేదా..?

చాలాకాలంగా తన తండ్రి హత్యకేసులో జగన్ వైఖరిని, కడప ఎంపీ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కరరెడ్డి పాత్రపై ఆమె చాలా అనుమానాలు వ్యక్తంచేస్తూనే ఉన్నారు.

అమిత్ షాను అడిగే ధైర్యం లేదా..?
X

ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబునాయుడు వైఖరి చాలా విచిత్రంగా ఉంటుంది. గడ్డిపోచను ఆధారం చేసుకుని గోదావరిని ఈదాలని అనుకుంటున్నారు. వైసీపీ ఎంపీలు వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి, లావు శ్రీకృష్ణదేవరాయులు టీడీపీలో చేరిన సందర్భంగా బహిరంగ సభలు జరిగాయి. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ `హూ కిల్డ్ బాబాయ్` అనే ప్రశ్నకు ఇప్పటికైనా నిజంచెప్పు జగన్ అంటూ ప్రశ్నించారు. ఢిల్లీలో వైఎస్ వివేకానందరెడ్డి కూతురు సునీత మీడియా సమావేశంపెట్టి జగన్ కు అనేక ప్రశ్నలు సంధించారు. నిజానికి ఇవేవీ కొత్తవికావు.

చాలాకాలంగా తన తండ్రి హత్యకేసులో జగన్ వైఖరిని, కడప ఎంపీ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కరరెడ్డి పాత్రపై ఆమె చాలా అనుమానాలు వ్యక్తంచేస్తూనే ఉన్నారు. కాకపోతే తాజాగా ఆమె చేసిన డిమాండ్ ఏమిటంటే.. జగన్ పాత్రను కూడా సీబీఐ విచారణ చేయాలని.. ఒకవైపు సుప్రీం కోర్టులో కేసు విచారణలో ఉంది. ఈ కేసును దర్యాప్తు చేస్తున్నది సీబీఐ. అలాంటిది సడన్ గా ఢిల్లీలో మీడియా సమావేశంపెట్టి జగన్ మీద ఆరోపణలు చేయాల్సిన అవసరం సునీతకు ఏమొచ్చింది..? తనకు అండగా నిలిచిన చంద్రబాబు, రఘురామకృష్ణంరాజు, మహాసేన రాజేష్ కు ఆమె ధన్యవాదాలు చెప్పటమే ఆశ్చర్యంగా ఉంది.

ఈ విషయంలోనే ప్రభుత్వ సలహదారు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ సునీతతో చంద్రబాబు, ఎల్లోమీడియానే ఆరోపణలు చేయిస్తోందంటూ మండిపడ్డారు. చంద్రబాబు అండ్ కో చెప్పినట్లే ఆమె నడుచుకుంటోందన్నారు. ఇదే అనుమానాలు చాలామందిలో ఉన్నాయి. ఎందుకంటే తన తండ్రిని గొడ్డలితో నరికి చంపిన దస్తగిరి బెయిల్ పై బయట తిరుగుగున్నా సునీత పట్టించుకోవటంలేదు. సరైన ఆధారాలు లేకపోయినా అవినాష్, భాస్కరరెడ్డిని అరెస్టుచేసి జైల్లోపెట్టాలని పదేపదే డిమాండ్లు చేస్తున్నారు.

ఇక్కడ విషయం ఏమిటంటే.. సునీత ప్రశ్నకు సమాధానం చెప్పమని జగన్ను పట్టుకుని చంద్రబాబు డిమాండ్ చేయటమే విచిత్రంగా ఉంది. `హు కిల్డ్ బాబాయ్` అన్నది తేల్చాల్సింది సుప్రీం కోర్టు, సీబీఐ మాత్రమే. సీబీఐ దర్యాప్తు సక్రమంగా జరగటంలేదని అనుమానముంటే అదే విషయాన్ని ప్రశ్నించాల్సింది కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, నరేంద్రమోడీనే. వాళ్ళ ప్రమేయం వల్లే సీబీఐ సరిగా దర్యాప్తుచేయటంలేదని అనుమానం ఉంటే వాళ్ళపై సునీత సుప్రీం కోర్టులో కేసు వేయాలి. అప్పుడు నిజాలన్నీ బయటకు వస్తాయి. అమిత్ షాను అడగాల్సిన ప్రశ్నలను అడిగే ధైర్యంలేక జగన్ను అడిగితే ఉపయోగం ఏముంటుంది..?

First Published:  3 March 2024 6:50 AM GMT
Next Story