Telugu Global
Andhra Pradesh

చంద్రబాబూ.. ఏపీకి ఒక్క ఐటీ కంపెనీనైనా తెచ్చావా?

వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రానికి 65కు పైగా కొత్త కంపెనీలు వచ్చాయి. విశాఖలో డబ్ల్యూఎన్ఎస్, పల్సస్ గ్రూపులు విస్తరించాయి. టెక్ మహీంద్రా విశాఖ నుంచి తమ కార్యకలాపాలను విజయవాడకు విస్తరించింది.

చంద్రబాబూ.. ఏపీకి ఒక్క ఐటీ కంపెనీనైనా తెచ్చావా?
X

ఐటీకి తానే పితామహుడినని చెప్పుకునే టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తన ఐదేళ్ల పాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక్క ఐటీ కంపెనీనైనా తెచ్చిన పాపాన పోలేదు. హైదరాబాద్ ను ఐటీకి కేంద్రంగా మార్చానని చెప్పుకునే చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎందుకు తేలేదనేది ప్రశ్న. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యేక శ్రద్ధ చూపి రాష్ట్రంలో ఐటీ రంగం విస్తరించేలా చర్యలు చేపట్టారు. కరోనా కష్టకాలంలో అంతర్జాతీయంగా ఐటీ రంగం దెబ్బ తిన్నా రాష్ట్రానికి ఆ సమస్య ఎదురు కాలేదు.

బహుళజాతి సంస్థలైన ఇన్ఫోసిస్, విప్రో, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ వంటి సంస్థలు విశాఖపట్నంలో డెవలప్ మెంట్ సెంటర్లను ఏర్పాటు చేశాయి. రాండ్ స్టాండ్ వంటి అంతర్జాతీయ సంస్థలు విశాఖ కేంద్రంగా కార్యకలాపాలను ప్రారంభించాయి. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రానికి 65కు పైగా కొత్త కంపెనీలు వచ్చాయి. విశాఖలో డబ్ల్యూఎన్ఎస్, పల్సస్ గ్రూపులు విస్తరించాయి. టెక్ మహీంద్రా విశాఖ నుంచి తమ కార్యకలాపాలను విజయవాడకు విస్తరించింది.

చంద్రబాబు పదవీకాలం ముగిసేనాటికి రాష్ట్రంలో ఐటీ రంగంలో పనిచేస్తున్న ఉద్యోగుల సంఖ్య 27,643 కాగా అది ఇప్పుడు 75,551కి చేరుకుంది. చంద్రబాబు అధికారం నుంచి దిగిపోయేనాటికి ఉన్న ఐటీ ఉద్యోగుల్లో సగం మంది దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి విశాఖ, కాకినాడ, విజయవాడల్లో అభివృద్ధి చేసిన ఐటీ పార్కుల్లో పనిచేస్తున్నవారే. జగన్ ప్రభుత్వ హయాంలో ఐటీ రంగంలో 47,908 మందికి కొత్తగా ఉపాధి అవకాశాలు లభించాయి.

చంద్రబాబు ప్రభుత్వం ఇంక్యుబేషన్ సెంటర్ పేరుతో ప్రచారానికి మాత్రమే పరిమితం చేశారు. దాంతో స్టార్టప్ లలో ఏపీ చతికిల‌పడింది. వైఎస్ జగన్ స్టార్టప్ ల ప్రోత్సాహానికి చర్యలు తీసుకున్నారు. స్టార్టప్ లకు మెంటార్ షిప్, ఫండింగ్, ఇండస్ట్రీ కనెక్ట్ లతో పాటు నూతన సాంకేతిక పరిజ్ఞానంతో అందిపుచ్చుకునే విధంగా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీలను పెద్ద ఎత్తున జగన్ ప్రభుత్వం ప్రారంభించింది. దేశంలోనే ఎక్కడా లేని విధంగా తొలి నాలుగో తరం పారిశ్రామిక రంగం ఇండస్ట్రీ 4కు చెందిన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీని కల్పతరువు పేరిట విశాఖలో ఏర్పాటు చేసింది.

నాస్కామ్ సహాయంలో ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐవోటి), ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగాల స్టార్టప్ ల కోసం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీలను జగన్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీల ఏర్పాటుతో స్టార్టప్ ల సంఖ్య పెద్ద యెత్తున పెరిగింది. గత ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్ లో స్టార్టప్ ల సంఖ్య మూడు రెట్లకు పైగా పెరిగినట్లు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ డిపార్ట్ మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ (డిపీఐఐటి) లెక్కలే చెప్పుతున్నాయి. 2019లో రాష్ట్రంలో 161 స్టార్టప్ లు ఉండగా ఇప్పుడు వాటి సంఖ్య 586కు పెరిగింది. వీటిలో 2019లో 1,552 మంది పనిచేస్తుండగా ప్రస్తుతం 5,669 మంది పనిచేస్తున్నారు.

First Published:  13 April 2024 7:08 AM GMT
Next Story