Telugu Global
Andhra Pradesh

మీ డ్రీమ్స్.. నా స్కీమ్స్.. ఆసక్తిగా జగన్ ప్రసంగం

చంద్రబాబు వెనక బీజేపీ, కాంగ్రెస్ ఉన్నాయని చెప్పారు సీఎం జగన్. ఒకరు ప్రత్యక్షంగా, మరొకరు పరోక్షంగా బాబుకి మద్దతిస్తున్నారని విమర్శించారు.

మీ డ్రీమ్స్.. నా స్కీమ్స్.. ఆసక్తిగా జగన్ ప్రసంగం
X

మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా 21వరోజు చెల్లూరులో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్నారు సీఎం జగన్. వైసీపీ ప్రవేశ పెట్టిన పథకాలపై ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రజల కలల్ని తాను నెరవేర్చానని చెప్పారు జగన్. పేదలు, మహిళలు కన్న కలల్ని నెరవేర్చేందుకే సంక్షేమ పథకాలు తీసుకొచ్చినట్టు వివరించారు. మీ డ్రీమ్స్‌ను నా స్కీమ్స్‌తో నెరవేర్చానన్నారు జగన్.


పిల్లలను ఇంగ్లిష్ మీడియంలో చదివించాలని, వారికి మంచి స్కూల్స్ లో చేర్పించాలనే పేదింటి అమ్మల కలను.. అమ్మఒడి, నాడు-నేడు, డిజిటల్ బోధన, విద్యా దీవెన, వసతి దీవెన.. వంటి పథకాలతో తాను నెరవేర్చానని చెప్పారు సీఎం జగన్. డ్రీమ్స్‌ పేదింటి అమ్మవవి.. స్కీమ్స్‌ మీ బిడ్డవి.. అని అన్నారు. అవ్వాతాతల డ్రీమ్స్‌ నెరవేరుస్తూ ప్రతినెలా రూ.3 వేల పెన్షన్‌ ఇస్తున్నామని, వాలంటీర్ల ద్వారా ఒకటో తేదీ ఇంటి వద్దకే పెన్షన్‌ పంపిస్తున్నామని చెప్పారు. 58 నెలల్లోనే 2.31 లక్షల ఉద్యోగాలిచ్చామని డ్రీమ్స్‌ యువతవి.. స్కీమ్స్‌ మీ జగనన్నవి అని అన్నారు. బాబు పాలనలో స్కీంలు ఉండవని.. స్కాంలు మాత్రమే ఉంటాయన్నారు. జన్మభూమి కమిటీలతో చంద్రబాబు రాష్ట్రాన్ని దోచుకున్నారని, విజయవాడలో కాల్‌ మనీ, సెక్స్‌ రాకెట్‌ నడపడం తప్ప చంద్రబాబు చేసిందేంటి అని ప్రశ్నించారు. ప్రతి ఇంటికి వెళ్లి చంద్రబాబు చేసిన మోసాలు చెప్పండని ప్రజలకు పిలుపునిచ్చారు జగన్.

నారా కౌరవ సైన్యం..

చంద్రబాబు వెనక బీజేపీ, కాంగ్రెస్ ఉన్నాయని చెప్పారు సీఎం జగన్. ఒకరు ప్రత్యక్షంగా, మరొకరు పరోక్షంగా మద్దతిస్తున్నారని విమర్శించారు. ఒక్క జగన్‌ మీదకు బాబు, దత్తపుత్రుడు, బీజేపీ, కాంగ్రెస్‌ ఎగబడుతున్నాయన్నారు. పెత్తందార్లకు, నారా కౌరవ సైన్యానికి బుద్ధి చెప్పేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారన్నారు. మీ బిడ్డకు తోడుగా దేవుడి దయ, కోట్ల ప్రజల హృదయాలు ఉన్నాయన్నారు జగన్.

First Published:  23 April 2024 1:59 PM GMT
Next Story