Telugu Global
Andhra Pradesh

చంద్రబాబు స్కామ్‌ల గురించి ప్రచారం చేసేది టీడీపీ నేతలే.. విజయసాయిరెడ్డి కామెంట్స్

విజయసాయిరెడ్డి చేసిన ట్వీట్‌లో నిజం ఉందని నెటిజన్లు పేర్కొంటున్నారు. వేషాలు వేసి సింపతీ సంపాదించుకోవాలని టీడీపీ నాయకులు చూస్తున్నారని, అయితే వారు చేస్తున్న డ్రామాలను చూస్తే చంద్రబాబు అవినీతికి పాల్పడ్డాడన్న విష‌యంలో ఏ మాత్రం అనుమానం లేకుండాపోయింద‌ని నెటిజ‌న్లు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

చంద్రబాబు స్కామ్‌ల గురించి ప్రచారం చేసేది టీడీపీ నేతలే.. విజయసాయిరెడ్డి కామెంట్స్
X

స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు దాదాపు 40 రోజుల కిందట అరెస్టు అయిన సంగతి తెలిసిందే. అయితే చంద్రబాబు అరెస్టును వ్యతిరేకిస్తూ ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు చేస్తున్న నిరసన కార్యక్రమాలతో చంద్రబాబు చేసిన స్కామ్‌ల గురించి ప్రజలకు అవగాహన పెరుగుతోందని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు.

గత నెల 9వ తేదీన చంద్రబాబును సీఐడీ అధికారులు అరెస్టు చేసి రాజమండ్రి జైలుకు తరలించారు. అనంతరం ఆయన అరెస్టును ఖండిస్తూ టీడీపీ రాష్ట్రవ్యాప్తంగా బంద్ చేపట్టగా అది ఆశించినంత విజయవంతం కాలేదు. అయితే ఈ కార్యక్రమం తర్వాత చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ టీడీపీ నేతలు, కార్యకర్తలు ఏదో ఒక నిరసన కార్యక్రమాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు.

రాష్ట్రవ్యాప్త బంద్ తర్వాత టీడీపీ శ్రేణులు కొవ్వొత్తులు వెలిగించే కార్యక్రమం నిర్వహించారు. ఆ తర్వాత లోకేష్ మరో కార్యక్రమానికి ప్రజలకు పిలుపు ఇచ్చారు. ప్రజలు తమ వద్ద ఉన్న ఏదైనా వస్తువును తట్టడం ద్వారా కానీ, వాహనం హార్న్ మోగించడం ద్వారా కానీ చంద్రబాబుకు మద్దతు తెలపాలని కోరారు. ఆ తర్వాత 'న్యాయానికి సంకెళ్లు' అనే పేరుతో మరో నిరసన కార్యక్రమాన్ని టీడీపీ నాయకులు చేపట్టారు.

అయితే టీడీపీ చేపట్టిన ఈ కార్యక్రమాల ద్వారా ప్రజల్లో ఎటువంటి సింపతీ రాలేదు. ఈ విషయం గురించి ఎంపీ విజయసాయిరెడ్డి ఓ ట్వీట్ చేశారు. టీడీపీ నేతలు, కార్యకర్తలు నిరసన పేరుతో చేపడుతున్న కార్యక్రమాలతో డ్రామాలు ఆడుతున్నట్లు ప్రజలకు అనిపిస్తోందని ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు.

'వీళ్లు చేసే ‘సంకెళ్ల’ ఫొటోషూట్, లైట్లు ఆర్పేసి కొవ్వొత్తులు వెలిగించే ‘సెలెబ్రేషన్స్’ ప్రజలకు చంద్రబాబు గారు చేసిన స్కాంల గురించి అవగాహన పెంచుతున్నాయి. నిరసన పేరుతో వీళ్లు డ్రామాలు చేసిన ప్రతిసారి ఒక వర్గం వాళ్లే తల్లడిల్లిపోతున్నారు. బాబు గారి జైలు పుణ్యాన వీళ్ల అసలు రూపాలు బయటపడ్డాయి.' అని విజయసాయిరెడ్డి ట్విట్ చేశారు.

కాగా, విజయసాయిరెడ్డి చేసిన ట్వీట్‌లో నిజం ఉందని నెటిజన్లు కూడా పేర్కొంటున్నారు. వేషాలు వేసి సింపతీ సంపాదించుకోవాలని టీడీపీ నాయకులు చూస్తున్నారని, అయితే వారు చేస్తున్న డ్రామాలను చూస్తే చంద్రబాబు అవినీతికి పాల్పడ్డాడన్న విష‌యంలో ఏ మాత్రం అనుమానం లేకుండాపోయింద‌ని నెటిజ‌న్లు అభిప్రాయ‌ప‌డుతున్నారు. దేశంలో ఎంతో మంది రాజకీయ నాయకులు వివిధ ఆరోపణలతో గతంలో అరెస్టయ్యారని.. అయితే ఆయా సమయాల్లో నేతల కుటుంబ సభ్యులు కానీ మద్దతుదారులు కానీ ఇటువంటి నాటకాలు ఆడలేదని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.


First Published:  17 Oct 2023 11:13 AM GMT
Next Story