Telugu Global
Andhra Pradesh

బ్రాహ్మణి కూడా ప్రచారంలోకి దిగేసిందా..?

మంగళగిరిలో చేనేత సామాజికవర్గం ఎక్కువగా ఉందన్న విషయం తెలిసిందే. అందుకనే చేనేతలపైన బ్రాహ్మణి దృష్టిపెట్టారు. మంగళగిరి చేనేతలకు ప్రపంచస్థాయి గుర్తింపు తెస్తారట.

బ్రాహ్మణి కూడా ప్రచారంలోకి దిగేసిందా..?
X

నారా ఫ్యామిలీ అంతా ఎన్నికల ప్రచారంలోకి దిగేసింది. ఒకవైపు చంద్రబాబునాయుడుకు మద్దతుగా ఆయన భార్య భువనేశ్వరి ఇప్పటికే రాష్ట్రంలో తిరుగుతున్న విషయం తెలిసిందే. అంటే డైరెక్టుగా ఆమె టీడీపీకి ఓట్లేసి గెలిపించమని ప్రజలను అడగలేదు. కానీ ఆ అర్థం వచ్చేట్లుగానే జనాలతో మాట్లాడుతున్నారు. ``నిజం గెలవాలి`` అనే స్లోగన్ తో కొందరి ఇళ్ళకు వెళుతున్నారు. చంద్రబాబును స్కిల్ స్కామ్ లో జైల్లో పెట్టినప్పుడు కొందరు చనిపోయారట. అలాంటి కుటుంబాలను ఓదార్చేందుకు వెళుతున్నారు.

ఆ సందర్భంగా రూ. 3 లక్షల ఆర్థికసాయాన్ని అందిస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడినప్పుడు టీడీపీ అధికారంలోకి రాగానే అదిచేస్తాం..ఇదిచేస్తామంటూ హామీలు గుప్పించేస్తున్నారు. ఆమె ఏ హోదాలో జనాలకు హామీలు ఇస్తున్నారో తెలీటంలేదు. మొత్తానికి టీడీపీ గెలుపున‌కు ఆమె ప్రచారం చేస్తున్నారని మాత్రం అర్థ‌మవుతోంది. ఇప్పుడు ఇదే పద్దతిలో నారా లోకేష్ భార్య నారా బ్రాహ్మణి కూడా ప్రచారంలోకి దిగేశారు. లోకేష్ పోటీచేయబోయే మంగళగిరిలో పర్యటించారు.

మంగళగిరిలో చేనేత సామాజికవర్గం ఎక్కువగా ఉందన్న విషయం తెలిసిందే. అందుకనే చేనేతలపైన బ్రాహ్మణి దృష్టిపెట్టారు. మంగళగిరి చేనేతలకు ప్రపంచస్థాయి గుర్తింపు తెస్తారట. పుట్టెడు దుఃఖంలో ఉన్న చేనేతల కుటుంబాలను అధికారంలోకి రాగానే ఆదుకుంటామని హామీ ఇచ్చేశారు. చేనేతల కుట్టుకేంద్రాలు, మగ్గాల కేంద్రాలు తదితరాలను సందర్శించారు. ఇక్కడ విషయం ఏమిటంటే అధికారంలోకి రాగానే చేనేతల కుటుంబాల కష్టాలను తీరుస్తామని హామీ ఇచ్చారు. మరి 2014-19 మధ్య అధికారంలో ఉన్నప్పుడు ఏమిచేశారు..?

టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు భువనేశ్వరి, బ్రాహ్మణి ఏనాడూ జనాల కష్టాలగురించి ఆలోచించలేదు, నియోజకర్గాల్లో తిరగలేదు. అధికారంలో ఉన్నప్పుడు ఏమీచేయని వీళ్ళు రేపు అధికారంలోకి రాగానే అదిచేస్తాం, ఇది చేస్తామని జనాలకు హామీలు ఇస్తున్నారు. చేనేతల అధునాతన మగ్గాలను, కుట్టు మెషీన్ కేంద్రాలను, చేనేతలకు ఇస్తున్న నైపుణ్య శిక్షణ కేంద్రాలను బ్రాహ్మణి సందర్శించారని ఎల్లోమీడియానే రాసింది. అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేనేతల అభివృద్ధికి కుట్టు మెషీన్ కేంద్రాలను, నైపుణ్య శిక్షణ కేంద్రాలను, అధునాతన మగ్గాలను ఏర్పాటుచేసినట్లే కదా. వైసీపీ ప్రభుత్వం చేనేతల అభివృద్ధికి ఇంతచేస్తున్నప్పుడు ఇక టీడీపీ అధికారంలోకి వస్తే బ్రాహ్మణి కొత్తగా చేసేదేముంటుంది..?

First Published:  18 Feb 2024 7:03 AM GMT
Next Story