Telugu Global
Andhra Pradesh

సుజనా పాపాలు పండాయి.. వ్యక్తిగత దివాలాకు NCLT అనుమతి

విజయవాడ వెస్ట్ లో సుజనా ఓటమి ఖాయమని తెలుస్తున్న తరుణంలో ఇలా బ్యాంకుల నుంచి కూడా ఆయనకు ఎదురుదెబ్బ తగలడం విశేషం.

సుజనా పాపాలు పండాయి.. వ్యక్తిగత దివాలాకు NCLT అనుమతి
X

బ్యాంకుల్ని మోసం చేయడం, కోట్లు వెనకేయడం, అప్పులు ఎగ్గొట్టడం, దర్జాగా తిరగడం.. ఏపీలో కూటమి నేతల్లో సగం మంది ఇలాంటి పాపాలు చేసినట్టు రుజువవుతోంది. ఇటీవల రఘురామకృష్ణంరాజు, బ్యాంకుల్ని మోసం చేసిన కేసు కూడా హైలైట్ అయింది. తాజాగా సుజనా చౌదరి మోసాలపై కీలక ఆదేశాలు వెలువడ్డాయి. ఆయన వ్యక్తిగత దివాలాకు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (NCLT) అనుమతి ఇవ్వడం విశేషం.

ఎందుకీ దివాలా..?

స్ప్లెండిడ్ మెటల్ ప్రోడక్ట్స్ లిమిటెడ్ కంపెనీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వద్ద రూ.500 కోట్లు రుణం తీసుకుంది. ఆ రుణానికి సుజనా చౌదరి వ్యక్తిగత గ్యారెంటీ ఇచ్చారు. సదరు కంపెనీ ఆ రుణం ఎగవేసింది. దీంతో SBI రికవరీ పనులు మొదలు పెట్టింది. సుజనా చౌదరి వ్యక్తిగత గ్యారెంటీ ఇచ్చారు కాబట్టి ఆయన వ్యక్తిగత దివాలా ప్రక్రియ ప్రారంభించి పరిష్కారం చేపట్టాలని NCLTలో పిటిషన్ దాఖలు చేసింది. మూడేళ్ల క్రితం దాఖలైన ఈ పిటిషన్ పై ఇంకా విచారణ జరుగుతోంది, తాజాగా NCLT కీలక ఉత్తర్వులివ్వడం విశేషం. సుజనా చౌదరి వ్యక్తిగత దివాలా ప్రక్రియ ప్రారంభించేందుకు NCLT అనుమతి ఇచ్చింది.

ప్రస్తుతం విజయవాడ వెస్ట్ అసెంబ్లీ సీటుకి బీజేపీ అభ్యర్థిగా బరిలో నిలిచారు సుజనా చౌదరి. అక్కడ జనసేన తిరుగుబాటు నేత పోతిన మహేష్ వైసీపీలోకి వెళ్లడం కూటమికి పెద్ద మైనస్. సుజనా ఓటమి ఖాయమని తెలుస్తున్న తరుణంలో ఇలా బ్యాంకుల నుంచి కూడా ఆయనకు ఎదురుదెబ్బ తగలడం విశేషం. బ్యాంకుల్ని మోసం చేసిన వ్యవహారాల్లో గతంలో కూడా సుజనా చౌదరి పలు కేసులు ఎదుర్కొన్నారు. ఈడీ కూడా ఆయన కంపెనీల్లో తనిఖీలు చేపట్టింది. రూ.5700 కోట్ల మేర సుజనా చౌదరికి చెందిన కంపెనీలు బ్యాంకుల్ని మోసం చేసినట్టు తెలుస్తోంది. తాజాగా NCLT ఉత్తర్వులతో సుజనా మోసాలు మరోసారి హైలైట్ అయ్యాయి.

First Published:  19 April 2024 1:45 AM GMT
Next Story