Telugu Global
Andhra Pradesh

విజయసాయి మంత్రాంగం.. నెల్లూరులో జనసేన ఖాళీ

జనసేన నేతల్ని సాదరంగా వైసీపీలోకి ఆహ్వానించారు జగన్, నెల్లూరు జిల్లాలో వైసీపీ గెలుపుకోసం కృషి చేయాలని సూచించారు.

విజయసాయి మంత్రాంగం.. నెల్లూరులో జనసేన ఖాళీ
X

నెల్లూరు జిల్లా జనసేన అధ్యక్షుడు మనుక్రాంత్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ కుమార్ యాదవ్ సహా ఇతర కీలక నేతలు ఈరోజు సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. కాకినాడ జిల్లా రాజానగరం నియోజకవర్గం ఎస్.టి.రాజపురం నైట్ స్టే పాయింట్ వద్ద ఈ చేరికల కార్యక్రమం జరిగింది. జనసేన నేతల్ని సాదరంగా వైసీపీలోకి ఆహ్వానించారు జగన్, నెల్లూరు జిల్లాలో వైసీపీ గెలుపుకోసం కృషి చేయాలని సూచించారు.


నెల్లూరు జిల్లాలో ఇటీవల టీడీపీ, వైసీపీలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. జిల్లాకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు టీడీపీలోకి వెళ్లడం, ఆ తర్వాత వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కూడా టీడీపీలో చేరడం తెలిసిందే. అయితే సీఎం జగన్ వ్యూహాత్మకంగా విజయసాయిని నెల్లూరు పంపించిన తర్వాత పరిస్థితి మారిపోయింది. టీడీపీ, జనసేన నుంచి వలసలు పెరిగాయి. నేతలు కొందరు టీడీపీలోకి వెళ్లినా, కేడర్ మాత్రం వైసీపీలోకి వస్తోంది. జిల్లానుంచి ఏకంగా జనసేన పార్టీ అధ్యక్షుడే వైసీపీలోకి వచ్చారు. ఆయనతోపాటు మరికొందరరు కీలక నేతలు, జనసైనికులు కూడా వైసీపీలో చేరుతున్నారు. దీంతో నెల్లూరు జిల్లాలో జనసేన ఖాళీ అవుతున్నట్టు తెలుస్తోంది.

వైసీపీ గెలుపు విషయంలో ఏ ఒక్క అవకాశాన్ని కూడా సీఎం జగన్ విడిచిపెట్టడంలేదు. చేరికలతో పార్టీని మరింత బలోపేతం చేస్తున్నారు. స్వచ్ఛందంగా వచ్చేవారందర్నీ ఆయనే సాదరంగా ఆహ్వానిస్తున్నారు. పార్టీలో ఉన్నవారికి ఇబ్బంది లేకుండా.. స్థానిక నేతల సమక్షంలోనే కొత్తవారికి కండువా కప్పుతున్నారు. ఈ చేరికలతో కూటమిలో గుబులు మొదలవుతోంది. ఎన్నికలనాటికి ఈ చేరికలు మరింత పెరిగే అవకాశముంది.

First Published:  19 April 2024 7:01 AM GMT
Next Story