Telugu Global
Andhra Pradesh

తెరపైకి సెల్వమణి.. వైరి వర్గానికి రోజా భర్త కౌంటర్

గతంలో తమ సహాయం కోరిన వారు, తమ సాయంతో ఎదిగిన వారు కూడా ఇప్పుడు తమపై విమర్శలు చేస్తున్నారని అన్నారు సెల్వమణి. వారి వెనక ఉండి కొంతమంది అలా మాట్లాడిస్తున్నారని చెప్పారు.

తెరపైకి సెల్వమణి.. వైరి వర్గానికి రోజా భర్త కౌంటర్
X

నగరి నియోజకవర్గంలో మంత్రి రోజాకు సొంత పార్టీనుంచే సెగ తగులుతోందనే వార్తల నేపథ్యంలో ఈరోజు ఆమె భర్త సెల్వమణి వైరి వర్గానికి వార్నింగ్ ఇచ్చారు. నగరితోపాటు ఏపీలోని 175 నియోజకవర్గాల్లో వైసీపీయే గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారాయన. ఇన్నాళ్లూ రోజాకు వెన్నుదన్నుగా రాజకీయం చేస్తూ వచ్చిన సెల్వమణి తొలిసారిగా వైరి వర్గాలపై విరుచుకుపడటంతో నగరిలో పొలిటికల్ హీట్ పెరిగింది.

2014లో పెద్ద నాయకుల్ని తట్టుకుని రోజా గెలవడం సాధ్యం కాదన్నారని, కానీ చేసి చూపించామని, నగరిలో రోజా గెలిస్తే పార్టీ అధికారంలోకి రాదంటూ 2019లో విమర్శించారని, కానీ వైసీపీ అధికారంలోకి రావడంతోపాటు తన శ్రీమతికి మంత్రి పదవి కూడా దక్కిందని చెప్పారు సెల్వమణి. వాడు వీడు, ఏదేదో మాట్లాడితే ఆలోచించాల్సిన అవసరం లేదన్నారాయన. తామెవరికీ ద్రోహం చేయలేదని, కానీ తమకే కొందరు ద్రోహం చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు.

గతంలో తమ సహాయం కోరిన వారు, తమ సాయంతో ఎదిగిన వారు కూడా ఇప్పుడు తమపై విమర్శలు చేస్తున్నారని అన్నారు సెల్వమణి. వారి వెనక ఉండి కొంతమంది అలా మాట్లాడిస్తున్నారని చెప్పారు. కొంతమంది వద్దని వారించినా తాము అందరికీ సపోర్ట్ చేశామని, అలా తమనుంచి సాయం పొందిన వారు కూడా తమపై నిందలు వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మురళిని జడ్పీటీసీని చేశామని, చక్రపాణి రెడ్డిని శ్రీశైలం ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ గా చేశామని, కేజే కుమారి కుటుంబానికి కూడా సాయం చేశామని తామెవరికీ హాని చేయలేదని వివరించారు. తమపై విమర్శలు చేస్తున్నవారిని కూడా తాము ఏమీ అనడంలేదని, అన్నీ దేవుడు చూసుకుంటాడని అన్నారు సెల్వమణి. మంత్రి రోజా తరపున ఆమె భర్త తొలిసారిగా ఘాటు వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది.

First Published:  4 March 2024 9:22 AM GMT
Next Story