Telugu Global
Andhra Pradesh

ఎన్నికల సిత్రాలు.. పిల్లాడికి స్నానం చేయించిన ఎమ్మెల్సీ

ఎన్నికలకు ఇంకా నోటిఫికేషన్ కూడా విడుదల కాకముందే ప్రచార పనులు మొదలుపెట్టారు. టీడీపీ తరఫున ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ నియోజకవర్గమంతా కలియతిరుగుతున్నారు.

ఎన్నికల సిత్రాలు.. పిల్లాడికి స్నానం చేయించిన ఎమ్మెల్సీ
X

ఎన్నికలు వస్తే చాలు చిత్రవిచిత్రాలకు కొదవే ఉండదు. ప్రచారం పేరిట రాజకీయ నాయకులు చేసే విన్యాసాలు ఓటర్లకు నవ్వులను పంచుతుంటాయి. ఓటర్ల దృష్టిలో పడేందుకే అభ్యర్థులు నానా పాట్లు పడుతుంటారు. అయితే ఇంతవరకు ప్రచారం కోసం వచ్చిన రాజకీయ నాయకులు దోసెలు వేయడం, బజ్జీలు వేయడం చూశాం. ఇంకా మగ్గం నేయడం, పొలం పనులు చేయడం, ఆటోలు తోలడం వంటివి చూశాం. అయితే చిన్న పిల్లలకు స్నానం చేయించడం మాత్రం ఇంతవరకు చూడలేదు.

అయితే ఇప్పుడు ఆ ముచ్చటను కూడా ఓ రాజకీయ నాయకుడు చేసేశారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గం కుప్పం. పోయినసారి ఇక్కడి నుంచి చంద్రబాబుకు మెజారిటీ చాలా తగ్గింది. దీంతో ఈసారి చంద్రబాబును మంచి మెజారిటీతో గెలిపించుకునేందుకు తెలుగు తమ్ముళ్లు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.

ఎన్నికలకు ఇంకా నోటిఫికేషన్ కూడా విడుదల కాకముందే ప్రచార పనులు మొదలుపెట్టారు. టీడీపీ తరఫున ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ నియోజకవర్గమంతా కలియతిరుగుతున్నారు. తాజాగా ఆయన నియోజకవర్గంలోని సామగుటపల్లిలో ప్రచారం నిర్వహించారు. శ్రీకాంత్ వీధుల గుండా వెళ్తుండగా అప్పుడే ఓ మహిళ తన కుమారుడి కోసం నీళ్లు తోడి స్నానం చేయించేందుకు సిద్ధమవుతోంది.

ఇది చూసిన శ్రీకాంత్ వెంటనే బాలుడి వద్దకు వెళ్లి రోడ్డుపై కూర్చొని పిల్లాడికి స్నానం చేయించారు. ఆ సమయంలో తీసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఓట్ల కోసం ఎమ్మెల్సీ పడుతున్న పాట్లను చూసి జోకులు పేల్చుతున్నారు. స్నానం అయితే చేపించావు కానీ.. సోప్ కూడా రుద్దింటే బాగుండేది కదా.. అని ఆట పట్టిస్తున్నారు.

First Published:  2 Feb 2024 1:50 PM GMT
Next Story