Telugu Global
Andhra Pradesh

లోకేష్ పై విజయసాయి ఘాటు ట్వీట్

నిందితుడు దొరికాక, అతడి ఉద్దేశం తెలిశాక.. లోకేష్ మొహం ఎక్కడ పెట్టుకుంటారని ప్రశ్నించారు విజయసాయి.

లోకేష్ పై విజయసాయి ఘాటు ట్వీట్
X

సీఎం జగన్ పై జరిగిన దాడిని వెటకారం చేస్తూ ట్వీట్ వేసిన నారా లోకేష్ కి తాజాగా అంతే ఘాటుగా బదులిచ్చారు వైసీపీ నెల్లూరు ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి. దాడి చేసింది జగన్ ని చంపడానికేనని నిందితుడు ఒప్పుకున్నారని, ఇంకా లోకేష్ బుకాయించాలని చూస్తున్నారని మండిపడ్డారు. నిందితుడు దొరికాక, అతడి ఉద్దేశం తెలిశాక లోకేష్ మొహం ఎక్కడ పెట్టుకుంటారని ప్రశ్నించారు విజయసాయి.


"ఇప్పుడు మొహం ఎక్కడ పెట్టుకుంటావు లోకేష్? నీకు మెదడులో చిప్ లేదని అందరికీ తెలుసు. పశువుకంటే హీనంగా దిగజారిన నీకు సంస్కారం నేర్పించలేక పోయినందుకు చదువు చెప్పిన టీచర్లు, స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్లు సిగ్గుతో తలదించుకోవాలి. రాయి ఎక్కడి నుంచి వచ్చిందో నీకు తెలుసు. రాయి దాడి చేయించింది విజయవాడ సెంట్రల్ టీడీపీ ముఖ్యులు. జగన్ ని హతమార్చడానికే పదునైన కాంక్రీట్ రాయితో దాడి చేసినట్టు అంగీకరించాడు నిందితుడు." అంటూ ట్వీట్ వేశారు విజయసాయిరెడ్డి.

జగన్ పై జరిగిన దాడి కావాలని చేయించుకున్నదని ఆమధ్య లోకేష్ సహా టీడీపీ నేతలు తీవ్ర ఆరోపణలు చేశారు. అయితే రాయిదాడి నిందితుడు దొరకడం, టీడీపీ నేతలకు కూడా ఈ దాడితో సంబంధాలున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో లోకేష్ లాంటి వారు సైలెంట్ అయ్యారు. ఇటీవల ఈ దాడి గురించి పెద్దగా మాట్లాడటం లేదు. బొండా ఉమామహేశ్వరరావు మాత్రం తనకేం సంబంధం లేదని భుజాలు తడుముకుంటున్నారు. అన్యాయంగా కొంతమంది మైనర్లను, బీసీలను ఈ కేసులో ఇరికించారని కొత్త పల్లవి అందుకున్నారు. రాయిదాడి కేసులో వైసీపీనే టార్గెట్ చేయాలని చూసిన టీడీపీ చివరకు సెల్ఫ్ గోల్ వేసుకుంది.

First Published:  21 April 2024 12:34 PM GMT
Next Story