Telugu Global
Andhra Pradesh

రామోజీని బూతులు తిడుతున్న వ‌లంటీర్లు

కాకినాడ, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతిలో వలంటీర్లు పెద్దఎత్తున ఎల్లో మీడియాకు వ్యతిరేకంగా ఆందోళన చేశారు. పేపర్లను తగలబెట్టారు. రామోజీరావును నానా మాటలన్నారు.

రామోజీని బూతులు తిడుతున్న వ‌లంటీర్లు
X

ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్ది ఎల్లో మీడియా యాజమాన్యానికి బుర్ర సరిగా పనిచేస్తున్నట్లు లేదు. జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా వార్తలు, కథనాలు రాయాలన్న విషయంలో మాత్రమే బుర్ర పనిచేస్తున్నట్లుంది. అందుకనే బుర్రకు తోచినట్లుగా ఏదేదో రాసేస్తున్నారు. నాలుగు గోడల మధ్య కూర్చుని నెగిటివ్ పాయింట్లు కొన్నింటిని ముందుగానే ప్రిపేర్ చేసుకుని దాని ప్రకారమే స్టోరీని వండి వార్చి అచ్చేస్తున్నారు. ఏదన్నా డెవల‌ప్‌మెంట్‌ జరిగితే రాయటం వేరు, అదేపనిగా వెతికి వెతికి ఏమీ దొరక్కపోతే వ్యతిరేక కథనాలను సృష్టించటం వేరు.

ఇప్పుడు ఎల్లో మీడియాలో జరుగుతున్నదంతా అలాంటి సృష్టే. తాజాగా ‘జగనన్న పాపాలు’ అనే హెడ్డింగ్ పెట్టి దానికి ట్యాగ్ లైన్‌గా ‘ఊరూరా వలంటీర్లు...అన్ని చోట్లా జగన్ అరాచకాలు’ అనే స్టోరీని అచ్చేశారు. దానిపై వలంటీర్లు మండిపోతున్నారు. కాకినాడ, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతిలో వలంటీర్లు పెద్దఎత్తున ఎల్లో మీడియాకు వ్యతిరేకంగా ఆందోళన చేశారు. పేపర్లను తగలబెట్టారు. రామోజీరావును నానా మాటలన్నారు. ఇలాంటి తప్పుదు వార్తలు ఇంకోసారి రాస్తే కొడతామని వార్నింగ్ ఇచ్చారు. ఇంతకీ రామోజీ రాసిందేమిటంటే పేరుకు వలంటీర్లు స్వచ్చంద సేవకులే కాని చేస్తున్నదంతా జగన్ సేవేనట.

ఇక్కడే ఇదెంత పిచ్చిరాతో అర్థ‌మైపోతోంది. ప్రభుత్వం నియమించినవాళ్ళు ప్రభుత్వానికి సేవలు చేయకుండా ప్రతిపక్షాలకు చేస్తారా? జనాలపై అడుగడుగునా నిఘా వేస్తున్నారట. వైసీపీ అరాచకాలకు వలంటీర్లు తోడూనీడానట. ప్రజలపై వలంటీర్లు నిఘా వేయటం ఏమిటి? వైసీపీ అరాచకాలకు వలంటీర్లు తోడుగా ఉండటం ఏమిటో రామోజీకే తెలియాలి. వలంటీర్లంటే ప్రభుత్వ సొమ్ముతో ఏర్పాటైన జగన్ ప్రైవేటు సైన్యమట. ఈ విషయాన్ని చెప్పాల్సింది రామోజీ కాదు జనాలు. వలంటీర్ల వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని జనాలు చెబితే మిగిలినవాళ్ళు నమ్ముతారు.

మీ ఇంటికి ఎవరైనా వచ్చినా లేదు మీరు ఎటైనా వెళ్ళినపుడు పొరబాటున నోరుజారితే ఆ విషయాన్ని ఇట్టే పట్టేసి వైసీపీకి చేరవేస్తున్నారట. ప్రభుత్వ సేవలనే తేనెపూసి కంటికి కనిపించని గూఢచర్యంతో జనాల జీవితాలను అభద్రతకు గురిచేస్తున్నారట వలంటీర్లు. నిజంగా రామోజీ రాసిందాంట్లో ఏ ఒక్కటి నిజమైనా జనాలు ఊరుకుంటారా? వలంటీర్లను ఉరికించి తరిమి కొట్టేవాళ్ళు కాదా? స్టోరీ చదివిన తర్వాత అర్థ‌మవుతున్నది ఏమిటంటే ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి వలంటీర్ల మీదకు జనాలను రెచ్చగొట్టాలి.

జనాలకు వలంటీర్లకు మధ్య చిచ్చుపెట్టి గొడవలయ్యేట్లు చేయాలన్న దురాలోచనే కనబడుతోంది. చంద్రబాబు హయాంలో పనిచేసిన జన్మభూమి కమిటీలతో వలంటీర్ల పనితీరును జనాలు పోల్చిచూసుకుంటున్నారు. వలంటీర్ల సర్వీసు విషయంలో జనాలు చాలావరకు హ్యాపీగానే ఉన్నారు. జన్మభూమి కమిటీలు మామూలు జనాలకు కాదు చివరకు టీడీపీ నేతలకే చుక్కలు చూపించారు. అందుకనే జనాలు, పార్టీ జనాలు కలిసి టీడీపీకి ఎదురుతిరిగారు. పిచ్చిరాతలు రాశారు కాబట్టే వలంటీర్లు రామోజీని అమ్మనా బూతులు తిడుతున్నారు.

First Published:  8 Feb 2024 6:07 AM GMT
Next Story