Telugu Global
Andhra Pradesh

లోకేశ్‌లా వలంటీర్లు లోఫర్లు కాదు.. - పోసాని కృష్ణమురళి

చంద్రబాబు నెంబర్‌ వన్‌ కిలాడీ అని, తన రాజకీయ భవిష్యత్‌ కోసం వంగావీటి రంగాను హత్య చేయించారని పోసాని విమర్శించారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు పనికిరారని ఆయన స్పష్టం చేశారు.

లోకేశ్‌లా వలంటీర్లు లోఫర్లు కాదు.. - పోసాని కృష్ణమురళి
X

చంద్రబాబు కుమారుడు లోకేశ్‌లా వలంటీర్లు తాగుబోతులు, తిరుగుబోతులు, లోఫర్లు కాదని ఏపీ ఎఫ్‌డీసీ చైర్మన్‌ పోసాని కృష్ణమురళి విమర్శించారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో వలంటీర్లు ప్రజలకు నిస్వార్థ సేవ చేస్తున్నారని ఆయన తెలిపారు. వలంటీర్ల సేవలను చూసి చంద్రబాబు ఓర్వలేకపోతున్నారని, క్యాన్సర్‌ గడ్డ నిమ్మగడ్డతో ఫిర్యాదు చేయించి అడ్డుకున్నారని ఆయన మండిపడ్డారు. వలంటీర్లు తలుపులు కొట్టేవారని, ఆడపిల్లలను ఇబ్బంది పెట్టేవాళ్లని వారిపై దుష్ప్రచారం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వలంటీర్లను ప్రజలు తమ్ముడు, అన్న, బిడ్డలా చూసుకుంటున్నార‌ని, చంద్రబాబు మాత్రం వారిని సిగ్గు లేకుండా మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. ఇప్పుడు మాత్రం వలంటీర్లపై చంద్రబాబు మొసలి కన్నీరు కారుస్తున్నారని ఆయన తెలిపారు. వలంటీర్లకు రూ.10 వేలు ఇస్తామని చంద్రబాబు డ్రామా ఆడుతున్నాడని, గతంలో 600 హామీలు ఇచ్చి ఒక్కటీ అమలు చేయలేదని ఆయన గుర్తుచేశారు. ఒక్క హామీ అమలు చేసినట్టు చూపించు అంటూ ఈ సందర్భంగా నిలదీశారు. ఎల్లో మీడియాకి, చంద్రబాబుకు మహిళలంటే గౌరవం లేదని పోసాని చెప్పారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి పేపర్లను నమ్మొద్దని, చంద్రబాబును అధికారంలో కూర్చోబెట్టడమే వారి లక్ష్యమని ఆయన విమర్శించారు.

చంద్రబాబు నెంబర్‌ వన్‌ కిలాడీ అని, తన రాజకీయ భవిష్యత్‌ కోసం వంగావీటి రంగాను హత్య చేయించారని పోసాని విమర్శించారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు పనికిరారని ఆయన స్పష్టం చేశారు. జయప్రద జీవితాన్ని నాశనం చేసింది చంద్రబాబని, రామోజీరావుతో కలిసి లక్ష్మీ పార్వతి జీవితాన్ని నాశనం చేశాడని ఆయన చెప్పారు. మహిళలను చంద్రబాబు చాలా చులకనగా చూస్తాడని, బాలకృష్ణ ఆడవాళ్లు కనిపిస్తే కడుపు చేయాలంటూ మాట్లాడాడని ఈ సందర్భంగా గుర్తుచేశారు.

తాను కమ్మ కులస్తుడిని కాబట్టి చంద్రబాబుని తిట్టొద్దంటున్నారని, అవినీతిపరుడు, దొంగ కమ్మ వాడైతే.. నేను మద్దతు ఇవ్వాలా.. అంటూ పోసాని ప్రశ్నించారు. మరి ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గతంలో సుజనా చౌదరి అవినీతిపై రాయలేదా? అని ఆయన నిలదీశారు. ఈనాడు రామోజీరావు కూడా సుజనా ఎన్ని వేల కోట్లు మోసం చేశాడో స్ప‌ష్టంగా రాశాడని చెప్పారు. అలాంటి వ్యక్తి కూటమి అభ్యర్థా అని ఆయన ప్రశ్నించారు. సుజనా చౌదరి వేల కోట్లు అక్రమంగా తిన్నాడని ఆయన విమర్శించారు. దొంగలందరూ కలిసి సీఎం జగన్‌ని దించాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. కానీ ప్రజలు మళ్లీ సీఎంగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డినే గెలిపించుకోవాలని ఇప్పటికే నిర్ణయించుకున్నారని పోసాని స్పష్టం చేశారు.

First Published:  10 April 2024 2:51 PM GMT
Next Story