Telugu Global
Andhra Pradesh

సెంట్రల్‌ జైలు నిన్ను రా.. కదలిరా.. అంటోంది బాబూ

ప్రజల ఆశీస్సులతో అధికారంలోకి వచ్చిన ఎన్టీఆర్‌ సొంత కుటుంబ సభ్యుల చేతిలో, అధికార దాహంతో అల్లాడుతున్న ఒక మోసకారి చేతిలో వంచనకు గురై పార్టీని, ముఖ్యమంత్రి పదవిని కోల్పోయి మనో వేదనతో మృతిచెందారని కొడాలి నాని చెప్పారు.

సెంట్రల్‌ జైలు నిన్ను రా.. కదలిరా.. అంటోంది బాబూ
X

రా.. కదలిరా.. అంటూ చంద్రబాబు జనంలోకి వస్తుంటే.. రాజమండ్రి సెంట్రల్‌ జైలు చంద్రబాబుని రా.. కదలిరా.. అని పిలుస్తోందని కొడాలి నాని ఎద్దేవా చేశారు. కన్ను పనిచేయడం లేదు.. కిడ్నీ పనిచేయడం లేదు.. ఇంకా ఏదో పని చేయడం లేదు.. అంటూ జిత్తులమారి నక్కలా తప్పించుకుంటున్న 420 గాడిని సెంట్రల్‌ జైలు కదలి రమ్మని పిలుస్తోందని చెప్పారు. ఆయన త్వరలోనే జైలుకెళ్లడం ఖాయమని స్పష్టం చేశారు. త్వరగా జైలుకి వెళ్లమని సుప్రీంకోర్టు కూడా బాబును ఆదేశించిందని నాని తెలిపారు. గురువారం మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ వర్ధంతి సందర్భంగా గుడివాడలో ఆయన కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన కొడాలి నాని.. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు.

ఓట్ల కోసం చంద్రబాబు ఎన్టీఆర్‌ బూట్లు నాకుతున్నాడు..

ప్రజల ఆశీస్సులతో అధికారంలోకి వచ్చిన ఎన్టీఆర్‌ సొంత కుటుంబ సభ్యుల చేతిలో, అధికార దాహంతో అల్లాడుతున్న ఒక మోసకారి చేతిలో వంచనకు గురై పార్టీని, ముఖ్యమంత్రి పదవిని కోల్పోయి మనో వేదనతో మృతిచెందారని కొడాలి నాని చెప్పారు. ఎవరైతే ఎన్టీఆర్‌ పనికిరాడని చెప్పాడో, పార్టీ అధ్యక్ష పదవిని, ముఖ్యమంత్రి పదవిని లాక్కుని అధికారంలోకి వచ్చాడో వాడే, ఆ గజదొంగే ఇప్పుడు ఓట్ల కోసం ఎన్టీఆర్‌ బూట్లు నాకుతున్నాడన్నారు. ఇటు వంటి నక్కజిత్తుల వేషాలను ప్రజలు తిప్పికొడతారని నాని స్పష్టం చేశారు. తెలంగాణలో ప్రజలు ఇప్పటికే తెలుగుదేశం పార్టీని భూస్థాపితం చేశారని, 2024 ఎన్నికల అనంతరం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు సైతం టీడీపీని, చంద్రబాబు నాయకత్వాన్ని కనుమరుగు చేసేందుకు సిద్ధంగా ఉన్నారని నాని స్పష్టం చేశారు. ఎన్టీఆర్‌ బతికుండగా ఆయన్ని దుర్మార్గుడని, పార్టీ నాయకుడిగా పనికిరాడని చెప్పి పదవి నుంచి దింపేసిన కుటుంబ సభ్యులు.. ఇప్పుడు ఎన్టీఆర్‌ గ్రామానికి వచ్చి విగ్రహాలకు దండలేయడం, వర్ధంతులు చేస్తామనడం మోసపూరిత చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఎన్టీఆర్‌ వారసుడు జూనియర్‌ ఎన్టీఆరే

ఎన్టీఆర్‌ వారసులమని కుటుంబ సభ్యులు చెప్పుకుంటుంటే.. ప్రజలు మాత్రం జూనియర్‌ ఎన్టీఆరే ఆయనకు నిజమైన వారసుడిగా గుర్తిస్తున్నారని నాని చెప్పారు. ఫ్లెక్సీల తొలగింపు కుటుంబ సభ్యుల నీచమైన బుద్ధిని తెలియజేసిందే తప్ప జూనియర్‌ ఎన్టీఆర్‌కి జరిగే నష్టం ఏమీలేదన్నారు. తన అల్లుడు పప్పు గాడిని పైకి లేపేందుకు బాలకృష్ణ ఇటువంటి నీచ కార్యాలకు తెరలేపారన్నారు. బాలకృష్ణ, చంద్రబాబు లాంటివాళ్లు వందలమంది వచ్చినా జూనియర్‌ ఎన్టీఆర్‌కి ఊడేదేమీ లేదని స్పష్టం చేశారు.

చంద్రబాబు ఇంతకు ముందు కూడా తనకు డిపాజిట్లు రాకుండా చేస్తానంటూ వీరంగం వేశాడని, కానీ తాను నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచానని కొడాలి నాని గుర్తుచేశారు. గుడివాడలో తనపై పోటీ చేస్తున్న అభ్యర్థులు మారుతున్నారు తప్ప తన గెలుపులో ఏమాత్రం తేడా లేదన్నారు. వైఎస్‌ జగన్‌ అధికారంలో ఉండటం, ఆయన పాలన కొనసాగడం తనకు ముఖ్యమని, పదవులు ఈకతో సమానమని అన్నారు. ప్రతి పార్టీకీ గెలవాలనే లక్ష్యం ఉంటుందని, గెలిచే వారికే టిక్కెట్లు ఇవ్వడం పార్టీ అధినేత ఆలోచన అని చెప్పారు. ఇవన్నీ సర్వసాధారణమన్నారు. వీటితో చంద్రబాబుకు ఏం పని అని ప్రశ్నించారు. 1978లో చంద్రగిరిలో గెలిచిన చంద్రబాబు ఆ తర్వాత ఓడిపోలేదా అని నిలదీశారు. ఆయన సీఎం అయ్యాక జరిగిన 5 ఎన్నికల్లో చంద్రగిరిలో ఒక్కసారైనా గెలిచారా అని ప్రశ్నించారు. గన్నవరంలో గెలిచిన గద్దె రామ్మోహన్‌రావును విజయవాడలో, నందిగామలో గెలిచిన దేవినేని ఉమను మైలవరంలో, కొవ్వూరు నుంచి తెచ్చిన జవహర్‌ను తిరువూరులో బాబు ఎందుకు పోటీ చేయిస్తున్నాడని నిలదీశారు. బాలయ్య హిందూపూర్‌లో పుట్టాడా? వాడికి కొంపాగోడూ ఉందా అని నిలదీశారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు ఈ నక్కజిత్తుల చంద్రబాబు మాటలు నమ్మరని కొడాలి నాని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

First Published:  19 Jan 2024 4:49 AM GMT
Next Story