Telugu Global
Andhra Pradesh

సీట్లు ప్రకటించి చూడండి.. టికెట్లు రాని అభ్యర్థులు తగలబెడతారు

కొత్త మేనిఫెస్టో ప్రకటించి చంద్రబాబుకు దిమ్మతిరిగేలా చేస్తామని, ఆయనకు ప్రతిపక్ష హోదా కూడా దక్కదన్నారు.

సీట్లు ప్రకటించి చూడండి.. టికెట్లు రాని అభ్యర్థులు తగలబెడతారు
X

టీడీపీ- జనసేన కూటమిలో ఎవరు ఎక్కడ పోటీ చేస్తారో ప్రకటిస్తే, సీట్లు రానివారు ఆ రెండు పార్టీలను తగలబెడతారని మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు, వైఎస్ షర్మిలపై తీవ్ర విమర్శలు చేశారు. తాను తలుపులు తెరిస్తే వైసీపీ ఖాళీ అవుతుందని చంద్రబాబు అంటున్నారని, కానీ గత ఎన్నికల్లోనే ప్రజలు చంద్రబాబును ఘోరంగా ఓడించి హైదరాబాద్ కు పార్సిల్ చేసి పంపారని విమర్శించారు.

రాష్ట్ర అభివృద్ధి కోసం టీడీపీ చేసింది ఏమీ లేదని.. అందుకే చంద్రబాబు సీఎం జగన్ ను తిట్టడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. సీట్లు దక్కనివారు, తాము తొలగించిన వారు టీడీపీలో చేరుతున్నారని చెప్పారు. టీడీపీ -జనసేన కూటమిలో ఎవరు ఎక్కడ పోటీ చేస్తారో ప్రకటిస్తే సీట్లు దక్కని వారు ఆ పార్టీలను తగలబెడతారని కొడాలి నాని వ్యాఖ్యానించారు. కొత్త మేనిఫెస్టో ప్రకటించి చంద్రబాబుకు దిమ్మతిరిగేలా చేస్తామని, ఆయనకు ప్రతిపక్ష హోదా కూడా దక్కదన్నారు.

పదవి కోసమే షర్మిల జగన్ పై నిందలు

పదవి కోసమే షర్మిల ముఖ్యమంత్రి జగన్ పై నిందలు వేస్తున్నారని కొడాలి నాని అన్నారు. గతంలో ఆమె తెలంగాణలో పార్టీ పెట్టి పాదయాత్ర చేశారని.. ఆ తర్వాత ఆమె పార్టీ ఏమైందో అందరికీ తెలుసు అని అన్నారు. జీరో పర్సెంట్ ఓట్లు ఉన్న షర్మిల పార్టీ, ఒక్క శాతం ఉన్న కాంగ్రెస్ తో కలిస్తే ఏం జరుగుతుందో వేరే చెప్పాల్సిన పని లేదన్నారు.

2014లో వైసీపీ ఓటమి తర్వాత షర్మిల ఎక్కడైనా కనిపించారా? అని కొడాలి నాని ప్రశ్నించారు. 2019 ఎన్నికల సమయంలో కూడా షర్మిల ఎక్కడా ప్రచారం చేపట్టలేదన్నారు. రాష్ట్ర సమస్యల గురించి కానీ, రాష్ట్రంపై కానీ, కనీస అవగాహన కూడా లేకుండా షర్మిల ఇప్పుడొచ్చి మాట్లాడుతోందని విమర్శించారు. రాజకీయంగా లబ్ధి పొందడం కోసమే షర్మిల ముఖ్యమంత్రి జగన్ పై విమర్శలు చేస్తున్నారని కొడాలి నాని మండిపడ్డారు.

First Published:  31 Jan 2024 11:46 AM GMT
Next Story