Telugu Global
Andhra Pradesh

'నాకు ఒక కల ఉంది'.. వైసీపీ సరికొత్త ప్రచారం

రైతుల కల - జగనన్న కల, కార్మికుల కల - జగనన్న కల, విద్యార్థుల కల - జగనన్న కల.. ఇలా రూపొందించిన హోర్డింగులు ఆకట్టుకుంటున్నాయి. ఆయా వర్గాలకు సీఎం జగన్ చేసిన మేలుని మరోసారి తెలియజేస్తున్నాయి.

నాకు ఒక కల ఉంది.. వైసీపీ సరికొత్త ప్రచారం
X

సిద్ధం అంటూ రెండక్షరాల టైటిల్ తో ఎన్నికల సమరశంఖారావం పూరించారు సీఎం జగన్. కేవలం సిద్ధం అని మాత్రమే రాసి ఉన్న పోస్టర్లతో రాష్ట్ర వ్యాప్తంగా ఎలక్షన్ మూడ్ తీసుకురాగలిగింది వైసీపీ. అనుకూల మీడియా, ఆస్థాన రచయితలు ఉన్న టీడీపీ మాత్రం ప్రచార వ్యూహాల్లో వైసీపీకి పోటీ రాలేకపోవడం విశేషం. సిద్ధంను కాపీ కొట్టి మేము కూడా సిద్ధం, సంసిద్ధం అంటున్నారే కానీ.. కొత్తగా స్లోగన్ తెరపైకి తీసుకురాలేకపోతున్నారు టీడీపీ నేతలు. బీసీ గర్జన, బీసీ డిక్లరేషన్ అంటూ అరిగిపోయిన రికార్డ్ లు వేసుకుంటున్నారు. ఈ టైమ్ లో వైసీపీ మరో సరికొత్త ప్రచార అస్త్రాన్ని రెడీ చేసింది. సిద్ధం స్థానంలో 'నాకు ఒక కల ఉంది' అంటూ ప్రచారం మొదలు పెడుతోంది.

ఈనెల 10న వైసీపీ ఆఖరి సిద్ధం సభ జరుగుతుంది. ఆ తర్వాత పార్టీ నాయకులతో మీటింగ్ నిర్వహించి ఎన్నికల శంఖారావం పూరిస్తారు సీఎం జగన్. ఈలోగా కొత్త ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది వైసీపీ. 'నాకు ఒక కల ఉంది' అంటూ జగన్ ఫొటోలు, ఆయన ద్వారా లబ్ధిపొందిన వర్గాల ఫొటోలతో హోర్డింగ్ లు వేస్తోంది.

ప్రజల కల నెరవేర్చే దిశగా అడుగులు వేశామంటూ సీఎం జగన్‌ పేరిట ఎన్నికల ప్రచారం నిర్వహిస్తోంది వైసీపీ. రైతుల కల - జగనన్న కల, కార్మికుల కల - జగనన్న కల, విద్యార్థుల కల - జగనన్న కల.. ఇలా రూపొందించిన హోర్డింగులు ఆకట్టుకుంటున్నాయి. ఆయా వర్గాలకు సీఎం జగన్ చేసిన మేలుని మరోసారి తెలియజేస్తున్నాయి.

గడప గడపకూ సంక్షేమం..

గడప గడపకూ సంక్షేమం పేరుతో మరో కార్యక్రమం కూడా చేపట్టబోతోంది రాష్ట్ర ప్రభుత్వం. ఈనెల 8, 9, 10 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా వాలంటీర్లు మరోసారి ప్రతి కుటుంబం దగ్గరకు వెళ్లబోతున్నారు. ప్రభుత్వం అందించిన రెండు పేజీల లేఖను లబ్ధిదారుల కుటుంబాలకు వాలంటీర్లు అందిస్తారు. ఆ లేఖలు అందినట్టు, అందులో ఉన్నవన్నీ వాస్తవాలే అయినట్టు కుటుంబంలో ఒకరు వేలిముద్ర ద్వారా వాలంటీర్ల వద్ద ఉన్న యాప్ లో ధృవీకరించాల్సి ఉంటుంది. దీని ద్వారా మరోసారి ప్రజలకు అందించిన లబ్ధిని ప్రభుత్వం ప్రచారం చేసుకుంటోంది.

First Published:  6 March 2024 4:10 AM GMT
Next Story