Telugu Global
CRIME

ధోనీ బిజినెస్ పార్ట్‌నర్ అరెస్ట్.. ఎందుకంటే!

ధోనీ మాజీ బిజినెస్‌ పార్టనర్‌ మిహిర్‌ దివాకర్‌ను జైపుర్ పోలీసులు అరెస్ట్‌ చేశారు.

ధోనీ బిజినెస్ పార్ట్‌నర్ అరెస్ట్.. ఎందుకంటే!
X

ధోనీ మాజీ బిజినెస్‌ పార్టనర్‌ మిహిర్‌ దివాకర్‌ను జైపుర్ పోలీసులు అరెస్ట్‌ చేశారు. అనుమతి లేకుండా తన పేరును క్రికెట్ అకాడమీల కోసం వాడుకున్నారని రాంచీ జిల్లా కోర్టులో 3 నెలల కిందటే దివాకర్‌తోపాటు సౌమ్యా దాస్‌పై ధోనీ ఫిర్యాదు చేశాడు. దీంతో కోర్టు ఆదేశాల మేరకు జైపుర్‌లో పోలీసులు దివాకర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఆర్కా స్పోర్ట్స్‌ మేనేజ్‌మెంట్ ప్రైవేట్‌ లిమిటెడ్‌లో అతడు డైరెక్టర్‌గా ఉన్నారు. సౌమ్యా దాస్‌ పరారీలో ఉంది.

ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్‌ అకాడమీలను ఏర్పాటు చేయడానికి దివాకర్‌కు చెందిన ఆర్కా స్పోర్ట్స్‌ అండ్‌ మేనేజ్‌మెంట్ లిమిటెడ్‌ సంస్థ 2017లో ధోనీతో ఒప్పందం చేసుకుంది. దీని ప్రకారం ఆర్కా స్పోర్ట్స్‌.. ఫ్రాంఛైజీ ఫీజులు, లాభాల్లో వాటాను క్రికెటర్‌కు చెల్లించాల్సి ఉంటుంది. అయితే దివాకర్‌ కంపెనీ ఒప్పందంలోని షరతులను పాటించలేదు. దీనిపై ఆర్కా స్పోర్ట్స్‌కు చెందిన మిహిర్‌ దివాకర్‌, సౌమ్య దాస్‌తో ధీనీ పలుమార్లు చర్చలు జరిపాడు. అయినా ఫలితం లేకుండా పోయింది. దీంతో ఆ ఒప్పందం నుంచి ధోనీ బయటికొచ్చాడు. 2021 ఆగస్టు 15న ఆర్కా స్పోర్ట్స్‌కు ఇచ్చిన అథారిటీ లెటర్‌ను కూడా రద్దు చేసుకున్నాడు.

అనంతరం పలుమార్లు దివాకర్‌కు లీగల్‌ నోటీసులు పంపించాడు ధోనీ. అయినప్పటికీ అటువైపు నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో కోర్టును ఆశ్రయించాడు. మిహిర్‌ దివాకర్‌, సౌమ్యపై రాంచీ కోర్టులో క్రిమినల్‌ కేసు దాఖలు చేశాడు. ఒప్పందాన్ని ఉల్లంఘించి ఆర్కా స్పోర్ట్స్‌ చేసిన మోసం కారణంగా తనకు రూ.15కోట్ల నష్టం వచ్చినట్లు ధోనీ పేర్కొన్నాడు. దీంతో వారిద్దరిపై క్రిమినల్‌ కేసు నమోదైంది. తాజాగా కోర్టు ఆదేశాలతో నిందితుడు దివాకర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.

First Published:  11 April 2024 9:06 AM GMT
Next Story