Telugu Global
International

ఫుట్ బాల్ వరల్డ్ కప్ లో తమ దేశం ఓడిపోయినందుకు సంబరాలు చేసుకున్న ఇరాన్ ప్రజలు

ఇరాన్ ఫుట్ బాల్ టీం ఓడిపోవడం అక్కడి ప్రజలకు ఆనందాన్నిచ్చింది. మహ్సా అమినీ స్వస్థలమైన సకేజ్‌లో, అలాగే ఇరాన్‌లోని అనేక ఇతర నగరాల్లో, పౌరులు బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. "ఇరాన్ ఫుట్‌బాల్ జట్టుపై అమెరికా తొలి గోల్ చేసిన తర్వాత సాకేజ్ పౌరులు బాణసంచా కాల్చడం ప్రారంభించారు" అని లండన్‌కు చెందిన ఇరాన్ వైర్ వెబ్‌సైట్ ట్విట్టర్‌లో పేర్కొంది.

ఫుట్ బాల్ వరల్డ్ కప్ లో తమ దేశం ఓడిపోయినందుకు సంబరాలు చేసుకున్న ఇరాన్ ప్రజలు
X

బుధవారం నాడు FIFA ప్రపంచ కప్‌లో యుఎస్‌తో ఇరాన్ ఫుట్‌బాల్ జట్టు ఓటమితో ఇరాన్ లో సంబరాలు అంబరాన్నంటాయి. ఆశ్చ‌ర్యంగా ఉన్నప్పటికీ ఇది నిజం. తమ దేశం ఓడిపోయినందుకు ఆ దేశంలోని వేలాది మంది ప్రజలు రోడ్ల మీదికి వచ్చి డ్యాన్సులు చేశారు, బాణా సంచాలు కాల్చారు. ఇరాన్ వీధుల్లో ఆనందోత్సాహాల దృశ్యాలు సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ చేశారు.

ఇరాన్ ప్రజలు వాళ్ళ స్వంత జట్టు పట్ల ఎందుకిలా వ్యవ‌హరించారు ?

సెప్టంబర్ 16న‌ హిజాబ్ సరిగా వేసుకోలేదన్న సాకుతో మహ్సా అమినీ అనే యువతిని మోరల్ పోలీసులు కొట్టి చంపిన నేపథ్యంలో ఆ రోజు నుండి దేశ‌వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు సాగుతున్నాయి. మహిళలు బహిరంగంగా తమ జుట్టును కత్తిరించుకుంటూ ప్రభుత్వానికి తమ నిరసన తెలుపుతున్నారు. స్కూలు పిల్లల నుండి ముసలి వాళ్ళ వరకు ఈ నిరసనల్లో పాల్గొంటున్నారు.

మరో వైపు పాలకులు నిరసనకారులపై దమనకాండకు దిగారు. పోలీసుల కాల్పుల్లో వందల మంది మరణించారు. అందులో స్కూలు పిల్లలు కూడా ఉన్నారు. వేలాది మంది జైళ్ళపాలయ్యారు. చిన్న నిరసనను కూడా తట్టుకోలేని ఇరాన్ ప్రభుత్వం నిరసనకారులపై ఉక్కుపాదం మోపుతోంది.

దేశం ఇంతటి, హింసా, విషాద పరిస్థితులో ఉన్నప్పుడు ఫుట్ బాల్ వరల్డ్ కప్ లో ఇరాన్ టీం పాల్గొనడం సరైంది కాదంటూ దేశం మొత్తం డిమాండ్ చేసింది. అయినా ప్రభుత్వం తమ టీం ను కతర్ కు పంపించింది. ఆటగాళ్ళు కూడా అక్కడ తమ జాతీయ గీతం పాడకుండా తమ ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేశారు.

ఈ నేపథ్యంలో ఇరాన్ ఫుట్ బాల్ టీం ఓడిపోవడం అక్కడి ప్రజలకు ఆనందాన్నిచ్చింది. మహ్సా అమినీ స్వస్థలమైన సకేజ్‌లో, అలాగే ఇరాన్‌లోని అనేక ఇతర నగరాల్లో, పౌరులు బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. "ఇరాన్ ఫుట్‌బాల్ జట్టుపై అమెరికా తొలి గోల్ చేసిన తర్వాత సాకేజ్ పౌరులు బాణసంచా కాల్చడం ప్రారంభించారు" అని లండన్‌కు చెందిన ఇరాన్ వైర్ వెబ్‌సైట్ ట్విట్టర్‌లో పేర్కొంది.

"నేను మూడు మీటర్లు పైకెగిరి దూకి అమెరికా గోల్‌ని సెలబ్రేట్ చేస్తానని ఎవరు ఊహించారు!" అని ఇరాన్ ఓటమి తర్వాత ఇరాన్ స్పోర్ట్స్ జర్నలిస్ట్ సయీద్ జఫారానీ ట్వీట్ చేశారు.

First Published:  30 Nov 2022 11:08 AM GMT
Next Story