Telugu Global
National

సినీ, రాజకీయ రంగాల్లో ఎన్టీఆర్‌ది చెరగని ముద్ర.. మన్ కీ బాత్‌లో మోడీ ప్రశంస

ఎన్టీఆర్ 300కు పైగా సినిమాల్లో నటించి ప్రేక్షకులను అలరించినట్లు మోడీ వివరించారు. కేవలం సినిమాల్లో మాత్రమే కాదని, రాజకీయ రంగంలో కూడా ఎన్టీఆర్ చెరగని ముద్ర వేశారని మోడీ ప్రశంసించారు.

సినీ, రాజకీయ రంగాల్లో ఎన్టీఆర్‌ది చెరగని ముద్ర.. మన్ కీ బాత్‌లో మోడీ ప్రశంస
X

సినీ, రాజకీయ రంగాల్లో నందమూరి తారక రామారావుది చెరగని ముద్ర అని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా మోడీ శ్రద్ధాంజలి ఘటించారు. కోట్ల మంది ప్రజల మనసుల్లో ఎన్టీఆర్ సుస్థిర స్థానం సంపాదించుకున్నారన్నారు. ప్రధానమంత్రి మోడీ ప్రతినెలా మన్ కీ బాత్ పేరిట రేడియో కార్యక్రమం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో భాగంగా ఆయన పలు విషయాలను ప్రజలతో పంచుకుంటుంటారు.

ఇప్పటికే ఈ కార్యక్రమం 100 ఎపిసోడ్‌లు పూర్తి చేసుకుంది. ఇవాళ 101వ ఎపిసోడ్ ప్రసారమైంది. కార్యక్రమంలో భాగంగా ప్రధాని ప్రసంగిస్తూ.. ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా ఆయన్ను గుర్తు చేసుకున్నారు. ఎన్టీఆర్ గొప్ప నటనా కౌశలంతో ఎన్నో చరిత్రాత్మక పాత్రలకు ఆయన జీవం పోశారని చెప్పారు. శ్రీరాముడు, శ్రీకృష్ణుడు పాత్రలను పోషించి ప్రజలను అలరించారన్నారు. ఇప్పటికీ రాముడు, కృష్ణుడు పాత్రల్లో ఎన్టీఆర్ నటనను జనం స్మరించుకుంటున్నారని చెప్పారు. బహుముఖ ప్రతిభతో ఎన్టీఆర్ సినీ రంగంలో పేరు ప్రతిష్టలు సంపాదించుకున్నారని తెలిపారు.

ఎన్టీఆర్ 300కు పైగా సినిమాల్లో నటించి ప్రేక్షకులను అలరించినట్లు మోడీ వివరించారు. కేవలం సినిమాల్లో మాత్రమే కాదని, రాజకీయ రంగంలో కూడా ఎన్టీఆర్ చెరగని ముద్ర వేశారని మోడీ ప్రశంసించారు. రాజకీయ రంగంలో కూడా అత్యున్నత స్థానాలు చేరుకున్నారని చెప్పారు. అలాగే వీర్ సావర్కర్ జయంతి సందర్భంగా ప్రధాని నివాళులు అర్పించారు. సావర్కర్ ను ఖైదు చేసిన అండమాన్ లోని కాలాపానీ జైలును సందర్శించిన రోజును తాను మర్చిపోలేనని ప్రధాని మోడీ తెలిపారు.

First Published:  28 May 2023 11:56 AM GMT
Next Story