Telugu Global
National

ఘోర ప్రమాదం.. 15 మంది మృతి

ట్రాక్టర్‌లో ఉన్నవారిలో 15 మంది ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయారు. మృతిచెందినవారిలో 8 మంది చిన్నారులు ఉన్నారు.

ఘోర ప్రమాదం.. 15 మంది మృతి
X

యాత్రికులతో హరిద్వార్‌ వెళుతున్న ట్రాక్టర్‌ ప్రమాదవశాత్తూ చెరువులో పడిపోవడంతో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ట్రాక్టర్‌లో ఉన్నవారిలో 15 మంది ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయారు. మృతిచెందినవారిలో 8 మంది చిన్నారులు ఉన్నారు. ఉత్తరప్రదేశ్‌లో శనివారం ఈ దుర్ఘటన జరిగింది. దీనికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.

మాఘపూర్ణిమను పురస్కరించుకొని గంగా నదిలో పవిత్ర స్నానం ఆచరించేందుకు యాత్రికులు హరిద్వార్‌కు బయలుదేరారు. వారంతా ట్రాక్టర్‌లో వెళుతుండగా, కాస్‌గంజ్‌ వద్ద ట్రాక్టర్‌ అదుపు తప్పి చెరువులోకి బోల్తా పడింది. ఊహించని ప్రమాదంతో ఒక్కసారిగా ప్రయాణికులంతా హాహాకారాలు చేశారు. ట్రాక్టర్‌లో ఉన్నవారంతా ఒక్కసారిగా చెరువు నీళ్లలో పడిపోయారు. ఈ ఘటన జరిగిన వెంటనే స్థానికులు తక్షణమే స్పందించి కొంతమందిని కాపాడారు.

కానీ నీటిలో పడిపోవడంతో ఊపిరాడక 15 మంది ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. తక్షణ సహాయ చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో గాయపడినవారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల పరిహారం ప్రకటించారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు.

First Published:  24 Feb 2024 9:03 AM GMT
Next Story