Telugu Global
National

కేంద్ర ఐటీ నిబంధనలకు నో చెప్పిన వాట్సాప్‌.. – ఒత్తిడి చేస్తే భారత్‌ నుంచి వెళ్లిపోతామని వెల్లడి

వాట్సాప్‌ ద్వారా పంపించే కొన్ని మెసేజ్‌లు వైరల్‌ అవుతుంటాయి. వాటిని ముందుగా ఎవరు పంపించారో తెలియజేయాలనేది కేంద్ర ప్రభుత్వ ఐటీ విభాగం నిబంధన.

కేంద్ర ఐటీ నిబంధనలకు నో చెప్పిన వాట్సాప్‌.. – ఒత్తిడి చేస్తే భారత్‌ నుంచి వెళ్లిపోతామని వెల్లడి
X

కేంద్ర ఐటీ నిబంధనల్లో వినియోగదారుల గోప్యతకు భంగం కలిగించే నిబంధనలను అమలు చేసేందుకు వాట్సాప్‌ నో చెప్పింది. ఢిల్లీ హైకోర్టులో దీనిపై జరుగుతున్న విచారణ సందర్భంగా ఈ విషయాన్ని వాట్సాప్‌ సంస్థ తరపు న్యాయవాది తేజస్‌ కరియా న్యాయస్థానానికి తెలియజేశారు. 2021 ఐటీ నిబంధనల ప్రకారం.. మెసేజింగ్‌ యాప్‌ చాట్‌లను ట్రేస్‌ చేసేలా, వాటిని మొదటగా ఎవరు పంపించారో గుర్తించేలా కంపెనీలు చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ నిబంధనలను సవాలు చేస్తూ వాట్సప్‌ మాతృసంస్థ అయిన ఫేస్‌బుక్‌ కోర్టును ఆశ్రయించింది.

దీనిపై ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి మన్మోహన్, జస్టిస్‌ మన్మీత్‌ ప్రీతమ్‌ సింగ్‌ అరోరాలతో కూడిన ధర్మాసనం తాజాగా విచారణ చేపట్టింది. మెటా ఆధ్వర్యంలోని వాట్సాప్‌ మెసేజ్‌లకు సంబంధించి ఎన్‌క్రిప్షన్‌ విధానాన్ని అనుసరిస్తున్న విషయం తెలిసిందే. వినియోగదారుల గోప్యతకు పెద్దపీట వేస్తూ మెసేజ్‌లను ఎండ్‌–టు–ఎండ్‌ ఎన్‌క్రిప్ట్‌ చేస్తున్నందునే ప్రజలు ఈ యాప్‌ ను ఉపయోగిస్తున్నారని కరియా న్యాయస్థానానికి వివరించారు. అయితే ఈ విధానాన్ని బ్రేక్‌ చేయాలని ఒత్తిడి చేస్తే భారత్‌లో కార్యకలాపాలను రద్దు చేసేందుకైనా వాట్సాప్‌ సంస్థ వెనుకాడబోదని తెలిపారు.

వాట్సాప్‌ ద్వారా పంపించే కొన్ని మెసేజ్‌లు వైరల్‌ అవుతుంటాయి. వాటిని ముందుగా ఎవరు పంపించారో తెలియజేయాలనేది కేంద్ర ప్రభుత్వ ఐటీ విభాగం నిబంధన. దానిని వ్యతిరేకిస్తూ కోర్టులో వాట్సాప్‌ తరఫున కరియా వాదనలు వినిపించారు. వినియోగదారులు వ్యక్తిగతంగా, గ్రూప్‌లో షేర్‌ చేస్తున్న మెసేజ్‌లకు సంబంధించిన మూలకర్తలను గుర్తించాలంటే వాటిని డీక్రిప్ట్‌ చేయాల్సి ఉంటుందని కరియా అన్నారు. ఇందుకోసం లక్షల సందేశాలను చాలా ఏళ్లపాటు డేటా బేస్‌లో అట్టేపెట్టుకోవాల్సి ఉంటుందని చెప్పారు.

ఈ నేపథ్యంలో ఈ అంశాన్ని మరింత లోతుగా పరిశీలించాలని గమనించిన ధర్మాసనం.. ఇలాంటి చట్టం మరే దేశంలోనైనా ఉందా అని ప్రశ్నించింది. దాంతో కరియా స్పందిస్తూ ప్రపంచంలో మరెక్కడా ఇలాంటి నియమం లేదని తెలిపారు. అయితే.. మతపరమైన హింస వంటి కేసుల్లో సామాజిక మాధ్యమాల్లో అభ్యంతరకరమైన కంటెంట్‌ ప్రసారం అవుతున్నపుడు ప్రభుత్వ నియమం చాలా ప్రాధాన్యం సంతరించుకుంటుందని కేంద్రం తరఫు న్యాయవాది చెప్పారు. ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం విచారణను వాయిదా వేసినట్టు తెలిసింది. ఐటీ నిబంధనల్లో పలు అంశాలను సవాలు చేస్తూ దాఖలైన అన్ని ఇతర పిటిషన్ల విచారణను ఆగస్టు 14కు షెడ్యూల్‌ చేయాలని బెంచ్‌ ఆదేశించింది.

First Published:  26 April 2024 10:37 AM GMT
Next Story